ఇప్పుడు ఈ కేసీఆర్ ముచ్చట అవసరమా? అని అనుకుంటున్నారా? అవును.. ఆయనకు ఏం పని ఉంది.. ఫామ్హౌజ్లో తీరికగా ఉన్నాడు కదా.. జనాల గోడు పట్టించుకోవడం లేదు… బయటకు రావడం లేదు..అంతా కొడుకుకే వదిలేసిండు.. అందుకే తాపీగా పేపర్లు చదవుకుంటా కూర్చుంటాడు. మూడు గంటల కాకపోతే ఆరు గంటలు.. ఇదీ ఓ వార్తేనా? అని అనకుండా.. అనుకోకుండా..అసలు ఈ వార్త ఇప్పుడే ఎందుకు వార్తగా మారిందో నేను చెప్తాను.. కొంచెం ఓపిక పడితే..!
మొన్నటి మొన్న ఓ పత్రిక వార్షికోత్సవ సభ జరిగింది. దీనికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. పత్రికా విలువలు.. ప్రజాస్వామ్యం.. అనే టాపిక్ మీద మాట్లాడాలి. కానీ అక్కడ కేటీఆర్ మాట్లాడింది… సోషల్ మీడియా శకం గురించి. మెయిన్ మీడియను ఎవరూ పట్టించుకోవడం లేదని. అసలు జర్నలిస్టులు జర్నలిజం చేయడం లేదని. జెన్జీ పత్రికలు చదవటం లేదని. సోషల్ మీడియా ద్వారానే వార్తలు తెలసుకుంటున్నారని. నిజాలు రాయడం మెయిన్ మీడియా మరిచిపోయి చాలా దినాలైందని. అధికార పార్టీకి కొమ్ముకాసేందుకే మీడియా మోకరిల్లుతుందని.
ఇలా ఏవేవో అన్నీ చెప్పాడు. బాగానే ఉంది. కానీ ఒకవేలు అటు చూపితే మిగిలిన నాలుగు వేళ్లు తననే చూపినట్టు.. పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు వీళ్లు చేసింది కూడా అదే. కేసీఆర్.. మీడియాను బెదిరించి లొంగదీసుకున్న చరిత్ర ఉండనే ఉంది. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా.. అందుకే కోపం వస్తున్నట్టుంది. తప్పుగా కనిపిస్తున్నట్టుంది. అలాగని.. మీడియా మొత్తం నిజాలే రాయడం లేదని, బెండయిందని, తలొగ్గిందని, మోకరిల్లిందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం మూలంగా.. కేటీఆర్కే నష్టం. కేటీఆర్ మీడియాను బహిష్కరించడం కాదు.. మీడియానే కేటీఆర్ను బహిష్కరిస్తుంది. అదే చేస్తున్నది. ఏమైనా చేసుకోండి.. నాకు నా సోషల్ మీడియా ఉంది. అది చాలు.. అన్నట్టుగానే ఓ బహిరంగ వేదిక మీద కేటీఆర్ మాట్లాడటం అతని అహంకార ప్రదర్శనగానే చూశారు. మారని నేతగానే భావించారు.
ఇక అసలు ముచ్చటకు వద్దాం. ఇదే వేదిక మీద మరో ఆణిముత్యాన్ని వదలాడు కేటీఆర్. తను పేపర్ చదవడం మానేశాడట. టీవీల్లో న్యూస్ చూడటం కూడా మానేశాడట. ఎప్పట్నుంచో తెలుసా..? తాము ఓడిపోయినప్పటి నుంచి అట. అంటే దాదాపుగా మూడేండ్లుగా కేటీఆర్ న్యూస్ పేపర్స్ చదవటం లేదు. టీవీ న్యూస్ చూడటం లేదు. ఓన్లీ సోషల్ మీడియాలోనే బతుకుతున్నాడు. కానీ కేసీఆర్ మాత్రం ఇప్పటికీ పొద్దున లేవగానే న్యూస్ పేపర్స్ చదువుతాడు. కచ్చిత0గా వాటికో మూడు గంటలు కేటాయిస్తాడు. ఎడిటోరియల్స్ను కూడా చదవడం కేసీఆర్ కు మొదటి నుంచే అలవాటు.
ఎవరైనా మంచిగా రాస్తే వారికి ఫోన్ చేసి అభినందిస్తారు. లేదా తన బహిరంగ వేదికల మీదే ఈ ఎడిటోరియల్స్ అంశాన్ని తీసుకొస్తాడు. అంతగా వాటిని అధ్యయనం చేస్తాడు. తెలియని విషయాలు తెలుసుకుంటాడు. ఎవరేమనుకుంటున్నారో నాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇప్పడు ఖాళీగా ఉన్నాడు కాబట్టి పేపర్లు చదవటం కాదు.. తన అపారమైన రాజకీయ జీవితంలో ఆది నుంచి దీన్ని అలవాటుగా మార్చుకున్నాడు. అదే కంటిన్యూ చేస్తున్నాడు.
కానీ కేటీఆర్ ఇంకా సీఎం కాకముందే పేపర్లు చదవటం ఆపేశాడు. అధ్యయనం లేదు. ఓన్లీ వైరల్ కంటెంట్ కావాలి. పనిలో పనిగా జర్నలిజాన్ని తిడుతున్నాడు. మీడియానూ ఆడిపోసుకుంటున్నాడు. మరి ఇవే కదా అతని రాజకీయ జీవితాన్ని వదలకుండా హచ్ కుక్కపిల్లలా వెంట నడిచేవి. వేటాడేవి. గంజిలో ఈగ లెక్క తీసేస్తే.. అవీ అదే చేస్తాయి. ఎవరికి నష్టం.
నాన్న నుంచి మంచి విషయాలు తెలుసుకోవాలి కదా? వాటిని అనుసరించాలె కదా? కేటీఆర్ ఈ విషయంలో తండ్రిని లెక్క చేయడం లేదు. నేను కేసీఆర్ అంత మంచోడిని కాదురోయ్..!అనడంలోనే ఇనవ్నీ దాగున్నాయమన్నమాట.
ఇంకో మాట.. సేమ్ టు సేమ్ కేసీఆర్ లాగే కవిత కూడా పత్రికల్లో వార్తలకు ప్రయార్టీ ఇస్తారు. పేపర్లన్నింటినీ ఓసారి కాచివడబోస్తారు. ఆమే చెప్పారు ఓ వేదిక మీద. అంతే కాదు.. తన పార్టీ లీడర్లు, క్యాడర్ కూడా పత్రికలు చదవాలన్నారు. ఉత్త ఉత్తగా తిప్పేయడం కాదు.. లోతుగా చదవి విషయ పరిజ్ఞానం పెంచుకోవాలని కూడా సూచించారు. ఎంత తేడా? నిరంతర అధ్యయనం ఒకరిది.. అంతా నాకు తెలుసనే మిడిసిపాటు మరొకరిది.