Operation 300: తెలంగాణ రాజకీయ క్షేత్రంలో అసలైన సమరానికి తెరలేస్తోంది! అసెంబ్లీ కోటను కొల్లగొట్టి.. పార్లమెంట్ పోరులో సత్తా చాటిన కాంగ్రెస్.. ఇప్పుడు తన ‘విజయ రథాన్ని’ భాగ్యనగరం వైపు మళ్లించింది. మునుపెన్నడూ లేని విధంగా హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పీసీసీ పక్కా స్కెచ్ వేసింది. దీనికే హస్తం పార్టీ పెట్టిన పేరు.. ‘ఆపరేషన్ 300’.
రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ఎదుర్కోబోతున్న అత్యంత క్లిష్టమైన పరీక్ష ఇదే. గత పదేళ్లలో నగరంలో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. పదేళ్ల అధికార విరామం.. చెల్లాచెదురైన కేడర్.. వరుస వలసలు హస్తం పార్టీని కోలుకోలేని దెబ్బతీశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా గాలి వీచినా.. గ్రేటర్ పరిధిలో మాత్రం కాంగ్రెస్ వెనుకబడింది. ఇప్పుడు ఆ ‘పాత గాయాలను’ మాన్పుకుని.. నగర ఓటర్ల మనసు గెలవడమే పీసీసీ ముందున్న అసలైన సవాల్!. ఇందులో ముఖ్యంగా కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడటం కాంగ్రెస్ కేడర్ కు జోష్ ఇచ్చే అంశం. ఇప్పుడు కూడా అంతేస్థాయిలో టాప్ నాచ్ పర్ఫామెన్స్ చేయాలనేది టీపీసీసీ ప్లాన్. ఆ దిశగా కేడర్ ను సమాయత్తం చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పటికే తెలంగాణ అర్బన్ లో జరిగిన పురపోరులో కాంగ్రెస్ తన మార్క్ విక్టరీని అందుకుంది. మెజార్టీ పీఠాలపై కాంగ్రెస్ అభ్యర్థులే ఛైర్మన్లుగా, మేయర్లుగా కూర్చున్నారు.
అయితే, ఈసారి కాంగ్రెస్ కేవలం గాలివాటాన్ని నమ్ముకోవడం లేదు.. అంతా పక్కా వ్యూహం! ఇప్పటికే ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను ఆహ్వానించిన హస్తం పెద్దలు.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి.. కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్న నేతలను కూడా ఎన్నికల బరిలోకి దించాలని భావిస్తున్నారు. పదవులు అనుభవించడమే కాదు.. పార్టీ గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పోరాడాలని పీసీసీ బాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ పరిధిలోని మొత్తం 300 డివిజన్లలో బలమైన ‘యోధులను’ నిలబెట్టడమే ఈ ప్లాన్ ముఖ్య ఉద్దేశం. NSUI, యూత్ కాంగ్రెస్లోని యువ రక్తానికి పెద్దపీట వేయబోతున్నారు. జూన్ నెలాఖరు నాటికే అభ్యర్థులను ఖరారు చేసి.. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే వారిని ప్రజల మధ్యకు పంపాలని చూస్తోంది టీ-కాంగ్రెస్. అభ్యర్థి ఎవరనేది ముందుగానే తెలిస్తే.. ప్రజలతో కనెక్ట్ అవ్వడం సులభమనేది పీసీసీ వెర్షన్.
మరోవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయని కాంగ్రెస్ నమ్ముతోంది. గృహజ్యోతి, మహాలక్ష్మి వంటి పథకాలతో పాటు.. మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ వంటి మెగా ప్రాజెక్టులను ఎన్నికల అజెండాగా మార్చుకోబోతోంది. అధికారం చేతిలో ఉండటం.. అభివృద్ధిపై ఫోకస్ పెట్టడంతో ఈసారి గ్రేటర్ ఓటరు తమకే పట్టం కడతారని ధీమాగా ఉన్నారు హస్తం నేతలు. కానీ.. గ్రేటర్ గడ్డపై బీఆర్ఎస్, ఎంఐఎంలకు బలమైన పట్టు ఉంది. అటు బీజేపీ కూడా దూకుడు మీదుంది. ఈ ముక్కోణపు పోటీలో ‘300 మంది యోధులు’ కాంగ్రెస్ జెండాను ఎంతవరకు మోయగలరు? మేయర్ పీఠాలపై హస్తం జెండా ఎగురుతుందా? లేక వ్యూహం బెడిసికొడుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read: నారాయణపేటలో రాజేందర్ రెడ్డికి షాక్.. 24 వార్డుల్లో గెలిచింది రెండేనా! బీజేపీ పాగా వెనుక అసలు కథ ఇదే!
Story by: Apparao, Big Tv