దేశ రాజకీయాల్లో మోడీ నిజంగానే కొత్త చరిత్ర సృష్టించాడు. జంతర్మంతర్ సాక్షిగా ఆయన పాలనలో ఎన్నడూ మరిచిపోలేని ఘటన తమ భవిష్యత్ కోసం పోరాడుతున్న జెన్-జీపై దాష్టికంగా దాడి చేయించడం. లాఠీ చార్జిలు, టియర్ గ్యాస్ ప్రయోగాలు.. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? చేశారు? అంటే.. ఓ మంత్రిని కాపాడేందుకు.
ధర్మేంద్ర ప్రధాన్ పక్షం వహించిన ప్రధాని ఇలాంటి దురాగతాలకు పాల్పడటంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎలా ఉండే రాజకీయాలు ఎలా అయ్యాయి…? తప్పు జరిగినప్పుడు.. బాధ్యత మరిచినప్పుడు.. పదవికి మచ్చ వచ్చినప్పుడు తమంతట తామే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసే హుందా రాజకీయాలకు ఇప్పుడు కాలం చెల్లింది. ఇప్పుడు మోడీ పాలన సాగుతోంది. ఈ పాలనలో మోడీ ఏది చెబితే అదే ధర్మం.. ఏ నిర్ణయం తీసుకున్నా.. అది దేశం కోసమే.
కానీ ఇది అన్ని వేళల్లో .. ఎల్లకాలం చెల్లుబాటు కాదనే విషయం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం జెన్- జీ చేపట్టిన ఉద్యమం నిరూపించింది. ఇదిప్పుడు మారిన దేశ రాజకీయ పరిస్థితులను ప్రశ్నిస్తోంది. జంతర్ మంతర్ వేదికగా ఏలికల సరికొత్త దమనకాండను ఎలుగెత్తి చాటుతోంది.
హుందా రాజకీయాల రాజీనామాలు ఆనాడు. బాధ్యతలెరిగి ప్రవర్తించే నాయకత్వం నుంచి నేర్చుకోవాల్సి ఉంది ఇవాళ. అవును.. రైల్వే మంత్రిగా మహబూబ్నగర్ రైలు ప్రమాదం తర్వాత లాల్బహదూర్ శాస్త్రి (1956) రాజీనామాకు తనంతగా తానే ముందుకు వచ్చి బాధ్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. అనంతరం దాదాపు 144 మంది అరియలూరు వద్ద జరిగిన రైలు ప్రమాదంలో చనిపోతే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన ఉదంతం ఇప్పుడు కళ్లముందు తారాడుతోంది. ఇదే తరహాలో 1999లో నితీశ్ కుమార్ .. పశ్చిమ బెంగాల్లోని గైసాల్ రైలు ఢీకొన్న ప్రమాదంలో సుమారు 290 మంది మరణించడంతో రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేశారు.
1992లో మాధవరావు సింధియా ఢిల్లీలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ప్రమాదానికి గురైన ఘటనకు బాధ్యత వహించి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన చరిత్ర గురించి ఇప్పుడు చర్చించుకుంటున్నారు. 2008లో శివరాజ్ పాటిల్ 26/11 ముంబై ఉగ్రదాడులకు తన వైఫల్యంగా భావించి.. దీనికి నైతిక బాధ్యతగా.. కేంద్ర హోంమంత్రి పదవికే రాజీనామా చేసిన హుందా రాజకీయాలను దేశం ముందుంచాడు.
2017లో సురేష్ ప్రభు వరుస రైలు పట్టాలు తప్పిన ఘటనల నేపథ్యంలో రైల్వే మంత్రిగా రాజీనామా సమర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాజీనామాను ఆమోదించి రైల్వే శాఖ నుంచి తప్పించారు. తమకు అప్పగించిన గురుతర బాధ్యతగా మంత్రి పదవులను చేపట్టి .. జాతికి నష్టం జరిగిన మరుక్షణం బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ఏ మాత్రం వెనుకాడలేదు. ఆ సంస్థ గౌరవాన్ని కాపాడేందుకు రాజీనామా చేసి యువతరానికి, దేశానికి మార్గదర్శకంగా నిలిచారు.
కానీ ఇప్పుడేం జరుగుతోంది. దీనికి పూర్తి విరుద్దంగా కేంద్రం ముందుకు పోతోంది. మొండికి పోతోంది. తొండికి దిగుతోంది. మేం చేసింది కరెక్టేననే బుకాయింపు, బరితెగింపును కూడా ప్రదర్శిస్తోంది. ఇప్పుడు దీన్నే యావత్ జాతి ప్రశ్నిస్తోంది. నీట్ పేపర్ లీకు విషయంలో అది తమ తప్పిదమే కానట్టుగా ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వ్యవహరిస్తుండగా.. దీనికి వత్తాసు పలుకుతూ వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు ప్రధాని.
ఓ ప్రధాన్ కోసం విద్యార్థుల వెన్ను వెరిచేలా చేసిన ఘటననూ లైట్ తీసుకోవడమే కాదు.. న్యాయం కోసం రోడ్డెక్కి రాజీనామా చేయాల్సిందిగా వారు గుర్తు చేసిన న్యాయబద్దమైన డిమాండ్పై వెన్నువిరిచే చర్యలకు దిగడం మోడీ పాలనలో ఓ మచ్చలా మిగిలిపోయింది. ఈ దమనకాండను బీజేపీ శ్రేణులు తమకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు.
ఎక్కడ మోడీకి చెడ్డపేరు వస్తుందోననే జంకుతో సోషల్ మీడియాలో.. మేం మోడీని సమర్థిస్తున్నాం… విద్యార్థుల ఈ చర్య వెనుక విదేశీ శక్తుల హస్తం ఉంది.. అంటూ మరీ దిగజారుడు రాజకీయాలను నడుపుతున్నారు. బహుశా ఢిల్లీ కేంద్రంగానే ఇలాంటి ప్రచారం చేయాలనే ఆలోచన ఇచ్చి ఉంటారు. ఇంతకు మించి కూడా వారి నుంచి పెద్దగా ఆశించేదేమీ ఉండదనే విషయం అర్థమైపోతోంది దేశానికి. ఢిల్లీ జంతర్మంతర్ వద్ద జరిగిన దాడిని కళ్లారా చూసిన తరువాత.