అప్పుడు అందలం.. అంతా సుప్రీంలు..! మిమ్మల్ని అడిగేవాడుండడు. మీరు చెప్పిందే వేదం.. ! అది పార్టీలోనైనా, ప్రొటోకాల్ పాటింపు విషయంలోనైనా. ఇది కేసీఆర్ జమానాలో ఎమ్మెల్యేలకు ఇచ్చిన ప్రయార్టీ. కానీ ఇప్పుడు అది రివర్సయ్యింది. స్వయంగా ఓ ఎమ్మెల్యే అధికార వేదిక మీదనే తనకు మర్యాదేదీ అని అడుగుతున్నాడు? ప్రొటోకాల్ ఎక్కడా? అని నిలదీస్తున్నాడు. ఎమ్మెల్యేలంటే లెక్కలేదా? అని ఉనికి చాటుకునేదాకా వచ్చింది పరిస్థితి..?
అప్పటికి ఇప్పటికీ ఎమ్మెల్యేల విషయంలో సర్కార్ ఇస్తున్న ప్రయార్టీ, బయట దొరకుతున్న విలువలో ఏదైనా మార్పు వచ్చినట్టు కనిపిస్తున్నదా..? అవుననే అనిపిస్తున్నది. కానీ కేసీఆర్ జమానా ఎమ్మెల్యేలది స్వర్ణయుగమని గొప్పగా చెప్పుకునేదేమీ కాదు. వారిని పెంచి పోశించాడంతే. నిధుల మీద అధికారం వాళ్లకే, పెత్తనం అంతా వారిదే. వారు చెప్పిందే నడవాలి.. అంతే.
అందుకే వారికి కేసీఆర్ పెట్టుకున్న ముద్దు పేరు సుప్రీంలు. కానీ అది ఎంత దాకా వచ్చిందంటే.. అక్కడ మంత్రి కన్నా ఎక్కువగా వారిదే పెత్తనం. అది కలెక్టరయినా, ఎస్పీ అయినా.. వీరు చెప్పింది వినాలంతే. వారిని అంతలా ప్రోత్సహించడాన్నమాట. ఇంకొకరిని ఎదగనీయలేదు. ఇచ్చిన వారికే టికెట్లిచ్చాడు. వరుసగా మూడు సార్లు.. అంతేగానీ, ఇంకొకరికి అవకాశం ఇద్దామని అనుకోలేదు.
సామాజిక న్యాయమనే సమీకరణే తన దరిదాపుల్లోకి రానీయలేదు. మొత్తానికి వారిని అప్పుడు గెలుపు గుర్రాల్లా చూశాడు. అలా పెంచి పోషించుకున్నాడు. అదే కేసీఆర్ కొంప ముంచింది. అది వేరే కథ. అప్పుడు ఇబ్బడిముబ్బడిగా నిధుల విడుదల. పక్క పార్టీ ఎమ్మెల్యేలను కూడా తనలో కలిపేసుకునే పాలన.
ఇప్పుడు అదే ఆశతో వచ్చిన వారికి అడియాశే. నిధులేవు. మర్యాదలేదు. నిధుల ఊసు లేదు. కనీసం స్పందించే నేత లేడు. కలిసి బాధ చెప్పుకుందామనుకున్నా వినే నాథుడు లేడు. అంతలా మారిపోయింది ఇప్పుడు పరిస్థితి. అప్పుడు తమకు పట్టిన అదృష్టం.. ఇప్పుడు శాపంలా మారిందెందుకని పోల్చి చూసుకునే రాజకీయ పరిస్థితులు తలెత్తాయి.
ఇప్పుడు మళ్లీ చౌరస్తాలోకి నిలబడ్డట్టుగా అయ్యిందా ఎమ్మెల్యేల పరిస్థితి…? ఎటు వైపు పోదామా అని దిక్కులు చూస్తున్నారా? సమయం కోసం చూస్తున్నారా? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామంటే ఇలా అయ్యిందేమిటనే సందిగ్ద, క్లిష్ట పరిస్థితులెదుర్కొంటున్నారా? దానం నాగేందర్ దుస్థితి చూసిన తరువాత ఇదే చర్చ జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో.