6 New Hybrid Launches: కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రభావంతో హైబ్రిడ్ కార్లు కొంత వెనుకబడినప్పటికీ, ఇప్పుడు పరిస్థితి మారుతోంది. పెట్రోల్ కార్లు, ఎలక్ట్రిక్ వాహనాల మధ్య బ్యాలెన్స్ అందించే హైబ్రిడ్ టెక్నాలజీపై కార్ల తయారీ సంస్థలు మళ్లీ దృష్టి సారిస్తున్నాయి. రాబోయే 12 నెలల్లో సుమారు ఆరు ప్రధాన ఆటోమొబైల్ కంపెనీలు భారత మార్కెట్లో కొత్త హైబ్రిడ్ లేదంటే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) మోడళ్లను విడుదల చేయడానికి రెడీ అవుతోంది.
ఇంధన ధరలు పెరగడం, కఠినమైన ఉద్గార నిబంధనలు అమల్లోకి రావడం, అలాగే EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై ఇంకా కొంతమంది వినియోగదారుల్లో ఉన్న సందేహాలు హైబ్రిడ్ వాహనాలకు మళ్లీ అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి. అందుకే, కంపెనీలు హైబ్రిడ్ టెక్నాలజీని అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఇప్పటి వరకు భారత హైబ్రిడ్ మార్కెట్ లో టయోటా, మారుతి సుజుకి మాత్రమే ఆధిపత్యం చెలాయించాయి. అయితే, ఇప్పుడు ఇతర కంపెనీలు కూడా ఈ విభాగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.
హైబ్రిడ్ కార్లపై ఎక్కువగా దృష్టి పెట్టిన కంపెనీల్లో కియా ఇండియా ముందుంది. 2030 నాటికి భారతదేశంలో తన మొత్తం అమ్మకాలలో 20 శాతం హైబ్రిడ్ వాహనాలే ఉండాలని కియా లక్ష్యంగా పెట్టుకుంది. అంటే సంవత్సరానికి దాదాపు 80 వేల హైబ్రిడ్ వాహనాలు విక్రయించాలని భావిస్తోంది. కియా తన పాపులర్ మోడళ్లైన కార్నివాల్, కేరెన్స్, సోనెట్, సెల్టోస్ కు హైబ్రిడ్ వేరియంట్లను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. న్యూ జెనరేషన్ హైబ్రిడ్ సిస్టమ్స ద్వారా ఖర్చులను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తోంది.
కియా అనుబంధ సంస్థ హ్యుందాయ్ కూడా తొలిసారిగా భారత మార్కెట్లో హైబ్రిడ్ కారును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే విక్రయించిన హ్యుందాయ్, 2027లో తన తొలి హైబ్రిడ్ మోడల్ను విడుదల చేయనుంది.
యూరోపియన్ కంపెనీలు కూడా ఈ పోటీలోకి వస్తున్నాయి. రెనాల్ట్ కొత్త డస్టర్ SUV హైబ్రిడ్ వెర్షన్ ను ఈ ఏడాది దీపావళి సమయంలో విడుదల చేసే అవకాశముంది. రానున్న బిగ్స్టర్ SUVలో కూడా హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ను అందించే అవకాశం ఉంది. నిస్సాన్ కూడా ఇదే దారిలో నడుస్తోంది. రెనాల్ట్ డస్టర్ ప్లాట్ ఫారమ్ ఆధారంగా రూపొందిస్తున్న కొత్త మిడ్ సైజ్ SUVలో హైబ్రిడ్ ఆప్షన్ ను అందించవచ్చని సమాచారం.
ఇక ప్లగ్ ఇన్ హైబ్రిడ్ సెగ్మెంట్ లో కూడా పోటీ పెరగబోతోంది. JSW గ్రూప్ తన తొలి ప్యాసింజర్ వాహనాన్ని PHEV టెక్నాలజీతో తీసుకురానుంది. అలాగే చైనా దిగ్గజం BYD తన సీల్ యు ప్లగ్ ఇన్ హైబ్రిడ్ SUVను 2026 చివర్లో విడుదల చేయనుంది. పూర్తి బ్యాటరీ, పూర్తి ఇంధన ట్యాంక్ తో ఈ SUV 1,200 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. లగ్జరీ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ ఇటీవల కొత్త S-Class ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది కేవలం ఎలక్ట్రిక్ మోడ్లోనే 115 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. రాబోయే ఏడాదిలో భారత మార్కెట్లో హైబ్రిడ్ కార్ల పోటీ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
Read Also: ఈవీ మార్కెట్లో దుమ్మురేపిన TVS.. ఏకంగా 10 లక్షల స్కూటర్ల అమ్మకం!