నిజామాబాద్ జిల్లాలో ఆ నియోజకవర్గంపై ఇప్పుడు స్పెషల్ టాక్ నడుస్తోంది. అక్కడ ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు… ఏకంగా నలుగురు అధికార పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. నీకా నాకా..? అనే రేంజ్లో నిత్యం దీనిపైనే గురి పెట్టారు. పోటాపోటీ పర్యటనలు చేస్తున్నారు. నాకే టికెట్ అంటూ గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఎవరి గ్రూపులు వారే మెయింటేన్ చేస్తున్నారు. కానీ, ఇక్కడ్నుంచే పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా బరిలోకి దిగితే.. !ఇంత ఆసక్తి, ఉత్కంఠ రేపుతున్న ఆ నియోజకవర్గం ఏదో తెలుసా?
అది నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం. ఇక్కడ గెలిచింది బీఆరెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి. స్వల్ప ఓట్లతో ఓడిపోయారు కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్రెడ్డి. ఇప్పుడిక్కడ ఇతనే ఇంచార్జి. సునీల్ ఓడగానే అప్పటికే ఆ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న అధికార పార్టీ లీడర్లు.. వచ్చేసారైనా తమకు అవకాశం దొరకకపోతుందా? అని ఇప్పట్నుంచే ప్రయత్నాల్లో ఉన్నారు.
గతంలో ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఈరవత్రి అనిల్ మళ్లీ బాల్కొండపై ఆశలు పెట్టుకున్నారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి.. ఇది తన ఇలాఖానే అంటూ తన వర్గంతో రోజుకో కార్యక్రమం చేస్తూ వస్తున్నారు. ఇక అన్వేష్రెడ్డి అనే మరో నేత కూడా తానేం తక్కువ తినలేదంటూ ఎమ్మెల్యే అభ్యర్థి లెవల్లోనే ప్రచారం చేసుకుంటున్నారు. ఓడిన సునీల్రెడ్డి.. తనపై ప్రజలకు సానుభూతి ఉంటుంది కాబట్టి.. ఇంచార్జిగా ఉన్న తనకే మళ్లీ అధిష్టానం టికెట్ ఇస్తుందనే ధీమాలో ఉన్నారు.
ఇక్కడే అసలు ట్విస్ట్ అందరినీ కలవరపెడుతోంది. టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ ఇలాఖ కూడా బాల్కొండ నియోజకవర్గమే. ఆ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే భీమ్గల్ మండలం రహత్నగర్ ఆయన సొంత గ్రామం. దీంతో మహేశ్కు కూడా ఇక్కడ నుంచి పోటీ చేసే ఆసక్తి ఉందనే ప్రచారం జోరందుకుంది. ఆయనే ఎంట్రీ ఇస్తే.. ఇక మా గతేంగానూ అని పెదవి విరుస్తున్నారట ఆ మిగిలిన ఆశావహులు. నిజామాబాద్ అర్బన్ నుంచి పలు మార్లు మహేశ్ పోటీ చేసి ఉన్నారు. కానీ ఈసారి బాల్కొండ వైపు తన చూపున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు అధికార పార్టీలో బాల్కొండ కాకా రేపుతోంది.
– Written by Dandugula Srinivas, BIG TV