Congress Screening: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై ఏఐసీసీ పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ నిర్వహిస్తున్నది. గత కొన్ని రోజుల క్రితం ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేరుగా అధిష్టానం పెద్దలు దృష్టి కేంద్రీకరించారు. రెండు రోజుల క్రితం కేసీ అధ్యక్షతన మీటింగ్ జరుగగా,బుధవారం సీఎం తో పాటు మంత్రులు దామోదర, ఉత్తమ్, సీతక్కలతో పాటు మరి కొంత మంది కీలక నేతలతో మీటింగ్ నిర్వహించనున్నారు. పార్టీ పనితీరు, ప్రభుత్వం ప్రాధాన్యత వంటి అంశాలపై చర్చించనున్నారు. అంతేగాక పార్టీ, ప్రభుత్వంపై సర్వేలు పై కూడా డిస్కషన్ చేయనున్నారు.
నేతల పనితీరుపై చర్చ..
పార్టీ లో నేతల పనితీరుపై చర్చిస్తూ సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఏఐసీసీ రెడీ అయినట్లు తెలిసింది. ఇటీవల ఏఐసీసీ సేకరించిన రకరకాల సర్వే నివేదికలు, స్థానిక నాయకుల ఫీడ్ బ్యాక్ ఆధారంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల సమక్షంలో నేతల తీరుపై చర్చించనున్నారు. అంతేగాక ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తున్నాయి? మంత్రులు కేవలం పాలనకే పరిమితమవుతున్నారా ?పార్టీ కార్యకర్తలను, స్థానిక నేతలను కలుపుకొని పోతున్నారా? అనే దానిపై కూడా ఆరా తీయనున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుంచే పార్టీని ప్రిపేర్ చేసేందుకు ఏఐసీసీ కసరత్తు ను ప్రారంభిస్తుంది.
మీనాక్షి నటరాజన్ మార్క్ పోస్ట్ మార్టం..
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తూ సేకరించిన నివేదికలే ఈ హడావుడికి ప్రధాన కారణమని తెలుస్తోంది.కొందరు మంత్రుల పనితీరు, కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడం,నియోజకవర్గాల్లో సమన్వయ లోపంపై ఏఐసీసీకి మీనాక్షి నటరాజన్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.ఈ ఫిర్యాదుల ఆధారంగానే వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు.ఎవరి శాఖ పనితీరు ఎలా ఉంది? ప్రజల నుంచి ఎవరిపై ఎలాంటి వ్యతిరేకత ఉందనే దానిపై అధిష్ఠానం దగ్గర పక్కా రిపోర్టులు ఉన్నాయని ప్రచారం జరుగుతుండటంతో మంత్రులతో పాటు ఎమ్మెల్యేల్లోనూ టెన్షన్ నెలకొన్నది. పనితీరు బాగోలేని మంత్రులను హెచ్చరించడమే కాకుండా,రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ,మార్పులు చేర్పులు ఉంటాయనే ప్రచారం జోరందుకుంది.నిత్యం కాంట్రవర్సీ అయ్యే మంత్రులకు శాఖల మార్పిడి కూడా చేయాలనే ఆలోచన ఏఐసీసీలో ఉన్నట్లు తెలిసింది. దీంతో పాటు పార్టీలో లుకలుకలు, తుంగతుర్తి, వరంగల్ తదితర నియోజకవర్గాల్లో నేతల మధ్య ఏర్పడిన అసంతృప్తి వంటి వాటికి పరిష్కారం చూపేలా బుధవారం జరగబోయే టీపీసీసీ కో ఆర్డినేషన్ మీటింగ్ లో చర్చించనున్నారు.
నేతలకు ప్రశ్నాపత్రం..?
ఇటీవల తెలంగాణలో ఏఐసీసీ ఇన్ చార్జ్ మీనాక్షి వరుసగా నేతలు, మంత్రులను వన్ టూ వన్ నిర్వహించారు. అందులో పార్టీ, ప్రభుత్వానికి అనుసంధానిస్తూ కొన్ని ప్రశ్నలతో కూడిన పేపర్ ను మంత్రులు, నేతలకు అందజేశారు. దాన్ని నింపి తనకు ఇవ్వాలని ఆమె కోరారు. ఆయా నేతలు, మంత్రులు దాన్ని సంపూర్ణంగా నింపి ఇచ్చారు. వాటి ఆధారంగా కూడా మీనాక్షి ప్రత్యేకంగా ఓ రిపోర్టు తయారు చేసినట్లు తెలిసింది. ఇదే తరహాలో సోమవారం ఢిల్లిలో జరిగిన మీటింగ్ లోనూ కేసీ ప్రత్యేకంగా కొన్ని ప్రశ్నలతో కూడిన పత్రాన్ని సీఎం తోపాటు పీసీసీ చీఫ్, మీనాక్షి, సీడబ్ల్యూసీ మెంబరు వంశీకి అందజేసినట్లు తెలిసింది. బుధవారం జరిగే మీటింగ్ లోనూ ఇదే తరహాలో ప్రశ్నపత్రం ఉండొచ్చనే చర్చ పార్టీ నేతల్లో జరుగుతుంది.
Also Read: మత్స్యకారులకు సర్కార్ గుడ్ న్యూస్.. భారీ సబ్సిడీతో హీరో, హోండా వాహనాలు!