El Niño: దేశవ్యాప్తంగా అన్నదాతల్లో మళ్లీ ఎల్ నినో వణుకు మొదలైంది. ఆలస్యంగా వచ్చిన నైరుతి రుతుపవనాలకు తోడు ఈ పసిఫిక్ ముప్పు తోడవడంతో తొలకరి పూర్తిగా బలహీనపడిపోయింది. జూన్ మొదటి రెండు వారాల్లోనే దేశవ్యాప్తంగా ఏకంగా 64 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జులై నుంచి నవంబర్ వరకు రాబోయే రోజులు దేశానికి సవాలుగా మారబోతున్నాయంటూ వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
జూన్ నెల సగం దాటినా ఆకాశం వైపు కళ్లు కాయలు కాచేలా చూస్తున్నాడు అన్నదాత. జూన్ 4 నుంచి 16 తేదీల మధ్య దేశవ్యాప్తంగా సాధారణంగా 5.37 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కురిసింది కేవలం 1.92 సెంటీమీటర్లు మాత్రమే. ఫలితంగా దేశవ్యాప్తంగా సగటున 64 శాతం లోటు వర్షపాతం నమోదైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల్లో దాదాపు 14 శాతం లోటు కనిపిస్తోంది.
ఈ అకాల ఎండలు, వానల లేమికి కారణం.. పసిఫిక్ మహాసముద్రంలో పుడుతున్న ఎల్ నినో రక్కసి. పసిఫిక్ జలాలు వేడెక్కడం వల్ల వీచే గాలులు.. భారత్కు జీవనాధారమైన నైరుతి రుతుపవనాలను బలహీనపరుస్తున్నాయి. దేశం మొత్తం వర్షపాతంలో 70 శాతం ఈ నైరుతి వల్లే వస్తుంది. 2026 జూన్లో బలహీనంగా ఉన్న ఎల్ నినో జులై-ఆగస్టు నాటికి అత్యంత బలంగా మారడానికి 80 నుంచి 90 శాతానికి పైగా అవకాశం ఉందని IMDతో పాటు పలు అంతర్జాతీయ వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
Also read: Food Safety: మీరు తినే పనీర్ బిర్యానీ వెనుక ఇంత ఘోరమా?.. గుండె పగిలే నిజాలు!
గతాన్ని పరిశీలిస్తే ఎల్ నినో వచ్చిన ప్రతిసారీ దేశం అల్లాడిపోయింది. 2009లో ఎల్ నినో బలహీనంగా ఉన్నా.. వర్షపాతం సగటులో కేవలం 78 శాతమే నమోదైంది, ఇది 37 ఏళ్లలోనే అత్యల్పం. అలాగే 2015-16 నాటి బలమైన ఎల్ నినో దేశాన్ని తీవ్ర కరువులోకి నెట్టింది. ఇప్పుడు 2026లో కూడా రుతుపవన కాలం మొత్తం మీద ఓవరాల్ గా కేవలం 90-92 శాతం వర్షపాతమే నమోదవుతుందని ఐఎండి అంచనా వేస్తోంది.
ప్రస్తుతం మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో 70 నుంచి 80 శాతం లోటు వర్షపాతం రికార్డైంది. దేశ జనాభాలో 50-60 శాతం మందికి జీవనాధారమైన వ్యవసాయం దెబ్బతింటే అది మొత్తం ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది. ఈ ఏడాది ఆహార ఉత్పత్తి 10 నుంచి 15 శాతం మేర తగ్గే ప్రమాదం ఉందని, ఇది దేశ ఆహార భద్రతకే సవాలుగా మారబోతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జూన్ 23 తర్వాత వాతావరణ పరిస్థితులు మెరుగవుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో చురుగ్గా విస్తరిస్తాయని అంటోంది. అయినప్పటికీ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లోని వర్షాధార పంటలు వేసే చిన్న, సన్నకారు రైతులు ఈ ఏడాది తీవ్ర ప్రభావానికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Storey By: Appa Rao Big Tv
Also Read: Rythu Bharosa: తెలంగాణ రైతులకు పండగే పండగ.. 67 లక్షల మంది ఖాతాల్లోకి నిధులు..!