Telangana High Court: హైకోర్టు ఇటీవల ఉచిత పథకాలు, వాటి వల్ల సమాజం, ప్రభుత్వ వ్యవస్థలపై పడుతున్న భారంపై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఆలోచింపజేసేలా ఉన్నాయి. న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం ఒక తీర్పుకు సంబంధించినవి మాత్రమే కాకుండా, ప్రస్తుత సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. అర్హతలతో సంబంధం లేకుండా అందరికీ పథకాలు అందించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై పడుతున్న భారాన్ని, భవిష్యత్ తరాలకు జరగబోయే నష్టాన్ని ఆయన ఎత్తి చూపారు.
కోటీశ్వరులకు ఉచిత పథకాలు.. హైకోర్టు ఫైర్
సమాజంలో నిజంగా అవసరమైన వారికి సాయం అందడం మంచిదే. అయినా, ఉచిత పథకాలు కోటీశ్వరులకు కూడా అందుతుండటం పై కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉదాహరణకు ‘రైతుబంధు’ వంటి పథకం ద్వారా ఎంతోమంది సంపన్నులు కూడా లబ్ధి పొందుతున్నారని, దీనివల్ల ప్రభుత్వానికి అనవసర భారం పడుతోందని వ్యాఖ్యానించింది. ‘ఒకప్పుడు ఈ దేశానికి మేమేం చేశాం అని ఆలోచించేవాళ్లం, కానీ ఇప్పుడు ఈ దేశం మాకేమిచ్చింది అనే పరిస్థితికి వచ్చాం’ అని పేర్కొంది. గాంధీ, నెహ్రూ, ప్రకాశం పంతులు వంటి మహానీయులను చూసి స్ఫూర్తి పొందిన సమాజం, ఇప్పుడు కేవలం ఉచితాల కోసమే ఎదురుచూసేలా మారిపోవడం విచారకరమని అభిప్రాయపడింది.
అధికారుల పరిస్థితి, కోర్టు ధిక్కరణ కేసులు
ప్రభుత్వాలు చేసే తప్పిదాల వల్ల ఐఏఎస్ అధికారులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాపై ఏకంగా 3,000 నుండి 4,000 కేసులు ఉండటం, అందులో వందకు పైగా కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్లో ఉండటంపై విచారం వ్యక్తం చేసింది. సందీప్ సుల్తానియా మంచి అధికారి. కానీ వ్యవస్థలోని లోపాల వల్ల ఆయన జీవితకాలం జైల్లోనే ఉండాల్సిన పరిస్థితులు తెస్తున్నారని వ్యాఖ్యానించింది. ‘మీరే ముఖ్యమంత్రి అయితే ఈ కేసులపై ఏం చేస్తారు?’ అని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది.
Also Read: చంద్రుడిని ఢీ కొట్టిన రాకెట్.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!
చదువు పేరిట దుర్వినియోగం
ఉచిత పథకాల వల్ల పల్లెటూర్లలో పనిచేయడానికి కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతుల పరిస్థితి ఘోరంగా తయారైందని కోర్టు పేర్కొంది. ప్రభుత్వాలు ఉచితంగా ఇస్తుంటే మేమెందుకు పనిచేయాలనే ధోరణి పెరుగుతోందని, భవిష్యత్తులో ‘ఒకప్పుడు మనుషులు పనిచేసేవారట’ అని చెప్పుకునే రోజులు వచ్చినా ఆశ్చర్యం లేదంది. అలాగే ఇంజనీరింగ్ కళాశాలల్లో కొందరు విద్యార్థులు కాలేజీలకు వెళ్లకుండా యాజమాన్యాలను బ్లాక్మెయిల్ చేస్తున్నారన్నారు.అయితే సరిగ్గా చదివేవారికి ఫీజులు చెల్లించాలి తప్ప, చదువు మానేసిన వారికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం సరైంది కాదని స్పష్టం చేసింది.
భవిష్యత్తుకు ప్రమాద హెచ్చరికలు
కోటి 15 లక్షల కుటుంబాలకు ఉచిత పథకాలు ఇస్తూ పోతే దేశాన్ని ఎలా నడుపుతారని కోర్టు ప్రశ్నించింది. ఇదే పరిస్థితి కొనసాగితే చివరికి ఆ కుబేరుడు కూడా ఖజానా ఖాళీ అయి ‘పనికి ఆహార పథకం’ కింద కూలీకి రాక తప్పదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇవి రాజకీయ విమర్శలు కావు, ఒక పౌరుడిగా భవిష్యత్ తరాల భద్రతను దృష్టిలో ఉంచుకుని చెప్తున్న ఆవేదన అని, సమాజంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయని హెచ్చరించింది.
Also Read: కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి- మంత్రి అడ్లూరి లక్ష్మణ్