Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి కసరత్తును వేగవంతం చేశారు. ఇప్పటికే పార్టీ ఆవిర్భావ తేదీని ప్రకటించిన ఆమె.. తాజాగా పార్టీ జెండా రంగును వెల్లడిస్తూ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించారు. తన కొత్త పార్టీ జెండాలో నీలిరంగు ప్రధానంగా ఉంటుందని సోషల్మీడియా వేదికగా స్పష్టం చేశారు. తమ దార్శనికతకు, మాట ఇస్తే తుది వరకు కట్టుబడి ఉండే నమ్మకత్వానికి బ్లూ కలర్ చిహ్మమని.. తమ పార్టీ అజెండా అదేనని వెల్లడించారు. కలర్ థియరీ అనే హాష్ట్యాగ్ను తన ఎక్స్ పోస్ట్కు జతచేసి.. కొత్త పార్టీపై మరోసారి చర్చకు తెరలేపారు,
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేయనున్న కొత్త పార్టీకి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. కవిత కొత్త పార్టీకి ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరు రిజిస్ట్రేషన్ కోసం ఈసీకి ధరఖాస్తు చేసుకున్నట్లు మొదట్లో ప్రచారం జరిగింది. అయితే తర్వాత కొత్త పార్టీకి సంబంధించి కవిత చేసిన వ్యాఖ్యలు.. తీవ్ర ఆసక్తికరంగా మారాయి. తన కొత్త పార్టీకి టీఆర్ఎస్ పేరు పెట్టేందుకు కవిత, జాగృతి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు రావడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.
రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఇప్పుడు ఖాళీగా ఉందని.. కొన్ని రోజుల క్రితం మీడియా సమావేశంలో కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు చేయడం సరికొత్త చర్చకు దారి తీస్తోంది. అదే సమయంలో పాత పేరు, కొత్త జెండా, అజెండాతో తెలంగాణ ప్రజల ముందుకు వస్తానని చెప్పడంతో.. కొత్త పార్టీకి టీఆర్ఎస్ అనే పేరు పెడతారా అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. పార్టీ ఆవిర్భావం, జెండా, అజెండా, విధి విధానాలను ఏప్రిల్ 25వ తేదీన వెల్లడిస్తామని.. కవిత శ్రీ రామనవమి రోజున ప్రకటించారు.
మరి పార్టీ పేరుపై ఆమె ఎప్పుడు క్లారిటీ ఇస్తారో కాని, కొత్త పార్టీకి సంబంధించి ఆసక్తికర విషయాలను కవిత ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తమ రాజకీయ పార్టీ జెండా, ఎజెండా నిలీరంగులో ఉండబోతోందని ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ‘కలర్ థియరీ’ అనే హాష్ ట్యాగ్ను తన పోస్టుకు జత చేశారు. నీలం రంగు తమ దర్శనికతకు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నమ్మకత్వానికి చిహ్నమని, మా పార్టీ ప్రయాణం ఈ రంగుతోనే సాగుతుందని ఎక్స్లో పోస్ట్ చేశారు.
శ్రీరామనవమి పర్వదినాన పార్టీ ప్రకటన చేసిన కవిత.. ఈ నెల 25వ తేదీన పార్టీని అధికారికంగా లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్ అందుకు వేదిక కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం ఇప్పటికే జాగృతి నేతలు భారీ ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇప్పటికే పార్టీ ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియలో వేగం పెంచిన కవిత, వివిధ వర్గాల ప్రముఖులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారి సూచనల మేరకే పార్టీ జెండాలో బ్లూ కలర్కు ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ జాగృతి సంస్థలోని ఆకుపచ్చ రంగు పచ్చదనానికి, వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి నిదర్శనం అయితే.. నీలి రంగు బడుడు బలహీన వర్గాల వికాసానికి సూచిక అన్నది కవిత అభిప్రాయంగా కనిపిస్తోంది. సామాజిక తెలంగాణ – సర్వోదయ వికాసం ఎజెండాగా, సర్వోదయ తెలంగాణ తమ పార్టీ సిద్దాంతంగా ఉంటుందని ఇప్పటికే కవిత పలు సందర్భాల్లో వెల్లడించారు. వివిధ వర్గాల సమస్యలు, వాటికి పరిష్కారాలు, తెలంగాణ రాష్ట్ర స్వయం సమృద్ధి కోసం రూపొందించాల్సిన బ్లూ ప్రింట్పై ఆమె 50 కమిటీలు ఏర్పాటు చేశారు. పార్టీ ఏర్పాటు వేదికపై తమ పార్టీ విధివిధానాలు, సిద్దాంతాలను పూర్తిస్థాయిలో ప్రకటించే అవకాశం ఉందని జాగృతి వర్గాలు అంటున్నాయి.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానీకాన్ని ఉద్దేశించి కల్వకుంట్ల కవిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు పురుషులు స్థాపించిన పార్టీలను చూశారని.. తెలంగాణ ఆడబిడ్డగా తాను పార్టీ పెడితే మహిళా శక్తి ఎలా ఉంటుందో చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో యువతతో పాటుగా మహిళలకు అగ్రతాంబూలం ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణ మౌలిక ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాలను తన పార్టీ ద్వారా సంపూర్ణంగా సాధిస్తామని ఆమె స్పష్టం చేశారు. దీంతో 25న జరగబోయే కవిత కొత్త పార్టీ ఆవిర్భావ సభ అందరిలో ఆసక్తి రేపుతోంది.
Also Read: నెల్లూరు క్లీన్ స్వీప్.. రెండేళ్లకే రివర్స్ సీన్? బాబు క్లాస్తో తమ్ముళ్లలో వణుకు!
Story by: Apparao, Big Tv