Jana Sena: గౌరవం లేదు.. మర్యాద అంత కన్నా దక్కటం లేదు.. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే అసలు పట్టించుకోవటం లేదు.. మిత్రధర్మం గాలికి వదిలేశారు… ఈ అవమానాలు మమ్మల్ని వేధిస్తున్నాయి… క్యాడర్ ను ఆవేదనకు గురి చేస్తున్నాయి… ఇది వాస్తవం… ఇక మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం… ఇది జనసేన ప్రజా ప్రతినిధులు, ముఖ్యనేతల మొర. జనసేన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీలో టీడీపీ నేతలు, ఎమ్మెల్యేల తీరుపైన పూర్తి స్థాయిలో ఫిర్యాదుల పరంపర కొనసాగిందంట. అన్నింటిని విన్న పవన్ కళ్యాణ్ .. అప్పటికి తన పార్టీ నేతలకు సర్ది చెప్పినా దాన్ని సీరియస్ గానే తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి మున్ముందు జనసేనాని తన సైనికులు అవమానాలపాలు కాకుండా ఏం చేయబోతున్నారు?
మిత్ర ధర్మాన్ని కొందరు టీడీపీ నేతలు పక్కన పెట్టేసారా? తమదే పై చేయి అనే ధోరణితో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారా? జనసేన నేతలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారా? దీని పై జనసేన నేతలు, క్యాడర్ రగిలి పోతున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం ..ఇప్పుడు ఎస్ అనే వస్తోంది… వస్తోంది ఏమిటి… వచ్చేసింది కూడా. తాజాగా జనసేన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన సమావేశంలో టీడీపీ నేతలు చేస్తున్న అవమానాలే పెద్ద ఎజెండాగా చర్చకు వచ్చాయంట.
మిగితా అంశాలు ఎలా వున్నా అదే హాట్ టాపిక్ అయిందట. ఆంధ్రప్రదేశ్ లో జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీ నేతలకు సమ మర్యాద ఇస్తూ అన్నింటికీ పెద్ద పీట వేస్తున్నా, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మాత్రం జనసేన నేతలను పూర్తిగా పక్కన పెడుతూ, అవమానాలకు గురి చేస్తున్నారని పవన్ కు భారీగా ఫిర్యాదులు అందాయని పార్టీ నేతలు అంటున్నారు. అసలు తాము కూటమిలోనే ఉన్నామా? అనే సందేహం కూడా వస్తోందని కొందరు పవన్ ముందు ఆవేదన వ్యక్తం చేశారంట.
టీడీపీ ఎమ్మెల్యేలు ఏ కార్యక్రమంలో పాల్గొన్నా జనసేన నేతలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని, అసలు చాలా కార్యక్రమాలకు పిలవటం లేదని కొందరు ఫిర్యాదు చేశారంట. పిలిచి అవమానాలకు గురి చేస్తున్నారని ఇంకొందరు జనసేనాని దృష్టికి తెచ్చారంట.. ఇదెక్కడి మిత్రధర్మం? జనసేన చేసిన త్యాగాలు, పోరాటాలు మరిచి పోవటం ఏంటి? అనికొందరు జనసేన ఎమ్మెల్యేలు సూటిగానే ఆ సమావేశంలో పవన్ దృష్టిలోకి తెచ్చారంటున్నారు.
పలువురు టీడీపీ ఎమ్మెల్యేలకు, ముఖ్య నేతలకు జనసేన నేతలు అంటే చిన్నచూపుగా ఉందని తమ అధ్యక్షుడి ముందు కొందరు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారంట. జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా మిత్ర పక్షలైన టీడీపీ, బీజేపీ నేతలకు సమాచారం ఇచ్చి వారికి అగ్రతాంబూలం ఇస్తున్న విషయాన్ని జనసేన నేతలు ప్రస్తావించారంట. టీడీపీ నేతల తీరు ఇలాగే కొనసాగితే క్యాడర్ మరింతగా అవమానాలు ఎదుర్కొని, అసంతృప్తికి గురికావడం తథ్యమని పవన్ కు గట్టిగానే చెప్పేశారట.
