BJP Telangana: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో సర్ పై కాంగ్రెస్ దుష్ప్రచారానికి చెక్ పెట్టాలని, ప్రజలకు వాస్తవాలు వివరించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధుల కీలక సమావేశంలో నిర్వహించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ అధ్యక్షతన రాష్ట్ర అధికార ప్రతినిధుల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణలో ఇటీవల పూర్తయిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ, పార్లమెంట్లో కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరు, ఝార్ఖండ్లో పేపర్ లీకేజీ వ్యవహారం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు.
అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు..
తెలంగాణలో సర్ ప్రక్రియపై కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ తప్పుడు ప్రచారం చేస్తోందని సమావేశం అభిప్రాయపడింది. డిజిటలైజ్ కాని 73.52 లక్షల ఫారాలు ఓట్లు తొలగించినట్లు అర్థం కాదని, అవి కేవలం భౌతిక పరిశీలన అవసరమైన కేటగిరీకి చెందినవేనని స్పష్టం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే పెద్ద సంఖ్యలో ఫారాలు పెండింగ్లో ఉండటం అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు తలెత్తేలా చేస్తోందని పేర్కొంది. బోగస్, డూప్లికేట్, వలస ఓట్లను గుర్తించి శుద్ధి చేసేందుకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పరిశీలన చేపడుతోందని, నిజమైన ఓటర్ల హక్కులకు ఎలాంటి నష్టం జరగకుండా బీజేపీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అండగా ఉంటారని స్పష్టం చేసింది. తుది ఓటర్ల జాబితా వెలువడే వరకు ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని బీజేపీ విజ్ఞప్తి చేసింది.
కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు..
పార్లమెంట్లో రాహుల్ గాంధీ తీరు, కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిపై సమావేశంలో తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. విషయాలను పదేపదే మార్చడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, ప్రభుత్వం సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో సభ నుంచి వాకౌట్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ హిట్ అండ్ రన్ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన పార్లమెంట్ను అడ్డుకోవడం, ప్రజలకు ఉపయోగపడే బిల్లులపై చర్చ జరగకుండా రసాభాస సృష్టించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. ఝార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ, సీజీఎల్ పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారాలపై న్యాయం కోరుతున్న నిరుద్యోగ విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడాన్ని రాష్ట్ర పదాధికారుల మీటింగ్ లో తీవ్రంగా ఖండించారు.
హామీల విస్మరణపై క్షేత్రస్థాయిలో పోరాటాలు..
ఢిల్లీలో విద్యార్థుల సమస్యలపై మాట్లాడే రాహుల్ గాంధీ.. కాంగ్రెస్, జేఎంఎం ప్రభుత్వం పాలిస్తున్న ఝార్ఖండ్లో విద్యార్థులపై దాడులు జరుగుతున్నప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించింది. ఇతర విద్యార్థులకు ఒక న్యాయం, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మరో న్యాయమా? అని నిలదీశారు. పేపర్ లీకేజీలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం సరికాదని పేర్కొంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని సమావేశం విమర్శించింది. హామీల విస్మరణపై క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయనున్నట్లు ఈ సమావేశంలో నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు వాస్తవాలు, ఆధారాలు, గణాంకాలతో తీసుకెళ్లడంతో పాటు ప్రజలకు అండగా నిలిచే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీని మరింత బలోపేతం చేయాలని అధికార ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
Also Read: పింఛన్దారులకు శుభవార్త! పాత నిబంధనలతోనే కొత్త పింఛన్లు..