ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇంటనే ఓడితే.. అందుకే సిరిసిల్లాపై నజర్ పెట్టాడు తాజాగా కేటీఆర్. అసలే అరకొర గెలుపు అక్కడ. ఇప్పుడు కవిత నజర్ కూడా సిరిసిల్లాపైనే పెట్టారు. అవకాశం దొరికినప్పుడల్లా సిరిసిల్లా గడ్డపైకి వెళ్లి అన్నను తుక్కు తుక్కు తిడుతూనే ఉన్నారు. నేరెళ్ల బాధితుల అంశంలో మొన్న సూటిగా తొమ్మిది అంశాలను లేవనెత్తి కేటీఆర్ను సూటిగా ప్రశ్నించారు కవిత.
అంతకు మందు తన టీఆరెస్ జెండా పండుగ సందర్భంగా కూడా టూరిస్ట్ ఎమ్మెల్యేగా కేటీఆర్ను టార్గెట్ చేశారామె. దీంతో కేటీఆర్కు ఇక సిరిసిల్లాపై గురి పెట్టక తప్పలేదు. అందుకే కంటి వెలుగు పథకంతో ఎంట్రీ ఇచ్చాడు తన ఇలాఖాలోకి. కేసీఆర్ పాలనలో ఉన్న కంటివెలుగు పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ ఎత్తేసింది. చాలా పథకాలను ఈ ప్రభుత్వం కొనసాగించడం లేదు.
వాస్తవానికి కంటి వెలుగు పథకానికి ఖర్చు కూడా పెద్దగా ఉండదు. అందుకే దీన్ని ఎంచుకున్నట్టున్నాడు కేటీఆర్. తన నియోజకవర్గంలోని వీరన్నపల్లిలో దీన్ని ఇవాళ ప్రారంభించాడు.అక్కడి ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి.. అవసరమైన వారికి కంటి అద్దాలు అందించారు. 171 మందికి ఆపరేషన్లు చేస్తామని ప్రకటించాడు. త్వరలో ఈ పథకాన్ని జిల్లా మొత్తంగా విస్తరిస్తామని కేటీఆర్ ఆ వేదికగా హామీ ఇచ్చాడు.
పెద్దగా రాజకీయ విమర్శలకు తావు లేకుండా.. రేవంత్ సర్కార్ కూడా కంటి వెలుగు పథకాన్ని కంటిన్యూ చేసేదుండే అని కామెంట్ చేశారు. మంచి పథకాలను కొనసాగించాల్సిందేనని.. కేసీఆర్ అది చేసి చూపారని, ఆరోగ్య శ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను ఉటంకించాడు. కేసీఆర్ కిట్ కూడా ఆగిపోయిందని, ఇది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచిందన్న కేటీఆర్.. అవసరమైతే దీనికి ఇందిరమ్మ కిట్ అని పెట్టుకుని కొసాగించేది ఉండేనని సెటైరికల్గా మాట్లాడాడు.
అంతేకాదు.. అధికారం శాశ్వతం కాదన్న కేటీఆర్.. ఓడినా గెలిచినా ప్రజలతోనే ఉంటామనే కొత్త మాట మాట్లాడారు. మొన్నటి వరకు అసలు మేమే రాబోతున్నాం.. మా గెలుపు తథ్యం అన్న ఆయన ఇప్పుడు ఓడినా గెలిచినా అనే మాటలు.. జనాలతో కనెక్టు కావడానికే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మేమే వస్తున్నామనే పదే పదే చెప్పడం మూలంగా ప్రజాతీర్పును ముందే లాగేసుకున్నట్టు, అహంకార పూరితంగా కామెంట్ చేసినట్టుగా జనాల్లోకి వెళ్తున్న క్రమాన్ని గమనించిన కేటీఆర్ ఇలా తన మాట సందర్భాన్ని బట్టి మారుస్తున్నాడన్న మాట. కంటి వెలుగు పథకం జనాలతో పాటు కేటీఆర్కు కూడా అప్లై అవుతోంది. ఆయన కూడా తన దృష్టి మాంద్యం నుంచి వెలుగులోకి చూస్తున్నట్టుగా ఉంది.
కూటి కోసం కోటి విద్యలు .. అన్నట్టుగా…. ఇప్పుడు తన గెలుపు కోసం కంటి వెలుగు పథకం అమలు అన్నమాట. మరి సిరిసిల్లా జిల్లాతో పాటు అన్ని జిల్లాలకూ దీన్ని విస్తరిస్తే ఇంకా మేలు జరుగుతుంది కదా రామన్నా.. ఆగిపోయిన పథకాలు కూడా స్టార్ట్ చేసేయ్.. ఎలాగూ పార్టీ ఫండ్ వేల కోట్లు ఉండనే ఉంది. మీకు మంచి పేరు.. సర్కార్ది చేతగాని తనం అనుకుంటారు. ఏమంటావు?