Nissan Patrol India Entry: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జపనీస్ ఎస్యూవీ తొలిసారిగా భారత మార్కెట్లోకి రానుంది. ఆఫ్ రోడ్ సామర్థ్యం, ఇంజిన్ పవర్, రోడ్ ప్రెజెన్స్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ కారు భారతీయ కార్ లవర్స్ ను అలరించబోతోంది. ఈ విభాగంలో ఎప్పటి నుంచో రెండు మోడళ్లు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. వాటిలో ఒకటి టయోటా ల్యాండ్ క్రూయిజర్ కాగా, మరొకటి నిస్సాన్ ప్యాట్రోల్. ల్యాండ్ క్రూయిజర్ ఇప్పటికే భారత్ లో అందుబాటులో ఉండగా, ప్యాట్రోల్ తొలిసారి భారతీయ రోడ్లపైకి రావడానికి సిద్ధమవుతోంది.
నిస్సాన్ కంపెనీ కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నప్పటికీ, ఇప్పుడు మళ్లీ తన సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్యాట్రోల్ లాంటి పాపులర్ మోడల్ ను భారత్ లోకి ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ ఎస్యూవీ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో మంచి పేరు సంపాదించుకుంది. దీని ఆఫ్ రోడ్ సామర్థ్యం, బలమైన నిర్మాణం, అద్భుతమైన డిజైన్ కారణంగా ప్రత్యేక గుర్తింపు పొందింది.
ప్యాట్రోల్ దాదాపు 5.18 మీటర్ల పొడవు కలిగిన పెద్ద ఎస్యూవీ. దీని భారీ ఆకారం రోడ్డుపై ప్రత్యేకంగా కనిపిస్తుంది. బయట డిజైన్ సాధారణంగా కనిపించినప్పటికీ, లోపల సౌకర్యవంతమైన ఇంటీరియర్ ఉంటుంది. కుటుంబంతో ప్రయాణించడానికి మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. ఫీచర్ల పరంగా కూడా ఇది చాలా ముందుంది. ట్రి జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆధునిక ADAS భద్రతా వ్యవస్థ, పవర్డ్ టెయిల్ గేట్, పెద్ద ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే లాంటి పలు సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. అదనంగా వెనుక సీట్ల కోసం ప్రత్యేక ఎంటర్ టైన్మెంట్ స్క్రీన్లు, వైర్ లెస్ ఛార్జింగ్, హెడ్స్ అప్ డిస్ ప్లే లాంటి ప్రీమియం ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎయిర్ సస్పెన్షన్ కారణంగా ప్రయాణం మరింత అహ్లాదకరంగా ఉంటుంది.
ఇంజిన్ విషయానికి వస్తే, అంతర్జాతీయ మార్కెట్లలో రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి 3.5 లీటర్ ట్విన్ టర్బో V6 ఇంజిన్. ఇది ఎక్కువ శక్తిని అందిస్తుంది. మరొకటి 3.8 లీటర్ V6 ఇంజిన్. భారతదేశంలో వీటిలో 3.8 లీటర్ ఇంజిన్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ రెండు ఇంజిన్లు 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్, 4WD సిస్టమ్తో వస్తాయి. అయితే డీజిల్ ఇంజిన్ ఆప్షన్ లేకపోవడం కొంతమందికి నిరాశ కలించనుంది.
ధర విషయానికి వస్తే, ఈ వాహనం చాలా ఖరీదుగా ఉంటుంది. దీనిని పూర్తిగా దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని ధర సుమారు రూ. 2.5 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ఈ ధరతో ప్రీమియం సెగ్మెంట్లో పోటీ పడుతుంది. ఈ ఎస్యూవీ 2027 విడుదల కానుంది. అయితే, కంపెనీ ఇతర మోడళ్లను కూడా ముందుగా విడుదల చేసే అవకాశం ఉండటంతో, ప్యాట్రోల్ లాంచ్ కొంత ఆలస్యమయ్యే అవకాశముంది. నిస్సాన్ ప్యాట్రోల్ భారత మార్కెట్లోకి రావడం ఎస్యూవీ ప్రియులకు గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. దీని పవర్, సామర్థ్యం, ప్రీమియం ఫీచర్లు దీనికంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకురానున్నాయి.
Read Also: నీటితో నడిచే కారు వచ్చేసింది.. ఈవీ దుకాణాలు ఇక బంద్!