Fishermen Subsidy: స్వేచ్ఛ బ్యూరో: చేపల విక్రయాలు జరిపే మత్స్యకారుల రవాణా కష్టాలకు త్వరలోనే తెరపడనుంది. వారి ఉపాధిని మెరుగుపరచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సబ్సిడీ వాహనాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన మత్స్యకారులకు ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను సబ్సిడీపై అందజేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
మత్స్యకారులకు భారీ శుభవార్త!
రాష్ట్రంలోని మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది. వారి ఉపాధిని మరింత మెరుగుపరచడానికి భారీ సబ్సిడీతో వాహనాలను అందజేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6వేల మత్స్యసహకార సంఘాలు ఉన్నాయి. లబ్ధిదారులకు నాణ్యమైన వాహనాలను అందించే ఉద్దేశంతో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాలైన హీరో , హోండా కంపెనీలకు ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. లబ్ధిదారులు (బెనిఫిషరీ) తమ వ్యక్తిగత అభిరుచి , రవాణా అవసరాలను బట్టి ఈ రెండు కంపెనీలలో నచ్చిన వాహనాన్ని ఎంచుకునే సదుపాయం కల్పించారు. టూ-వీలర్స్ కు యూనిట్ ధర రూ. 75వేలుగా నిర్ణయించగా, త్రి-వీలర్స్ సరుకుల రవాణాకు ఉపయోగపడే త్రిచక్ర వాహనాలకు యూనిట్ ధర రూ. 3 లక్షలుగా ఉంది. మత్స్యకార పురుషులకు 40 శాతం సబ్సిడీ అందజేస్తుండగా, మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా మహిళా మత్స్యకారులకు ఏకంగా 60 శాతం సబ్సిడీని ప్రభుత్వం కేటాయించింది.
మత్స్యకారులకు ఏ వాహనం బెటర్?
ప్రస్తుతం వినియోగంలో ఉన్న టీవీఎస్ ఎక్సల్ వాహనాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగకరంగా ఉన్నాయి. ఇంధన వినియోగం, లోడ్ సామర్థ్యం, ఎక్కువ దూరాల ప్రయాణంలో సౌకర్యం వంటి అంశాలపై దృష్టిసారించారు. అయితే కాస్టు పెరిగితే లబ్దిదారులు భరించాల్సి ఉంటుంది. రోజూ చేపల విక్రయాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే మత్య్సకారులకు వాహన ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మత్య్సకారులు సాధారణంగా పెద్ద పరిమాణంలో చేపల బాక్సులను వాహనాలపై అమర్చి రవాణా చేస్తుండటం, వాహనం స్థిరత్వం, బరువును మోయగల సామర్థ్యం, గ్రామీణ రహదారులపై పనితీరు వంటి అంశాలు ఈ విషయంలో కీలకంగా మారుతాయి. హీరో, హోండా కంపెనీలకు చెందిన చేపల బాక్సుల రవాణాకు మరింత అనుకూలంగా ఉంటుందని అధికారులు అంచనా వేసి ఈ కంపెనీలకు టెండర్లు ఫైనల్ చేసినట్లు తెలిసింది.
4.2 లక్షల మంది పోటీ.. లభించేది కొందరికే
సభ్యత్వం కలిగిన మత్స్యకారులు 4.2లక్షల మంది ఉన్నట్లు సమాచారం. వారంతా 6వేల మత్స్యకారుల సొసైటీల్లో సభ్యులుగా ఉన్నారు. అయితే వారిలో అర్హుల ఎంపికను ఎలా చేస్తారనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. ప్రతీ ఏడాది వాహనాలు పంపిణీకి శ్రీకారం చుడుతున్న ప్రభుత్వం.. కొంతమంది అర్హులకు రావడం లేదని సమాచారం. ఎంపికలో ప్రతి ఏటా సొసైటీకి చెందినవారు.. అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో గ్రామానికి ఇద్దరు ముగ్గురికే వస్తుండటం, అందులోనూ ఒక్కోక్కరికే రెండు మూడు సార్లు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ప్రతి గ్రామంలో 50కి పైగా మత్స్యకారులు ఉండటం వారిలో పైరవీలు చేసుకున్నవారికే వాహనాలు వస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
సబ్సిడీ వాహనాల పంపిణీలో రాజకీయ ఒత్తిళ్ళు!
వాహనాల పంపిణీపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. ప్రతి ఏటావాహనాలకు దరఖాస్తులు చేసుకుంటున్నప్పటికీ రావడం లేదని పలువురు బహిరంగంగానే పేర్కొంటున్నారు. గ్రామస్థాయిలో మత్స్యకారుల వివరాలు అధికారుల దగ్గర ఉన్నప్పటికీ వాహనాల పంపిణీ సమయంలోనే లబ్డిదారుల ఎంపికకు రాజకీయ ఒత్తిళ్లు రావడం, పైరవీలు నడుస్తుండటంతో నిజంగా వృత్తి చేసుకునేవారికి తీవ్రనష్టం జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పైరవీలకు చెక్ పెట్టి నిజమైన లబ్డిదారులకు వాహనాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అయితే ఆదిశగా అధికారులు చర్యలు తీసుకుంటారా? చూసి చూడనట్లు వ్యవహరిస్తారా? అనేది చూడాలి.
Also Read: రాజకీయాల్లో ఏజ్ లిమిట్ ఎప్పుడు? సిద్ధరామయ్య కామెంట్స్తో ముదిరిన చర్చ!