డిలిమిటేషన్పై డీఎంకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందన్న విషయమై చర్చించేందుకు డీఎంకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాల నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీకి తెలంగాణ నుంచి సీఎం రేవంత్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డి హాజరయ్యారు. కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు సైతం హాజరై ఒకే వేదిక పంచుకోవడం విశేషం.
జగన్ని అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించిన స్టాలిన్
ఏపీ నుంచి వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ని కూడా స్టాలిన్ ఆ అఖిల పక్ష సమావేశానికి ఆహ్వానించారు. అయితే స్టాలిన్తో మంచి సాన్నిహిత్యం ఉన్న జగన్ అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అక్రమాస్తుల కేసుల్లో ఏ-1 నిందితుడైన జగన్ పదేళ్లుగా బెయిల్పై ఉన్నారు. ఆ కేసులను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సీబీఐ, ఈడీలు విచారిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి ఎదురెళ్తే బెయిల్ రద్దు అవుతుందనే భయంతోనే స్టాలిన్ మీటింగ్ కి వెళ్లలేదంట.
డిలిమిటేషన్పై మోదీకి లేఖ రాసిన జగన్
కేంద్ర తీసుకున్న డిలిమిటేషన్ అంశానికి వ్యతిరేకంగా స్టాలిన్ పెట్టినా సమావేశానికి వెళ్లకుండా ప్రధాని మోదీకి జగన్ డిలిమిటేషన్ పై లేఖ రాయడం విమర్శలు పాలవుతోంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, అంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ ఏనాడు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకి వ్యతిరేకంగా వ్యవహరించలేదు. పార్లమెంటుల పలు బిల్లుల విషయంలో మద్దతు ఇచ్చిన జగన్ బీజేపీతో తన రహస్య ఒప్పందాన్ని చాటుకున్నారు. డైరెక్టుగా పొత్తు పెట్టుకోక పోయినా ఇన్ డైరెక్టుగా బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు.
ఇండియా కూటమి సమావేశాలకు హాజరుకానీ జగన్
ఎన్టీఏకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పాటు చేసిన సమావేశాలకు గతంలో ఎప్పుడూ జగన్ హాజరు కాలేదు.. ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నా మాజీ ముఖ్యమంత్రి బీజేపీని పల్లత్తు మాటనే సాహసం చేయడం లేదు. ఒకవైపు చూస్తే జగన్ అక్రమాస్తుల కేసులో ఏళ్ల తరబడి పురోగతి లేదని ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పదేళ్లుగా జగన్ బెయిల్ పైనే ఉన్నారని, సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా గత 12 ఏళ్లుగా ట్రయల్ ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని.. సీబీఐ, నిందితులు అవగాహనతో ఉన్నారనిపిస్తోందని ఆయన న్యాయవాదులు వాదించారు.
Also Read: పిఠాపురం సభ ఎఫెక్ట్.. మంత్రి పదవి లేనట్లే!
బెయిల్ రద్దుపై జగన్ భయపడుతున్నారని ప్రచారం
అయితే జగన్ బెయిల్ రద్దుపై హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీం ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు రఘురామకృష్ణంరాజు పిటీషన్లపై కౌంటర్ దాఖలు చేయడంలో సీబీఐ, ఈడీలు తాత్సారం చేస్తున్నాయి. సిబీఐ, ఈడీల పరంగా గతంలో ఉన్న పరిస్థితులు కనిపించకపోవడంతో జగన్ బెయిల్ రద్దుపై భయపడుతున్నట్లు కనిపిస్తున్నారు. బెయిల్ రద్దు చేయకపోయినా విచారణలకు హాజరవ్వాల్సిందేనని ఆదేశాలు వస్తే అది కూడా జగన్కు పెద్ద సమస్యే.
నవ్వులు పాలు కాకుండా ఉండటానికి మోదీకి లేఖాస్త్రం
అసెంబ్లీలో 11 మంది టీమ్తో మిగిలి అర్హత లేకపోయినా ప్రతిపక్ష నేత హోదా కోసం పట్టుబడుతున్న జగన్.. ఇలాంటి కష్టకాలంలో బీజేపీతో వైరం పెట్టుకుంటే కొత్త తలనొప్పులు ఎదుర్కోవలసి వస్తుందన్న భయంతో ఉన్నారన్న చర్చ నడుస్తోంది. ఆ క్రమంలో ఇంకా బీజేపీతో అంటకాగుతున్నారని నవ్వులు పాలు కాకుండా ఉండటానికే వ్యూహాత్మకంగా.. డిలిమిటేషన్పై ప్రధాని మోడీకి లేఖ రాసారంటున్నారు. మొత్తానికి చెన్నైలో మీటింగ్ జరుగుతున్న రోజే జగన్ లేఖ రాయడం ఆయన భయాందోళనలకు అద్దం పడుతుందన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది.