ఓటమి తర్వాత గూడూరు వైసీపీకి నాయకుడి కరువు
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో గూడూరు నియోజకవర్గం ఒకటి.. 1952 లో ఏర్పడిన గూడూరు నియోజకవర్గంలో 16 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 6 సార్లు, TDP 5 సార్లు, స్వతంత్రులు 3 సార్లు, వైసీపీ 2 సార్లు విజయం సాధించారు. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ది పైచేయి ఉంటూ వచ్చిన ఆ సెగ్మెంట్లో.. కాంగ్రెస్ వారసత్వాన్ని వైసీపీ అందిపుచ్చుకోవాలని చూసింది. అయితే అక్కడ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీకి నాయకుడే కరువయ్యాడు.
2014లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన సునీల్
దశాబ్ద కాలంగా స్థిరమైన నాయకత్వం లేకపోవడం వైసీపీకి శాపంగా తయారైంది. 2014లో వైసిపి తరపున గెలిచిన పాశం సునీల్ కుమార్ టిడిపిలో చేరడంతో.. 2019 లో ఆ పార్టీ అభ్యర్ధిని మార్చాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో వైసీపీకి అత్యధిక మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గాల్లో గూడూరు నియోజకవర్గం ఒకటి. నలభై వేల పైచిలుకు మెజారిటీతో వైసిపి అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు అప్పట్లో గెలుపు సొంతం చేసుకున్నారు. ఆ సమయంలో టిడిపి నుంచి బరిలోకి దిగిన అప్పటి మాజీ, ప్రస్తుత ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఓటమి పాలయ్యారు.
2024లో స్థానికేతరుడైన మురళీధర్కి వైసీపీ టికెట్
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్నట్లు పాశం సునీల్ కుమార్ పునాదులను మరింత పటిష్టం చేసుకుని 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. 2019లో వైసీపీ నుంచి గెలిచిన వరప్రసాద్ తనకు టికెట్టు రాదని భావించి వైసీపీని విడిచిపెట్టి వెళ్లడంతో 2024లో స్థానికుడు కాకపోయినప్పటికీ పార్టీకి విధేయుడన్న భావనతో మేరిగ మురళీధర్ ను అభ్యర్థిగా నిలబెట్టారు. అది పాశం సునీల్ కి బాగా కలిసి వచ్చింది.
గూడూరులో ప్రభావం చూపించలేకపోతున్న మురళీధర్
ఓటమి తర్వాత నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న మేరిగ మురళీధర్ చుట్టం చూపుగా నియోజకవర్గానికి వచ్చి పోవడం తప్ప పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారంట. క్వాడ్జ్, సిలికా, మైకా, ఖనిజ సంపదపై అధికార పార్టీ గుత్తాధిపత్యంతో ముందుకు సాగుతుందని సామాజిక మాధ్యమాలలో వరుస కథనాలు వస్తున్నప్పటికీ రోడ్డుపైకి వచ్చి పోరాటం చేయాలన్న సాహసం కూడా చేయలేకపోతున్నారంట.. అర్బన్, రూరల్ సమ్మేళనం ఉన్న గూడూరు నియోజకవర్గంలో సమస్యలు విలయతాండవం చేస్తున్నా ప్రతిపక్ష పార్టీగా వైసీపీ ప్రభావం గూడూరు నియోజకవర్గంలో కనిపించడం లేదట.
పసలేని ఇన్చార్జిలో పోరాటాలు ఎలా ఉంటున్న క్యాడర్
పసలేని ఇన్చార్జిని ఇచ్చారు పోరాటం ఎలా అని కార్యకర్తలు లోలోన మధన పడిపోతున్నారట. ఓడిపోతే ఓడిపోయాం ప్రజల తరఫున పోరాటం చేస్తే కదా పార్టీకి ఫ్యూచర్ ఉండేదని ద్వితీయ శ్రేణి నేతలు, పార్టీ క్యాడర్ అధిష్టానాన్ని ప్రశ్నిస్తోంది. ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ అభివృద్ధి, సంక్షేమం పేరుతో నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తుంటే.. వైసీపీ ఇన్చార్జ్గా మురళీధర్ అంటీ ముట్టనట్లుగా ఉండడం ఫ్యాన్ కేడర్కు రుచించడం లేదట. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు కూడా గూడూరు నియోజకవర్గంలో స్పందన అంతంత మాత్రంగానే ఉండడం అందుకు నిదర్శనంగా చెప్తున్నారు.
