Indian Railway: రైళ్లలో ప్రయాణించే సమయంలో చాలా మంది ప్రయాణికులు టీ, కాఫీ, వాటర్ బాటిళ్లు, భోజనం కొనుగోలు చేస్తుంటారు. కొన్నిసార్లు విక్రేతలు నిర్ణయించిన ధర కంటే ఎక్కువ డబ్బు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు తరచుగా వినిపిస్తుంటాయి. చాలా మందికి అలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో తెలియక అదనపు డబ్బు చెల్లించి సైలెంట్ గా తీసుకుంటారు. కానీ, భారతీయ రైల్వే, ఐఆర్సిటిసి ప్రయాణికుల అలాంటి సమయంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తుంది. ప్రయాణికులు హక్కులను కాపాడేందుకు స్పష్టమైన నిబంధనలు అమల్లో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐఆర్సిటిసి గైడ్ లైన్స్ ప్రకారం.. రైళ్లలో విక్రయించే అన్ని ఫుడ్, డ్రింక్స్ ధరలు ముందుగానే నిర్ణయిస్తారు. విక్రేతలు ఆ ధరల కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేయడానికి అనుమతి లేదు. మెనూలో చూపించిన ధర కంటే ఎక్కువ డబ్బు అడిగితే నిబంధనల ఉల్లంఘన అవుతుంది. అలాంటి సందర్భాల్లో ప్రయాణికులు వెంటనే స్పందించాలి. ప్రతి విక్రేత దగ్గర తప్పనిసరిగా మెనూ కార్డు ఉండాలి. అందులో అందుబాటులో ఉన్న ఆహార పదార్థాల పేర్లు, వాటి ధరలు స్పష్టంగా చూపించాలి. ఒకవేళ విక్రేత మెనూ చూపించకుండా, ధరలు చెప్పకుండా ఎక్కువ డబ్బు అడిగితే, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి. మెనూ కార్డు చూపించకపోవడం కూడా రైల్వే నిబంధనలకు వ్యతిరేకమే.
అంతేకాదు, రైల్లో ఏ వస్తువు కొనుగోలు చేసినా బిల్లు తీసుకోవడం ప్రయాణికుల హక్కు. బిల్లులో వస్తువు పేరు, ధర, తేదీ లాంటి వివరాలు ఉంటాయి. ఒకవేళ ప్రయాణికుడు ఫిర్యాదు చేయాల్సి వచ్చినప్పుడు ఈ బిల్లు ఆధారంగా ఉపయోగపడుతుంది. అందుకే బిల్లు ఇవ్వకుండా డబ్బు చెల్లించకూడదని అధికారులు సూచిస్తున్నారు.
ఒకవేళ విక్రేత అధిక ధర వసూలు చేస్తే వెంటనే ప్రశ్నించాలి. ఎక్కువ డబ్బు తీసుకున్నట్లు అనిపిస్తే ఆలస్యం చేయకుండా ఫిర్యాదు చేయడం మంచిది. ఇందుకోసం భారతీయ రైల్వే 139 హెల్ప్ లైన్ సర్వీసు అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు కాల్ చేయడం ద్వారా లేదంటే ఎస్ఎంఎస్ పంపించడం ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. అంతేకాకుండా రైలులో ఉన్న TTE, ఆర్పిఎఫ్ సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వవచ్చు. ఫిర్యాదు చేసేటప్పుడు పీఎన్ఆర్ నంబర్, కోచ్ నంబర్, సీట్ నంబర్, సంఘటన జరిగిన సమయం లాంటి వివరాలు ఇవ్వడం వల్ల అధికారులు త్వరగా స్పందించే అవకాశం ఉంటుంది. ఫిర్యాదు నిజమని విచారణలో తేలితే సంబంధిత విక్రేతపై కఠిన చర్యలు తీసుకుంటారు. జరిమానా విధించడం నుంచి లైసెన్స్ రద్దు వరకు చర్యలు ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో వారిని రైల్వే సేవల నుంచి పూర్తిగా తొలగించే అవకాశం కూడా ఉంటుంది. అదనంగా వసూలు చేసిన డబ్బు కూడా ప్రయాణికులకు తిరిగి ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం బిల్లు ఉండటం చాలా ముఖ్యం. అందుకే రైల్లో ఏ వస్తువు కొనుగోలు చేసినా ధరను ముందుగా తనిఖీ చేసి, తప్పనిసరిగా బిల్లు తీసుకోవడం మంచిది.
Read Also: 40 ఏళ్ల నాటి రైల్వే రిజర్వేషన్ సిస్టమ్కు గుడ్బై.. AI ఆధారిత టికెట్ సేవలు వచ్చేస్తున్నాయ్!