EV Control Centres: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం బాగా పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు సపోర్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది. యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ ప్రెస్ వేలలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం స్పెషల్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. EV రోడ్ సైడ్ అసిస్టెన్స్(RSA), ఆన్ రోడ్ సర్వీసెస్(ORS) హబ్ లను ఏర్పాటు చేయనుంది. ప్రతిపాదిత సౌకర్యాలు, రియల్ టైమ్ రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఛార్జింగ్ పాయింట్లను మెరుగుపరుచనుంది. ఈ నిర్ణయంతో ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు సుదూర ప్రయాణం సులభతరం కానుంది. దేశంలో తొలిసారి ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే మీద ఈ సౌకర్యాలను అమలు చేయనుంది. ఆ తర్వాత ఇతర ఎక్స్ ప్రెస్వేలకు విస్తరించేలా ప్రణాళికలు చేస్తోంది.
EV సపోర్ట్ కోసం ప్రతిపాదిత కేంద్రాలు వాహన తయారీదారులు, ఫ్లీట్ ఆపరేటర్లు, ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్లతో ప్రభుత్వ,ప్రైవేట్ భాగస్వామ్య పద్దతిలో పని చేసే అవకాశం ఉంది.ఈ సౌకర్యాలు వ్యక్తిగత EV వినియోగదారులకు మెయింటెనెన్స్ సపోర్టును అందిస్తాయి. ఎక్స్ ప్రెస్వేలలో వే సైడ్ సౌకర్యాల కోసం EV కేంద్రీకృత మౌలిక సదుపాయాలను కల్పించడానికి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు సవరణలను చేసే దిశగా అడుగులు వేస్తోంది.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 1,300 కి.మీ. పొడవైన ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే ఈ మోడల్ను అమలు చేసే తొలి సుదూర కారిడార్ గా గుర్తింపు తెచ్చుకోనుంది. ఇది రెండు ప్రధాన మెట్రోపాలిటన్ ప్రాంతాల మధ్య ఎండ్ టు ఎండ్ EV సపోర్టివ్ రూట్గా మారనుంది. ఛార్జింగ్ పాయింట్లు మాత్రమే కాకుండా విమానయాన రంగంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఎలా కలిసి పనిచేస్తాయో అదే విధంగా హైవేలపై EV వినియోగదారులకు మద్దతు ఇచ్చే వ్యవస్థను క్రియేట్ చేయాలని కేంద్రం భావిస్తోంది.
ప్రతిపాదిత PPP మోడల్ ప్రకారం ప్రైవేట్ కంపెనీలు, RSA, ORS సేవలను నిర్వహించేందుకు కేంద్రం అనుమతి ఇస్తుంది. ఇందులో సబ్స్క్రిప్షన్ ఆధారిత సాయంతో పాటు డేటా ఆధారిత ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, వెహికల్ టెలిమాటిక్స్ సిస్టమ్ ప్రకారం సర్వీసులు అందిస్తారు.
Read Also: జస్ట్ రూ. 3.5 లక్షలకే 1200 కి.మీ రేంజ్, మార్కెట్లోకి సూపర్ ఎలక్ట్రిక్ కారు!
ఢిల్లీ-ముంబై కారిడార్ తో పాటు ప్రధాన మెట్రోపాలిటన్ క్లస్టర్లను అనుసంధానించే ఇతర ఎక్స్ ప్రెస్వేలు, జాతీయ రహదారులపై ఈ మోడల్ హబ్ లను ఏర్పాటు చేయాలని కేంద్ర రోడ్డు రవాణాశాఖ భావిస్తోంది. రోజువారీ పట్టణ ప్రయాణాలకు మించి ఎలక్ట్రిక్ మొబిలిటీని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తోంది. ఈ హబ్ లు దేశంలో సుదూర EV ప్రయాణానికి గేమ్ ఛేంజర్లుగా మారబోతున్నాయి.
Read Also: క్రెటా, కియా, సెల్టోస్.. రూ.15 లక్షల లోపు బెస్ట్ SUV ఏదంటే?