Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి .. హుజురాబాద్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆ మాజీ రంజీ క్రికెటర్ నిత్య వివాదాలతో.. కెరీర్ పరంగా తన వికెట్ తానే పడగొట్టుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఆయన ప్రస్థానం అంతా వివాదాలతోనే కొనసాగుతూ… సొంత పార్టీలోనే అసంతృప్తికి కారణమవుతోంది. ఎన్ని కాంట్రవర్సీల్లో ఇరుక్కుని.. బహరంగంగా క్షమాపణలు చెప్పే పరిస్ధితి వస్తున్నా పాడి కౌశిక్రెడ్డి ‘అతి’ మాత్రం ఆగడం లేదు. ఆ క్రమంలో తాజాగా అసెంబ్లీలో హుజురాబాద్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి కడియం శ్రీహరి పట్ల వ్యవహరించిన తీరు మరో సారి రచ్చ కెక్కింది.
హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి.. వివాదాలకు కేరాఫ్ అంటే తెలంగాణ రాజకీయాల్లో ముందు గుర్తొచ్చేటంత ఘనత సాధించారాయన. ఆయన చేసే వ్యాఖ్యలు, వ్యవహరించే తీరుతో ఎప్పటికప్పుడు ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి వలసవచ్చి, తొలిసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా 2023 ఎన్నికల్లో పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారం నాటి నుంచి కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో తనకు ఓటు వేయకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని ఓటర్లను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిన పాడి కౌశిక్రెడ్డి.. ఎలాగొలా తొలి సారి ఎమ్మెల్యేగా గెలవ గలిగారు. అలా గెలుపుతోనే వివాదాస్పద నేతగా ముద్ర వేయించుకున్నారు. పాడి కౌశిక్ రెడ్డి గెలిచినప్పటికీ బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడంతో ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. గెలిచినప్పటి నుంచి మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కంటే .. దూకుడు ప్రదర్శిస్తూ ఎప్పుడూ ఏదోఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటూనే ఉన్నారు. సీనియర్ నేతలు సయితం ఒకింత సంయమనం పాటిస్తున్నాపాడి కౌశిక్ రెడ్డి మాత్రం అధినాయకత్వం మెప్పుకోసం.. వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వస్తే మంత్రి పదవి దక్కించుకోవడం కోసమన్నట్లు అనవసరమైన స్పీడ్ ప్రదర్శిస్తుంటారు.
చిన్నా పెద్దా తేడా లేకుండా ఆయన చేసే విమర్శలు, ప్రత్యర్థులకు సయితం వెగటు పుట్టించేలా కనిపిస్తున్నాయి. పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన మరింత రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారని గులాబీ పార్టీ నేతలే ఆఫ్ ది రికార్డుల్లో అంటున్నారంటే ఆయన ఎలా చెలరేగిపోతుంటారో అర్థమవుతుంది. అనేక సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, పోలీసులపై దురుసుగా వ్యవహరించడం వంటి వ్యవహారాలతో ఆ ఎమ్మెల్యేపై కేసులు కూడా నమోదయ్యాయి.
తనను తాను మోనార్క్లా ఫీలైపోయే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే గతంలో విమర్శలు చేశారు. రేవంత్ ప్రైవేటు హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తూ వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి సంయమనం లేకుండా ఏకంగా సీఎంనే వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదుచేశారు. అలా కౌశిక్ రెడ్డి కోరి వివాదాలను కొని తెచ్చుకుని బీఆర్ఎస్ లో తిరుగులేని లీడర్ గా ఎదగాలని చూస్తుండటం తీవ్ర విమర్శల పాలవుతోంది.
అతి చేసి అభాసుపాలవుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎప్పుడూ ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉంటారు. గతంలో గవర్నర్పై నోరు పారేసుకుని.. చివరి సారీ చెప్పాల్సిన పరిస్ధితి కొని తెచ్చుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను బూతులు తిట్టారనే ఆరోపణలున్నాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో వాగ్వాదం కేసులో అరెస్ట్ కూడా అయ్యారు. పార్టీ మారారన్న ఆరోపణలతో సొంత పార్టీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని తిట్టి, ఇంటిపై దాడికి ప్రయత్నించి నవ్వులపాలయ్యారు. తన నియోజకవర్గం హుజురాబాద్ లో సమ్మక్క సారలమ్మ జాతరలో రాద్దాంతం చేసి, రోడ్డుపై బైఠాయించి సీపీపై కాంట్రవర్శీ కామెంట్స్ చేసి రచ్చ రేపారు. అప్పుడు ఐపీఎస్ల సంఘం డిమాండ్తో ఆయనకు సారీ చెప్పక తప్పలేదు.
ఇప్పటి దాకా వదిలించుకోలేనంతగా అంటుకున్న బురద చాలదన్నట్లు .. తాజాగా అసెంబ్లీలో దళిత ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరిని బెదిరిస్తున్నట్లు హావభావాలు ప్రదర్శించి తన హీరోయిజం ప్రదర్శించబోయారు. సభలో కడియం మాట్లాడుతుండగా గన్తో కాలుస్తానన్నట్లు ఆయన బెదిరించి .. ఉన్న ఎమ్మెల్యే పదవి ఊడగొట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. సీనియర్ అని గౌరవం లేకుండా, దళిత ఎమ్మెల్యే అయిన కడియం పట్ల వ్యవహరించిన తీరుతో దళిత ఎమ్మెల్యేలు సహా అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సభలో కౌశిక్రెడ్డి వ్యవహరించిన తీరుపై వీడియో పరిశీలించి , చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన్ని ఎమ్మెల్యేగా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి తీరుపై ప్రభుత్వం సీరియస్ చర్యలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. అసెంబ్లీ సమావేశాల సమయంలో హెడ్ ఫోన్స్ విసిరి దాడి చేశారనే ఆరోపణలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాల్ని స్పీకర్ రద్దు చేశారు. అయితే తర్వాత హైకోర్టు వారి సభ్యత్వాల రద్దు చెల్లదని తీర్పు ఇచ్చింది. ఆ క్రమంలో కౌశిక్రెడ్డి విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, పార్టీని డ్యామేజ్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆ నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాల బీఆర్ఎస్ నేతలు రహస్యంగా భేటీ కావడం హాట్ టాపిక్గా మారింది. వారంతా కౌశిక్రెడ్డి వైఖరి నచ్చక బీఆర్ఎస్కు ముకుమ్మడి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు వస్తున్న వార్తలు అధిష్టానాన్ని ఉలిక్కిపడేలా చేశాయంట. సొంత పార్టీలోనే కౌశిక్ను మేం భరింలేం అంటుండటంతో.. ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే… బీఆర్ఎస్ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Also Read: అధ్యక్షుడివా.. రాజువా? ట్రంప్పై 90 లక్షల మంది తిరుగుబాటు!
Story by: Apparao, Big Tv