India’s No.1 EV Tata Punch: భారత్ లో ఎలక్ట్రిక్ కార్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, పర్యావరణానికి అనుకూలమైన వాహనాలపై ప్రజలు ఆసక్తి చూపడం వల్ల ఈవీల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ కు చెందిన పంచ్.ఈవీ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది.
మే 2026లో ఇండియన్ మార్కెట్ లో మొత్తం 26,620 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఏప్రిల్ నెలతో పోలిస్తే భారీగా పెరిగింది. ఆ నెలలో 24,592 యూనిట్లు విక్రయమవగా, మేలో అమ్మకాలు 8.2 శాతం పెరిగాయి. ఈ వృద్ధిలో టాటా పంచ్.ఈవీ కీలక పాత్ర పోషించింది. మే నెలలో టాటా పంచ్.ఈవీ మొత్తం 3,681 యూనిట్లు సేల్ అయ్యాయి. ఏప్రిల్ తో పోలిస్తే ఇది దాదాపు 14 శాతం వృద్ధి సాధించింది. దీంతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనంగా ఈ కారు నిలిచింది.
పంచ్ ఈవీ విజయానికి ప్రధాన కారణం ఆకట్టుకునే డిజైన్, ఎస్యూవీ లుక్, చిన్న సైజు, అందుబాటు ధర. నగరాల్లో ఈజీ నడిపేందుకు అనుకూలంగా ఉండటంతో పాటు కుటుంబ వినియోగానికి కూడా ఈ కారు మంచి ఎంపికగా మారింది. అందుకే యువత నుంచి ఫ్యామిలీ వినియోగదారుల వరకు చాలా మంది దీనిపై ఆసక్తి చూపుతున్నారు.
ఇటీవల టాటా మోటార్స్ పంచ్.ఈవీ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త మోడల్లో 40 kWh బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉంది. ఈ బ్యాటరీతో ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 468 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ ప్రకటించింది. ఈ రేంజ్ కారణంగా సుదూర ప్రయాణాలకు కూడా ఈ కారు అనుకూలంగా మారింది.
కొత్త పంచ్.ఈవీలో కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు, కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్, 10.25 అంగుళాల పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఇవి డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ ను మరింత మెరుగుపరుస్తాయి.
ధర పరంగా కూడా ఈ కారు పోటీదారులతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. టాటా పంచ్.ఈవీ ప్రారంభ ధర రూ.9.69 లక్షలుగా ఉండగా, టాప్ వేరియంట్ ధర రూ.12.59 లక్షల వరకు ఉంది. అలాగే కంపెనీ అందిస్తున్న బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) స్కీమ్ వినియోగదారులను మరింత ఆకర్షిస్తోంది. ఈ పథకంలో కారు కోసం కేవలం రూ.6.49 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. బ్యాటరీ కోసం కిలోమీటరుకు రూ.2.6 చొప్పున చెల్లించే అవకాశం ఉంటుంది. అందుబాటు ధర, మంచి రేంజ్, ఆధునిక ఫీచర్లు, ఎస్యూవీ స్టైలింగ్ కారణంగా టాటా పంచ్ ఈవీ.. ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు తెచ్చుకుంది.
Read Also: 1000 కిమీ రేంజ్తో ఎంజీ కొత్త SUV.. భారత మార్కెట్ లో సంచలనం!