Shinde Sena: మరాఠా రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయ్. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేనకు చెందిన ఆరుగురు లోక్సభ ఎంపీలు ఏక్నాథ్ షిండే శివసేనలో చేరడం ఖాయమైపోయింది. ఇప్పటికే వాళ్లంతా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఓ లేఖని కూడా సమర్పించారు. ఈ పరిణామం ఉద్ధవ్ వర్గానికి భారీ పొలిటికల్ దెబ్బ అనే చెప్పాలి. మహారాష్ట్రలో కొన్నాళ్లుగా సాగుతున్న ఆపరేషన్ టైగర్కు ఇది కీలక మలుపు! కొన్నిరోజులుగా శివసేన యూబీటీ ఎంపీలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. వరుసగా షిండే వర్గంలో సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ షిండే సమక్షంలో పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వీరిలో కొందరు బహిరంగంగా షిండే నాయకత్వానికి మద్దతు ప్రకటించగా ఇంకొందరు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం అధికార పక్షంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బాగా పర్ఫామ్ చేసిన ఉద్ధవ్ శివసేనకు ఇదొక షాకింగ్ ఎలిమెంట్గా భావిస్తున్నారు.
ఎంపీల ఫిరాయింపులతో లోక్సభలో ఏక్నాథ్ షిండే శివసేన బలం 13కి పెరుగుతుంది. సంఖ్యాబలం బరంగా.. మహారాష్ట్రలో కాంగ్రెస్తో సమానమవుతుంది. అదే రాష్ట్రంలో 9 సీట్లతో.. బీజేపీ మూడో స్థానానికి పరిమితంకానుంది. అయితే, బీజేపీ-షిండేకు చెందిన మహాయుతి కూటమిలో ఈ పరిణామం కొత్త ఒత్తిడికి దారితీయొచ్చనే చర్చ జరుగుతోంది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే మధ్య అభిప్రాయ భేదాలున్నాయనే చర్చ సాగుతోంది. దాంతో కేంద్ర మంత్రివర్గంలో షిండే సేనకు మరింత ప్రాధాన్యం లభించే అవకాశముందంటున్నారు. ఇటీవలే.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఇకపై ఒకే శివసేన అంటూ కామెంట్ చేశారు. దాంతో.. ఈ రాజకీయ మార్పుల వెనుక బీజేపీ మద్దతు ఉందనే చర్చ సాగుతోంది. ఈ చేరికలు 2029 ఎన్నికల వ్యూహంలో షిండేకు మరింత బలం చేకూర్చనున్నాయి.
Also read: Coaching Fire: లక్నో కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి!
సీఎం పదవి దక్కనందువల్ల షిండే మద్దతుదారులు నిరాశతో ఉన్నారు. ఆయన ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ బీజేపీ హైకమాండ్తో ఈ వివాదాస్పద విషయాలనే ప్రస్తావిస్తారనే టాక్ ఉంది. అయితే, మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా షిండేకు బేరసారాల శక్తి పెరిగే అవకాశముంది. మోడీ క్యాబినెట్లో జరగబోయే మార్పులపై ఆయన ఫోకస్ పెడతారు. ప్రస్తుతం షిండే శివసేనకు యూనియన్ క్యాబినెట్లో ఓ సహాయ మంత్రి పదవి మాత్రమే ఉంది. ఇప్పుడు తన దగ్గర 13 మంది ఎంపీలు ఉండటంతో కేంద్ర మంత్రివర్గంలో పెద్ద వాటా కావాలని ఒత్తిడి చేసే అవకాశాన్ని షిండే వదులుకునే ఛాన్సే లేదు. ఏక్నాథ్ షిండే ఫోకస్ కేవలం కేంద్రంలో తన ప్రభావాన్ని పెంచుకోవడం మీద మాత్రమే లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ విస్తరణపైనా ఫోకస్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలోపేతం, సంస్థాగత విస్తరణ ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది.
ఇక, శివసేనని బలహీనపర్చి చీల్చేందుకు బీజేపీ పదే పదే ప్రయత్నిస్తోందని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. రాజకీయంగా ప్రాముఖ్యత లేని టైమ్లో బీజేపీ ఎదుగుదలకు తమ పార్టీ సాయపడిందన్నారు. బీజేపీ వెన్నుపోటు పొడిచి ఇచ్చిన మాట తప్పిందన్నారు. వాస్తవానికి మహారాష్ట్రలో అగ్రస్థానం కోసం బీజేపీ, శివసేన మధ్య చారిత్రాత్మకంగా పోరు సాగుతోంది. తాజా రాజకీయ పరిణామాలు మహారాష్ట్ర రాజకీయాల్లో రెండు పార్టీల బలాబలాలను మరోసారి మార్చనున్నాయ్. షిండే సేనకు పెరుగుతున్న బలం మహాయుతి కూటమిలో కొత్త మార్పులకు దారితీయడం ఖాయమంటున్నారు.
Storey By: Anup Big Tv
Also read: ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సంక్షోభం.. కేటీఆర్ సెటైర్లు