Kavitha New Party: కొద్దిరోజుల్లోనే తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితి నేతృత్వంలో పార్టీ ఏర్పాటుకు బీజం పడింది. ఉగాదికి కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన చేస్తారంటున్నారు. ఆ క్రమంలో ఇంత కాలం వివిధ కార్యక్రమాలు నిర్వహించిన తెలంగాణ జాగృతి…తర్వలో రాజకీయ పార్టీగా మారబోతుందట. అయితే కవిత పెట్టే పార్టీతో ఎవరికి లాభం?…ఎవరికి నష్టం? అనే దానిపై తెలంగాణ పాలిటికల్స్లో పెద్ద డిబేట్ స్టార్ అయిందిప్పుడు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడతాను అని స్పష్టంగా ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సాంస్కృతిక చైతన్యం కోసం స్థాపించిన తెలంగాణ జాగృతి ఇకపై రాజకీయ క్షేత్రంలో పోరాడనుందని కవిత స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని..త్వరలోనే పార్టీ విధివిధానాలను వెల్లడిస్తామని ఆమె పేర్కొన్నారు. శాసనమండలి నుంచి రిజైన్ చేసి వ్యక్తిగా వెళ్లుతున్న తాను…రాజకీయ శక్తిగా తిరిగి వస్తాననే ధీమాను కవిత వ్యక్తం చేశారు.
రాజకీయంగా నేతల్లో అసంతృప్తి వచ్చినా లేక పార్టీల అధినేతలపై అలిగినా…బయటకు వచ్చిన పార్టీలు పెట్టడం కొత్త కాదు. గతంలోను చాలా మంది పెట్టారు. అయితే కొత్తగా వచ్చిన పార్టీల వల్ల ఏ మేరకు ఇతర పార్టీలకు ఇబ్బంది కలిగుతుంది…ఏ పార్టీ రాజకీయంగా దెబ్బతీసే అవకాశం ఉంటుందనే చర్చ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఆ క్రమంలో ఇప్పుడు కవిత పార్టీ పెడితే…ఆ పార్టీ ప్రభావం ఎవరిపై పడబోతుందనేది తెలంగాణలో చర్చనీంయశంగా మారింది.
మొత్తానికి ఉగాదికి కొత్త పార్టీపై ప్రకటన చేయనున్నారు కవిత. తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే దిశగా జాగృతి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలపై జాగృతి కార్యకర్తలతో చర్చించారు. ఆ తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటే బాగుంటుందనే విషయాన్ని వారి ద్వారా సేకరించనున్నారు. ఈ మీటింగ్లో క్యాడర్ సలహాలు తీసుకుంటారు. వారి అభిప్రాయాలు సేకరించి వాటన్నింటిని క్రోడీకరించి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటారని తెలంగాణ జాగృతి నాయకులు చెబుతున్నారు.
ఇప్పటికే జిల్లాల ఇన్చార్జులు, కార్యదర్శులతో కవిత చర్చలు జరిపారు. ఇప్పటివరకు జరిగిన జనం బాట కార్యక్రమానికి సంబంధించిన రివ్యూ తెలుసుకున్న కవిత భవిష్యత్తు కార్యాచరణపై ముఖ్య నేతలతో చర్చించారు. పార్టీ పెడితే ప్రజల్లోకి బలంగా వెళ్లగలమా లేదా అన్న సలహాలు, సూచనలు కార్యకర్తలు, నాయకుల నుండి అడిగి తెలుసుకున్నారు. వచ్చే నెలలో మరో రాష్ట్రస్థాయి మీటింగ్ ఏర్పాటు చేసి పార్టీ పేరును ఖరారు చేసే అవకాశం ఉందని జాగృతి నేతలు అంటున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీతోనే పోటీ చేయనున్నట్లు ప్రకటించిన కవిత… అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొత్త పార్టీకి తెలంగాణాలో ఏ మేరకు అవకాశాలు ఉన్నాయని చూస్తే కనుక లేవు అని ఎవరూ చెప్పలేరు, అలాగని ఉన్నాయని బల్ల గుద్ది మరీ చెప్పలేరు. అయినా ఎపుడూ రాజకీయాలే కాదు ఎక్కడైనా అవకాశాలను అందుకోవడమే ఎవరైనా చేయాల్సిన పని. ఆ విధంగా చూస్తే పార్టీ పెట్టే వారి సత్తా మీదనే అంతా ఆధారపడి ఉంటుంది. కవిత పార్టీ పెట్టడం స్పష్టం కావడంతో పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది…పార్టీకి భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది హాట్ టాపిక్గా మారింది.
