Illegal Parking: స్వేచ్ఛ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ లో వేగంగా జరుగుతున్న పట్టణీకరణకు తోడుగా పెరుగుతున్న అక్రమ పార్కింగ్ కు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) సిద్దమైంది. ముఖ్యంగా మహానగరంలోని రోడ్లపై రోజురోజుకి పెరుగుతున్న వాహానాల సంఖ్యకు అనుగుణంగా ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం రోడ్లను వెడల్పు చేసుకుంటున్నా, పెరుగుతున్న వ్యాపార సంస్థల కారణంగా రోడ్ల సగ భాగం వరకు ఇష్టారాజ్యంగా వాహానాల అక్రమ పార్కింగ్ కూడా పెరుగుతూనే ఉంది.
అక్రమ పార్కింగ్కు చెక్..
ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు మార్గాలను అన్వేషించిన హెచ్ఎండీఏ సిటీలోని పలు రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లై ఓవర్ల కిందనున్న ఖాళీ స్థలాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పిస్తే రోడ్డకిరువైపులా జరుగుతున్న అక్రమ పార్కింగ్ కు చాలా వరకు చెక్ పెట్టవచ్చునని హెచ్ఎండీఏ భావిస్తుంది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్టు అథారిటీ గత నెల 28వ తేదీన జరిగిన సమావేశంలో అక్రమ పార్కింగ్ వ్యవస్థను నిర్మూలించాలన్న ప్రస్తావన రావటంతో హుంటా అధికారులు ఫ్లై ఓవర్ల కింద ఖాళీ స్థలాలను పార్కింగ్ కు వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
పార్కింగ్ సౌకర్యం కోసం సమావేశం..
సిటీలోని వీధి వ్యాపారుల కోసం జీహెచ్ఎంసీ పరిధిలో వెండింగ్ జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఫ్లై ఓవర్ల కింద పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించి వాహనదారుల నుంచి నామమాత్రంగా ఛార్జీలు వసూలు చేసి, నిర్వహణ బాధ్యతలు నిర్వహించవచ్చునని కూడా హుంటా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వెండింగ్ జోన్లతో పాటు కమర్షియల్ కియోస్క్ లను ఏర్పాటు చేయాలని కూడా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వీటిని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద గానీ, పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ కింద గానీ ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ యోచిస్తున్నట్లు తెలిసింది.
రోడ్లపై అక్రమ పార్కింగ్ ను నివారించాలి..
వీటికి సమీపంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏకు చెందిన స్థలాలను గుర్తించి వాటిల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ లను ఏర్పాటు చేసి, రోడ్లపై అక్రమ పార్కింగ్ ను నివారించాలన కూడా భావిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్ ) కింద ఫ్లై ఓవర్ల కింద పార్కింగ్ వ్యవస్థలు, సమీపంలోని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ స్థలాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ లను ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని హెచ్ఎండీఏ భావిస్తుంది.
పాదచారుల భద్రతపై ఫోకస్..
మహానగరంలోని రోడ్లపై రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా రోడ్లపై రాకపోకలు సాగించే పాదచారుల భద్రతపై కూడా హెచ్ఎండీఏ ఫోకస్ చేసింది. పలు రద్దీ జంక్షన్లలో రోడ్డు దాటుతూ పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నట్లు గుర్తించిన హెచ్ఎండీఏ ఇప్పటికే ఉప్పల్, మెహిదీపట్నం జంక్షన్ లలో స్కే వాక్ లను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెల్సిందే. వీటిలో మెహిదీపట్నం స్కై వాక్ పనులు ఇంకా కొనసాగుతుండగా, ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఉప్పల్ జంక్షన్ లోని స్కై వాక్ ప్రస్తుతం ఫ్లై ఓవర్ పనుల కారణంగా ప్రజల వినియోగాన్ని నిలిపేశారు. తాజాగా ఎల్బీనగర్, హైటెక్ సిటీ, హైటెక్ సిటీ సమీపంలోని ఐకియా సమీపంలో మొత్తం నాలుగు స్కై వాక్ లను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: మతం మారితే కులం మారుతుందా?.. దళిత క్రిస్టియన్లకు SC హోదా ఇవ్వాల్సిందే: R.S. ప్రవీణ్ కుమార్