Rajesh Reddy: నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్రెడ్డి.. మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నప్పటికీ తనని తాను ఎలివేట్ చేసుకోవడంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారంట. నిధులు తెచ్చి నిమోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నప్పటికీ.. ఆ అభివృద్దికి సంబంధించిన ప్రచారం మాత్రం క్యాంప్ ఆఫీస్ గోడలకే పరిమితమవుతోందంట. ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి కళ్లకు కనిపిస్తున్నప్పటికీ.. దాన్ని సమర్ధంగా ఫోకస్ చేసుకోవడంలో మాత్రం ఆయన వెనుకపడి పోతున్నారంట. అసలు లోపం ఎక్కడుంది? ఎందుకని రాజేష్ రెడ్డి ఆ విషయంలో వెనుకపడిపోతున్నారు?
నాగర్ కర్నూల్ నియోజకవర్గం అంటే తెలియని వారు ఉండరు. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరు కాదు ఇద్దరు జనార్దనులు ఏకం అయినప్పటికీ ఆ యువ నాయకుడు విజయాన్ని ఆపలేకపోయారు. అంచనాలు లేకుండా బరిలో దిగిన ఆ నాయకుడు కొత్త చరిత్రను తిరగ రాశాడు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో 10 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యం కొనసాగించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పై గెలిచి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు కూచుకుల్ల రాజేష్ రెడ్డి.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు, అనూహ్యపరిణామాల మధ్య బడా పొలిటీషియన్, మాజీ మంత్రి నాగం జనార్ధనరెడ్డి కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఫైర్బ్రాండ్గా సుపరిచితులైన నాగం గత ఎన్నికల్లో మర్రి జనార్ధనరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఇద్దరు జనార్ధును కలిసి ఎన్నికల ప్రచారం చేసినా గులాబీ పార్టీకి పరాభవం తప్పలేదు. అప్పటికి నాగర్కర్నూల్లో ఐదుసార్లు పోటీ చేసి ఓటమి పాలైన ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి తనయుడు కుచుకుళ్ళ రాజేష్ రెడ్డి మొదటి సారి ఎన్నికల బరిలో నిలిచి జనార్ధుల హవాకు చెక్ పెట్టగలిగారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన కూచుకుల రాజేష్ రెడ్డి తోపాటు వెంటనే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం ఆయన తండ్రి దామోదర్ రెడ్డి విజయం సాధించారు. అక్కడినుండి తండ్రి కొడుకులు కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించారు. గడిచిన రెండున్నర ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధి కోసం సుమారు 1,000 వెయ్యి కోట్ల రూపాయల ప్రభుత్వం నిధులు తీసుకొచ్చారు. అయితే చేస్తున్న అభివృద్ధి పనులను బయటికి ప్రచారం చేయడంలో పూర్తి విఫలం అవుతున్నారట.
నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయిందని టాక్ వినపడుతోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, మీడియా కమ్యూనికేషన్స్ టీమ్ , సోషల్ మీడియా విభాగం మధ్య సమన్వయం లేకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తోందట. పార్టీ విధానాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, నాయకుల మధ్య సమన్వయ లోపంతో ‘ఎవరి దారి వారిదే’ అన్నట్లుగా పార్టీ రూల్స్ బ్రేక్ చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.
నాగర్ కర్నూల్ నియోజకవర్గం కాంగ్రెస్లో రాను రాను పరిస్థితి మరింత విచిత్రంగా తయారవుతుందట. పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ మధ్య సమన్వయం కరువై, నాలుగు వర్గాలుగా విడిపోయి పని చేస్తున్నారని నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. మాకే పేరు రావాలని, ఎవరికి వారు తమకే క్రెడిట్ దక్కాలని ప్రచార ఆర్భాటాల్లో వెనుకబడిపోయి, పార్టీ అభివృద్ధి కంటే వ్యక్తిగత ప్రతిష్టపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారట.
ప్రభుత్వ పథకాలపై ప్రచారంలో విఫలమవ్వడంతో పాటు, కీలక సమాచారం, డేటా సేకరణ, నిర్వహణ వంటి ప్రాథమిక అంశాల్లో సోషల్ మీడియా నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందట . ప్రజలకు ఉపయోగపడే సమాచారం సోషల్ మీడియాలో ప్రచారం జరగడం లేదంట. ప్రజలకు ఉపయోగపడే విధంగా కంటెంట్ రూపొందించాల్సిన సోషల్ మీడియా టీమ్, ఆ దిశగా ఆలోచించకపోవడం పార్టీకి మైనస్గా మారుతోందట. మరోవైపు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దూసుకుపోతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ నుంచి సమర్థవంతమైన కౌంటర్లు పడకపోతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రత్యర్థుల పోస్టులకు కౌంటర్ ఇవ్వడంలో పూర్తిగా విఫలం అవుతుండటంతో.. సదరు ఇంచార్జ్ల పనితీరుపై నియోజకవర్గంలో కరుడు కట్టిన కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వాడకంలో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ టీమ్ వెనుకబడిపోయిందని, కాలంతో పరిగెత్తుతూ సోషల్ మీడియాను ప్రమోట్ చేసేవారు లేకపోవడం పార్టీకి మైనస్ లా మారిందట..
2023లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారాన్ని దక్కించుకున్నప్పటికీ, నాగర్కర్నూల్లో ఇప్పుడు అదే పార్టీకి సోషల్ మీడియా పెద్ద తలనొప్పిగా మారిందంట. అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన సోషల్ మీడియానే, ఇప్పుడు ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాగర్కర్నూల్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి కృషితో కాంగ్రెస్కు బలం పెరిగింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత పదేళ్లకు కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కడంలో వారి పాత్ర ఉందని స్థానికులు అంటుంటారు.
ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తూ పనులు చేపడుతున్నా, వాటి ప్రచారం మాత్రం కనిపించడం లేదనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన మీడియా, సోషల్ మీడియా మధ్య పూర్తిస్థాయి సమన్వయం లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. నాయకుల నిర్లక్ష్య ధోరణి, ఫలితం ఇవ్వలేని సోషల్ మీడియా టీమ్ కలిసి పార్టీ ఇమేజ్ను దెబ్బ తీస్తున్నాయట.
టీ20 క్రికెట్ ఆడాల్సిన సమయంలో టెస్ట్ మ్యాచ్ ఆటతీరు ప్రదర్శిస్తున్నట్లు కాంగ్రెస్ సోషల్ మీడియా పని తీరు ఉందన్న సెటైర్లు ఎక్కువవుతున్నాయి. ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని ఢీ కొట్టడంలో కూడా కాంగ్రెస్ సోషల్ మీడియా విఫలమవుతోంది. ఫలితంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి కూడా ప్రజలకు సమాచారం లేకుండా పోతోందంట. ఇప్పటికైనా పార్టీ నాయకత్వం మేల్కొని సోషల్ మీడియా వ్యవస్థలో మార్పులు చేయకపోతే, భవిష్యత్తులో ఇది మరింత పెద్ద నష్టానికి దారితీసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Also Read: నల్లగొండ కాంగ్రెస్లో ‘మంత్రి’ చిచ్చు.. అన్న అవుట్.. తమ్ముడు ఇన్? అసలు నిజమేంటి?
Story by: Apparao, Big Tv