మొత్తానికి తెలంగాణాలో కొత్త పార్టీకి రంగం అయితే సిద్ధం అయినట్టే కనిపిస్తుంది. రాష్ట్రంలో మరో రెండున్నరేళ్ళలో ఎన్నికలు రానున్నాయి. దాంతో ఇది చాలా కీలక సమయం. కొత్త పార్టీని పెట్టి ఇప్పటి నుంచి జనంలోకి తీసుకెళ్లకపోతే మాత్రం ప్రభావం చూపించడం కష్టమన్న ఆలోచనతో కవిత ఉన్నారట. అందుకే ఈ ఏడాదిలో పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లాలనే సంకల్పంతో ఉన్నారట కవిత.
యువత, బడుగులు, అణగారిన వర్గాలు, అలాగే తెలంగాణా కోసం ఉద్యమించిన వారు, అమర వీరుల బంధువుల కుటుంబాలు, మైనారిటీలు వీరందరికీ ఒక బలమైన రాజకీయ వేదికగా తన పార్టీ ముందుకు వస్తుందని కవిత స్పష్టం చేస్తున్నారు. తెలంగాణాలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ని, అలాగే విపక్షంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీలను సవాల్ చేసి కవిత పార్టీని ముందుకు తీసుకువెళ్లగలరా?…తన విధానాలతో పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ని క్రియేట్ చేసుకునే విధంగాపార్టీ నిర్మాణం చేయగలరా? అన్నదే చర్చగా మారింది.
కవిత కొత్త పార్టీ పెట్టడం ద్వారా తెలంగాణ రాజకీయాలలో ఏ విధమైన పరిణామాలుంటాయనేది ఆసక్తికరంగా మారింది. కవిత పెట్టే పార్టీతో కాంగ్రెస్, బీజేపీల కంటే బీఆర్ఎస్ కు మాత్రం కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందనేది విశ్లేషకుల మాట. ఎందుకంటే తాను అన్ని బంధాలు తెంపుకున్నాను అని ఆమె చెబుతున్నా ఆమెను ఈ రోజుకీ కేసీఆర్ కుమార్తెగానే జనం చూస్తున్నారు. అంతే కాదు ఆమె బీఆర్ఎస్ మీద ఎక్కుపెట్టే ప్రతీ విమర్శతో ఆ పార్టీ ఇరకాటంలో పడుతోంది.
అలాగే బీఆర్ఎస్ లో ఇమడలేని వారు అలాగే ఆ పార్టీ మీద కోపం ఉన్న వారు ఎంతో కొంత మద్దతు తెలిపినా కూడా అది కవిత పార్టీకి ఇంధనంగానే ఉంటుందన్న టాక్ పొలిటకల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అలాగే ఆమె చీల్చే ఓట్లు కానీ లేదా ఆమె పార్టీ వల్ల పడే ప్రభావం కానీ కచ్చితంగా గులాబీ పార్టీనే ఉంటుందని .. అంటే ముళ్ళు గుచ్చుకునేది గులాబీ పార్టీకే అని అంటున్నారు. ఆమె కాంగ్రెస్ మీద విమర్శలు చేసినా ఎంతగా జనాల్లోకి ఎక్కుతాయో తెలియదు కానీ బీఆర్ ఎస్ మీద విమర్శలు అయితే జనాలకు వెళ్లుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి పార్టీ ఏర్పాటుపై కవిత ప్రకటనతో గులాబీ శ్రేణుల్లో గుబులు రేగుతోందంట.
Story by: Ajay, Big Tv