ఇన్చార్జ్ మురళీని మార్చాలంటున్న వైసీపీ శ్రేణులు
ఇటీవల వైసీపీలోని కీలక నేతలు రహస్యంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారని విశ్వసనీయ సమాచారం.. మేరిగ మురళితో కొనసాగితే తమకి పుట్టగతులు ఉండవని రాజకీయ భవిష్యత్తు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆ సమావేశంలో పాల్గొన్న కేడర్ అభిప్రాయపడిందంట .. ప్రస్తుతం ఏ ఇద్దరు వైసీపీ నేతలు కలిసినా ఇన్చార్జిని మార్చాలని చర్చించుకుంటున్నారు. ఆ దిశంగా అధిష్టానంపై ఒత్తిడి పెంచడానికి పావులు కదుపుతున్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎమ్మెల్యేగా అవినీతితో అంట కాగి, పార్టీకి ఊహించని చెడ్డ పేరును మూట కట్టారని వరప్రసాద్పై పార్టీ శ్రేణులు మండి పడుతున్నాయి.
మనకెందుకులే అని ఇంటికే పరిమితమవుతున్న నేతలు
మేరిగ మురళీధర్ ఇప్పటికైనా ప్రజల్లోకి చొచ్చుకొచ్చి ప్రజా బాట పడితే తప్ప వైసీపీకి గూడూరు నియోజకవర్గంలో మనుగడ ఉండదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .. 2019 ఎన్నికల్లో వైసీపీకి అత్యధిక మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గాల్లో గూడూరు కూడా ఒకటి. అయితే ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు తమకు ఎందుకులే అన్నట్లు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఐదేళ్ల అధికారంలో తమకు ఎలాంటి ప్రయోజనాలు లేకపోవడంతో ఇప్పుడు ప్రజలకు తాము చేసేది ఏముందంటూ వారు పెదవి విరుస్తున్నారట.
వైసీపీని వీడి టీడీపీ పంచకు చేరుతున్న నేతలు
ఎన్నికల ముందు వరకు అప్పటి ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్కు మీడియా సమావేశాల్లో గట్టిగా బదులిచ్చిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ స్థానికుడు కాకపోవడంతో గూడూరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. అప్పుడప్పుడు గూడూరుకు వచ్చి పోతున్నా పార్టీ నాయకులు, కార్యకర్తలకు సమాచారం కూడా లేదని పార్టీ క్యాడర్ ఢీలా పడిపోతోంది. దాంతో ఇప్పటికే కొంతమంది నేతలు ఇప్పటికే వైసీపీని వీడి టీడీపీ పంచన చేరారు. మరి కొంతమంది వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరకపోయినా నిత్యం ఆ పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారట.
ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ఎందుకని అనుకుంటున్నారా?
అలా ఎవరికి జరగాల్సిన పనులు వారికి జరిగిపోతుండటంతో గూడూరు వైసీపీకి నాయకులే కరువయ్యారంటున్నారు. ఎన్నికల్లో టిడిపికి వ్యతిరేకంగా పనిచేసిన కొందరు వైసిపి నాయకులను ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పూర్తిగా దూరంపెట్టారు. అధికార పార్టీ నేతలకు అడ్డు చెప్పి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ఎందుకన్నట్లు మరి కొంతమంది వైసీపీ నేతలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో గూడూరు వైసీపీలో క్యాడర్ని నడిపే రథసారధి కరువయ్యారంట. మరి ప్రస్తుత వైసీపీ ఇన్చార్జ్ మురళి యాక్టివ్ అవుతారో? లేకపోతే జగన్ కొత్త ఇన్చార్జ్ని నియమిస్తారో చూడాలి