Volkswagen Smart Electric Bicycle: వోక్స్ వ్యాగన్ కార్లలో అందించే భద్రతా సాంకేతికతను ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిళ్ల ప్రపంచంలోకి తీసుకొచ్చింది. జర్మనీకి చెందిన n+ సంస్థతో కలిసి రూపొందించిన కొత్త ఎలక్ట్రిక్ సైకిళ్లను తాజాగా మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ సిరీస్ లో స్పోర్ట్, క్రాస్ ఓవర్ అనే రెండు మోడళ్లను విడుదల చేసింది. సాధారణ ఈ-బైక్ లతో పోలిస్తే వీటిలో అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లలో హ్యాండిల్ బార్ లోనే హై డెఫినిషన్ బ్యాక్ కెమెరాను అమర్చారు. దీనికి రాడార్ సిస్టమ్ కూడా యాడ్ చేశారు. వెనుక నుంచి వచ్చే వాహనాలను రైడర్ కు వెంటనే చూపిస్తూ బ్లైండ్ స్పాట్ అలర్ట్ లను అందిస్తుంది. దీంతో తరచూ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. ప్రయాణం మరింత సురక్షితంగా ఉంటుంది. భద్రత కోసం కంపెనీ ప్రత్యేకంగా రూపొందించిన స్మార్ట్ హెల్మెట్ కూడా అందిస్తోంది. ఈ హెల్మెట్ లో బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు యాక్సిలరోమీటర్ ఉంటుంది. ప్రమాదవశాత్తు పిల్లలు కిందపడితే వెంటనే గుర్తించి, ముందుగానే కుటుంబ సభ్యులకు లేదంటే ఎమర్జెన్సీ కాంటాక్ట్ లకు ఆటోమేటిక్గా మెసేజ్ పంపిస్తుంది. దీంతో అవసరమైన సమయంలో వెంటనే సహాయం అందే అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా స్మార్ట్ గ్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి రైడర్ కళ్ల ముందే అవసరమైన సమాచారాన్ని చూపిస్తాయి. మరోవైపు స్మార్ట్ లైటింగ్ సిస్టమ్ ద్వారా బైక్ ఫ్రేమ్పై అమర్చిన LED లైట్లు బ్రేక్ వేస్తే ఎరుపు రంగులో, మలుపు తిరిగేటప్పుడు పసుపు రంగులో వెలుగుతాయి. అయితే ఈ LED సిగ్నలింగ్ విధానానికి కొన్ని యూరోపియన్ దేశాల్లో ఇంకా పూర్తి అనుమతి లభించలేదు.
పనితీరు విషయానికి వస్తే, ఈ ఈ-బైక్లో 250 వాట్ల సామర్థ్యం గల యమహా సెంటర్ మోటార్ను ఉపయోగించారు. రహదారి పరిస్థితులను బట్టి మోటార్ స్వయంగా పవర్ను సర్దుబాటు చేస్తుంది. ఈ బైక్ గరిష్ఠంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సింగిల్ ఛార్జ్ తో గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. అయితే ఇది రైడింగ్ విధానం, రహదారి పరిస్థితులు, వాతావరణాన్ని బట్టి మారవచ్చు. భద్రతను మరింత పెంచేందుకు 85 డెసిబెల్ సామర్థ్యం గల యాంటీ థెఫ్ట్ అలారం కూడా అందించారు. అలాగే ఆపిల్ Find My సపోర్ట్ ఉండటంతో బైక్ ఎక్కడ ఉందో సులభంగా గుర్తించవచ్చు.
ప్రస్తుతం కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో ఈ మోడళ్లకు ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది. ముందుగా బుక్ చేసుకునే వారికి సుమారు 699 డాలర్ల విలువైన స్మార్ట్ వ్యూ టెక్నాలజీ ప్యాకేజీని అదనపు ఛార్జీ లేకుండా అందిస్తున్నారు. భారత మార్కెట్లో ఎప్పుడు విడుదల చేస్తారు, ధర ఎంత ఉంటుందనే విషయంపై మాత్రం కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
Read Also: టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?