EOS-05 Launch: అంతరిక్ష పరిశోధనలో భారత్ మరో మైలురాయికి అడుగు దూరంలో ఉంది. భూమిని అత్యంత స్పష్టతతో పరిశీలించే అత్యాధునిక ఉపగ్రహం EOS-05 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. గతంలో విఫలమైన GISAT-1 ప్రయోగం తర్వాత.. అదే లక్ష్యంతో EOS-05 ఉపగ్రహాన్ని GSLV-F17 రాకెట్ ద్వారా నింగిలోకి పంపేందుకు ఇస్రో సిద్ధమైంది.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. భూమి చుట్టూ తిరుగుతూ పరిశీలించే సాధారణ ఉపగ్రహాలకు భిన్నంగా.. జియోసింక్రోనస్ కక్ష్యలో ఉండి, ఒకే ప్రాంతాన్ని నిరంతరం గమనించగలదు. దీంతో వాతావరణ మార్పులు, తుపాన్లు, మేఘాల కదలికలు.. ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించడంలో మరింత ఖచ్చితత్వం సాధ్యమవుతుంది.
Also Read: ఇందూరు గడ్డపై కల్వకుంట్ల కవిత సమర శంఖం.. 2014 మ్యాజిక్ను రిపీట్ చేస్తారా?
అయితే ఈ ప్రయోగం వెనుక ఓ సవాలుతో కూడిన గతం కూడా ఉంది. 2021 ఆగస్టులో GISAT-1 ఉపగ్రహాన్ని GSLV-F10 రాకెట్ ద్వారా ప్రయోగించగా.. క్రయోజెనిక్ స్టేజ్లో ప్రాబ్లమ్ వచ్చి మిషన్ ఫెయిల్ అయింది. అదే కలను సాకారం చేసుకునేందుకు ఇస్రో మరింత పటిష్టంగా సిద్ధమైంది. ఇప్పుడు EOS-05 రూపంలో ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తోంది.
EOS-05 అంటే కేవలం మరో శాటిలైట్ మాత్రమే కాదు.. ఐదేళ్ల క్రితం ఆగిపోయిన ఓ మిషన్కు సరికొత్త ఆరంభం. భారత్ నిరంతర భూ పరిశీలన సామర్థ్యాలను పెంచుకునే దిశలో ఇది కీలక అడుగు. ఈ ప్రయోగం విజయవంతమైతే.. అంతరిక్ష రంగంలో భారత్ సామర్థ్యానికి మరో గుర్తింపు రానుంది. వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుని, విజయంపై గురి పెట్టిన ఇస్రో.. EOS-05తో అంతరిక్షంలో మరో చరిత్ర రాసేందుకు సిద్ధమవుతోంది.
Also read: ఏఐ టెక్నాలజీతో సంచలనం.. ఆదివాసీల జల్, జంగిల్, జమీన్ నినాదంతో షార్ట్ ఫిల్మ్!