మిత్రపక్ష నేతలపై అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యేలు, నేతల ఫిర్యాదులు విన్న పవన్ కళ్యాణ్ వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా, కొందరు మాత్రం ఇలాంటి చర్యల వల్ల తాము సమాజంలో తల ఎత్తుకోలేక పోతున్నామని వాపోయినట్టు సమాచారం. ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ, టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జనసేనకు సముచిత గౌరవం దక్కటం లేదని, తమ పార్టీ నేతలు అధినేత దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించడం గమనార్హం.
జనసేన నేతల ఫిర్యాదుల పై స్పందించిన పవన్ కళ్యాణ్ వారికి సర్ది చెప్పే ప్రయత్నం గట్టిగానే చేశారుట. మరో 15 సంవత్సరాల వరకు కూటమి అధికారంలో ఉండాలి అంటే, చిన్న సమస్యలను పట్టించుకో కూడదని, మిత్రధర్మం పాటించాలని మరోసారి జనసేన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు స్పష్టంగా చెప్పారంట… కూటమిలో లుకలుకలు ఉంటే ప్రతిపక్షం వాటిని ఆయుధంగా వాడుకునే ప్రమాదం ఉందని కూడ పవన్ హెచ్చరించినట్లు తెలిసింది… విషయం తీవ్రంగా ఉందని కొందరు పవన్ కు చెప్పటంతో ఈ వ్యవహారం పై తాను టీడీపీ పెద్దలతో మాట్లాడుతానని, జనసేన నేతలు ఎట్టి పరిస్థితిలోనూ సంయమనం కోల్పోవద్దని సూచించినట్లు పార్టీ నేతలు అంటున్నారు… ఈ వివాదాలు పక్కన పెట్టి క్షేత్ర స్థాయిలో కమిటీల ఏర్పాటు, స్థానిక ఎన్నికల పై దృష్టి పెట్టాలని, వారి ఫిర్యాదులను తాను చూసుకుంటానని పవన్ భరోసా ఇచ్చినట్లు సమాచారం.
జనసేన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు చేసిన ఫిర్యాదులు, జరిగిన అవమానాలు పవన్ పక్కన పెట్టలేదంటున్నారు… ఏయే నియోజకవర్గంలో ఏ టీడీపీ ఎమ్మెల్యే ఎప్పుడు, ఎలా జనసేన నేతలను అవమానాలకు గురి చేశారు?… ఆ సందర్భం ఏంటి?… అసలు ఏం జరిగింది?… అనే దానిపై సదరు ఫిర్యాదు చేసిన జనసేన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల నుంచి పూర్తి స్థాయి వివరాలు లిఖిత పూర్వకంగా సేకరించే ఆలోచనలో వున్నారని తెలిసింది… దీని పై నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు కూడా ఆయన సిద్ధం అవుతున్నట్లు జనసేన నేతలు చెప్పుతున్నారు… క్షేత్ర స్థాయి నుంచి కూటమి నేతలు సమన్వయంతో పని చేయాలనే ప్రణాళికతో అడుగులు వేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ..ఇలాంటి సమస్యలు మున్ముందు రాకుండా చూసుకునే విషయంలో చర్యలు చేపట్టే అవకాశం ఉందని జనసైనికులు అంటున్నారు.
రాష్ట్రంలో కూటమి మొత్తం ఒకటే… రాష్ట్ర స్థాయి మొదలుకుని క్షేత్ర స్థాయి వరకు కూటమి నేతలు మిత్రధర్మంతో ముందుకు సాగాల్సిందే అనే ఆదేశాలు త్వరలో వచ్చే సూచనలు ఉన్నట్టు జనసేన నేతలు చెప్పుతున్నారు. ఈ మేరకు పవన్ కూడ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది… ఇదే జరిగితే జనసేన క్యాడర్ మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు… అంతే కాదు మరో 15 సంవత్సరాల వరకు కూటమి అజేయంగా రాష్ట్రంలో సుస్థిర పాలన అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: వీళ్ళా మన నాయకులు? చిత్తూరు వైసీపీలో అసలేం జరుగుతోంది?
Story by: Apparao, Big Tv