IIT Madras IntelliSeat: రాత్రివేళల్లో గంటల తరబడి డ్రైవింగ్ చేస్తుంటే డ్రైవర్ అలసిపోవడం కామన్. ముఖ్యంగా లారీలు, బస్సులు, క్యాబ్లు నడిపే డ్రైవర్లు ఎక్కువసేపు స్టీరింగ్ పట్టుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు డ్రైవర్కు నిద్ర వస్తున్న విషయం అతడికే పూర్తిగా అర్థం కాకముందే కళ్లపై మత్తు ఆవరిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు స్మార్ట్ సీటును తయారు చేశారు. దీనికి ‘ఇంటెలీసీట్’ అని పేరు పెట్టారు.
చూడటానికి ఇది సాధారణ సీటులాగే కనిపిస్తుంది. కానీ, అసలు ప్రత్యేకత మొత్తం సీటు లోపలే ఉంటుంది. ఇందులో అమర్చిన సెన్సార్లు డ్రైవర్ ఎలా కూర్చున్నాడు? అతని శరీర భంగిమ ఎలా మారుతోంది? అలసట కారణంగా శరీరం ఎలాంటి కదలికలు చేస్తోంది? అనే అంశాలను గుర్తిస్తుంది. డ్రైవర్ ఎక్కువసేపు వాహనం నడిపితే వీపు, భుజాలపై అలసట ప్రభావం పడుతుంది. ఆ ప్రభావం కారణంగా అతను సీటులో కూర్చునే విధానం కూడా మారుతుంది. ఈ మార్పులను సెన్సార్లు గుర్తించి, డ్రైవర్ అలసిపోతున్నాడా? లేదా? అనే విషయాన్ని అంచనా వేస్తాయి.
డ్రైవర్ అలసటను గుర్తించడానికి ఇప్పటికే కెమెరా ఆధారిత వ్యవస్థలు ఉన్నాయి. కొన్ని పరికరాలు కళ్ల కదలికలను పరిశీలిస్తాయి. మరికొన్ని ప్రత్యేక సెన్సార్లు, ఎలక్ట్రోడ్లను ఉపయోగిస్తాయి. అయితే, ఇంటెలీసీట్లో డ్రైవర్ ప్రత్యేకంగా ఏ పరికరాన్ని ధరించాల్సిన అవసరం ఉండదు. సీటులో కూర్చుంటే చాలు.. అందులోని సెన్సార్లు తమ పని ప్రారంభిస్తాయి. సెన్సింగ్, డేటా ప్రాసెసింగ్, తర్వాత హెచ్చరిక ఇవ్వడం అనే విధానంలో ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాంకేతికతను కూడా ఇందులో ఉపయోగించారు.
డ్రైవర్ లో అలసట కనిపిస్తే ముందుగా డాష్ బోర్డ్ పై లైట్ ద్వారా హెచ్చరిక ఇస్తుంది. అలసట మరింత పెరిగితే సౌండ్ అలర్ట్ వస్తుంది. ప్రమాదకర స్థాయిలో డ్రైవర్ నిద్రలోకి జారుకునే పరిస్థితి వస్తే సీటు వైబ్రేట్ అవుతుంది. అంటే, కేవలం ఒక హెచ్చరికతో ఆగిపోకుండా, పరిస్థితి తీవ్రతను బట్టి పలు దశల్లో డ్రైవర్ను అప్రమత్తం చేసేలా ఈ సిస్టమ్ను రూపొందించారు. అవసరమైతే వాహనం యజమానికి కూడా సమాచారం పంపే అవకాశం ఉంది.
ఈ స్మార్ట్ సీటుకు మరో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే.. ఇది వాహనం కంప్యూటర్ వ్యవస్థతో పూర్తిగా అనుసంధానం కావాల్సిన అవసరం లేదు. అందువల్ల ఇప్పటికే రోడ్లపై నడుస్తున్న ట్రక్కులు, బస్సులు, ఇతర వాహనాల్లో కూడా అమర్చే అవకాశం ఉంటుంది. వెహికల్ స్టార్ట్ అయిన తర్వాత డ్రైవర్ కదలికలను గమనించడం ప్రారంభిస్తుంది. మొబైల్ యాప్ ద్వారా సమాచారాన్ని పంపే విధంగా కూడా దీనిని రూపొందించవచ్చు.
దేశంలో రోడ్డు ప్రమాదాలకు మానవ తప్పిదం ప్రధాన కారణాల్లో ఒకటి. అందులో డ్రైవర్ అలసట, నిద్రమత్తు కీలకంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో డ్రైవర్ పూర్తిగా నిద్రలోకి వెళ్లే ముందే హెచ్చరిక అందితే ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉంటుంది.
Read Also: సర్వీస్ సెంటర్కు షాక్.. ఇంట్లోనే EV బ్యాటరీని రిపేర్ చేసిన ఇంజనీరింగ్ విద్యార్థి!