అధికారంలో ఉన్నప్పుడు కన్నుమిన్నూ కానరాదు. అందులోనూ ఇక మేమే దిక్కు.. మాకు ప్రత్యామ్నాయం లేదు అనే ఆలోచన మెదడుకు ఎక్కినప్పుడు.. ఇక తాము చెప్పిందే వేదం అనుకుంటారు. పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే మూర్ఖత్వం కూడా వచ్చి చేరుతుంది. ప్రతిపక్షం ఇక లేనే లేదు. జనం మమ్మల్ని కాదని ఇంకొకరి చూసే పరిస్తితే లేదనే అహం తలెకెక్కి.. అధికార దర్పం మిడిసిపాటు కూడా తోడైతే.. ప్రజాందోళలు కనిపించవు. వారి ఆకాంక్షలు కళ్లకు ఆనవు. న్యాయమైన డిమాండ్లు కూడా తమను వెక్కిరిస్తున్నట్టుగా, ప్రశ్నిస్తున్నట్టుగా.. రెచ్చగొడతాయి.
అందుకే మీరెంత చేసినా.. ఏం చేసినా.. చివరకు ఎండ్రిన్ తాగి చచ్చినా మేము పట్టించుకోము .. అనే దాకా తెస్తుంది పరిస్థితి. ఇప్పుడు అచ్చంగా అదే జరుగుతోంది కేంద్రంలో. బీజేపీ పెద్దలు చేస్తున్నదిదే. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ చేసిందీ ఇదే. ఇక్కడ అంతా వెలగబెట్టేసినం.. ఇక జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని పార్టీ పేరును బీఆరెస్గా మార్చి.. ఢిల్లీ రాజకీయాలకు ఏగిన కేసీఆర్ విఫల చరిత్ర.. తెలంగాణ సమాజం ముందు ఉంది. అచ్చంగా ఇప్పుడు కేంద్రంలోని మోడీ సర్కార్ చేస్తున్నది కూడా ఇట్లనే ఉంది. జరిగిన పొరపాటుకు నైతిక బాధ్యత వహిస్తూ తమంతట తాము రాజీనామా చేయాల్సి ఉండగా.. చేయకపోగా.. చేయమని ఒత్తిడి చేస్తున్న విద్యార్థులు.. తమ భవిష్యత్ను కాలరాసిన నేతపై ఏదీ చర్య అని ఢిళ్లీ వీధులెకెక్కితే.. ఇది ఉగ్రవాద చర్య అని, అసాంఘిక శక్తుల ప్రోద్బలమని బురద జల్లే ప్రచారానికి తోడు.. జలియన్ వాలాబాగ్లో బంధించి చంపినట్టుగా.. చుట్టూ పోలీసు మూక ఏకమై దాడి చేసి.. దీన్ని కూడా సమర్థించుకునే పాలన ఇవాళ ఢిల్లీలో దేశం చూస్తోంది.
తెలంగాణలో అప్పుడు పదేళ్లూ.. కేసీఆర్ ఏం చేసినా.. బంగారు తెలంగాణ కోసమే.. తెలంగాణ జాతి అభివృద్ధి కోసమే అన్నట్టుగా కలరింగు ఇచ్చుకున్నారు. ఏ జీవో వచ్చినా.. ఏ నిర్ణయం తీసుకున్నా.. కేసీఆర్ ఏం మాట్లాడినా.. చివరకు ఏం మాట్లాడకుండా మౌనంగా ఫామ్హౌజ్లో బంధీ అయినా.. అంతా ఇక్కడి జనం కోసమే.. ఆయనకు తెలియదా ఎప్పుడు ఏం చేయాలో..? అనే విధంగా ప్రచారం చేసుకున్నారు.
ఇప్పుడు అచ్చం అక్కడ కూడా అలాగే జరుగుతోంది. మోడీ ఏం చేసినా దేశం కోసం, ధర్మం కోసమే.. ధర్మేంద్ర ప్రధాన్పై చర్యలు తీసుకోకున్నా.. విద్యార్థులపై లాఠీలు విరిగినా.. రక్తం నేల కారినా.. ఏం చేసినా మోడీ అన్నీ తెలిసే చేస్తాడు. ఆయన ఏం చేసినా మనం ఆమోదించాలి. జనామోదం లభించాలి. వత్తాసు పలకాలి. మోడీకి అండగా నిలవాలి. నిలబడాలి. దేశ వ్యతిరేక శక్తులపై కలబడాలి. అప్పుడే మనం దేశ భక్తులం. లేదంటే దేశ ద్రోహులం. జాతి విచ్చిన్నకారులం. ఉగ్రవాదులం.
తెలంగాణలో ప్రతిఫలించిన ఫలితాలు .. దేశ రాజకీయాల్లో కూడా రావడానికి ఎంతో సమయం పట్టేలా లేదు… అని అనుకుంటున్నారు..చరిత్ర తెలిసిన రాజకీయ విశ్లేషకులు..