Lokesh Cricket: టీడీపీ యువనేత, రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ మంత్రి నారా లోకేశ్ టీ20 ఫైనల్స్ లో సందడి చేశారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ను లోకేశ్ స్వయంగా వెళ్లి వీక్షించారు. ఈ టోర్నీలో మ్యాచ్ లను ప్రత్యక్షంగా చూడటానికి లోకేశ్ వెళ్లడం కొత్తేమీ కాదు. అయితే ఫైనల్ మ్యాచ్ కు ముందు పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్ వీక్షించడానికి లోకేశ్ కొలంబో వెళ్లివచ్చినప్పుడు ఆయన పర్యటనలపై వైసీపీ విమర్శలు గుప్పించారు. జగన్ అయితే స్పెషల్ ఫైట్లతో ప్రజా ధన్నాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ నేపధ్యంలో లోకేశ్ ఫైనల్ మ్యాచ్లో సందడి చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏం చేసినా, వైసీపీ ఎంత హడావుడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నికల ముందు లోకేశ్ యువగళం పాదయాత్ర చేసే సమయంలో.. వైసీపీ మీడియా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.. నారా లోకేష్ ను చాలా తక్కువ చేసి చూపిస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడిందన్న విమర్శలున్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో, టీడీపీలో లోకేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యంగం అంటూ లోకేశ్ని టార్గెట్ చేస్తున్న వైసీపీ,ఆయన విషయంలో ఎంతటి ప్రచారానికైనా వెనుకడుగు వేయడం లేదు. తాజాగా ఆయన వ్యక్తిగత పర్యటనలను ప్రభుత్వ ఖర్చులతో ముడి పెడుతూ ప్రచారం మొదలుపెట్టి అభాసుపాలైంది.
ఇటీవల లోకేశ్ కొలంబోలో ప్రపంచ టి20 టోర్నీలో పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ చూసి వచ్చారు. భారత జట్టు జెర్సీ తో పాటు, జాతీయ జెండాతో మైదానంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పనిలో పనిగా ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ అధ్యక్షుడు జై షా తో సమావేశం అయ్యారు. కీలక చర్చలు జరిపారు. అలా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సైతం విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే నారా లోకేష్ ప్రభుత్వ ఖర్చులతో జల్సాలు చేస్తున్నారంటూ వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది. విమాన ఖర్చులతో పాటు విలాసాలకు ఖర్చు చేస్తున్నారంటూ ప్రచారం చేస్తుండడంతో.. రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది.
నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ ల వీక్షణ సమయంలో.. అస్సలు ప్రభుత్వం తరఫున ఖర్చు చేయడం లేదని.. అదంతా ఆయన వ్యక్తిగత ఖర్చు అని.. అలా జరుగుతున్న ప్రచారంలో అస్సలు నిజం లేదని తేల్చి చెప్పింది. దీంతో అదంతా ఉత్త ప్రచారం అని తేలిపోయింది. అయితే లోకేష్ విషయంలో ఇలాంటి ప్రచారం కొత్త కాదు. గతంలో కూడా ఎన్నెన్నో ప్రచారాలు చేసి అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి.
సాధారణంగా ప్రభుత్వ కార్యకలాపాలు అంతగా ఉండని వారాంతాల్లో వీక్ ఎండ్ లల్లో జరిగే మ్యాచ్ లను చూసేందుకు లోకేశ్ ఆసక్తి చూపుతుంటారు. ఇక తాజాగా జరిగిన ఫైనల్స్ ను చూసేందుకు ఆయన అహ్మదాబాద్ వెళ్లారు. మంత్రిగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన లోకేశ్ వ్యక్తిగత సరదాల కోసం పర్యటనలు చేయడమేంటి? అంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ గతంలో విమర్శలు చేశారు. మంత్రి లోకేశ్ తన సరదాల కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ధ్వజమెత్తారు.
అయితే జగన్ విమర్శలను లోకేశ్ సోషల్ మీడియా ద్వారా దీటుగా తిప్పికొట్టారు. చిత్తూరు యాసలో నా దుడ్లు నేను ఖర్చు పెట్టుకుంటే నీకేంటి ఇబ్బంది అంటూ కౌంటర్ ఇచ్చారు. అయినా వైసీపీ విమర్శలు మానకపోవడంతో.. జగన్ వస్తానంటే క్రికెట్ మ్యాచ్ లకు తీసుకువెళతానంటూ మరోసారి లోకేశ్ సెటైర్లు వేశారు.
దీంతో మంత్రి లోకేశ్ పర్యటనపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరిగింది. మంత్రి తన పర్యటనకు పూర్తిగా సొంత డబ్బులు వినియోగిస్తున్నప్పటికీ అలా రాద్దాంతం చేస్తూ వైసీపీ మరింత అభాసుపాలవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ క్రమంలో ఐసీసీ టోర్నీలకు క్రికెట్ అభిమానిగా మంత్రి లోకేశ్ వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నడిచింది. ఈ క్రమంలో జగన్ విమర్శల తర్వాత రెండు మ్యాచుల్లో లోకేశ్ కనిపించలేదు. మంత్రి వెళ్లారో? లేదో? కానీ టీడీపీ సోషల్ మీడియా ఆ విషయన్ని ఎక్కడా హైలెట్ చేయలేదు.
తాజాగా ఫైనల్స్ తరువాత మంత్రి లోకేశ్ అహ్మదాబాద్ లో ఇండియా జెర్సీతో సందడి చేసిన వీడియోలు ప్రత్యక్షం కావడంపై మళ్లీ చర్చ మొదలైంది. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవరు విమర్శలు చేసినా వ్యక్తిగత పర్యటనలు, ఆసక్తులను వదులుకునేది లేదని లోకేశ్ స్పష్టం చేసినట్లైందని అంటున్నారు. అంతేకాకుండా జగన్ విమర్శలు, ఆ తర్వాత లోకేశ్ కౌంటర్లను గుర్తు చేస్తూ టీడీపీ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు తాను స్టేడియానికి వెళ్లి చూసిన ఏ మ్యాచ్లో కూడా భారత క్రికెట్ జట్టు ఓడిపోలేదంటూ మంత్రి లోకేశ్ ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశారు. లోకేశ్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: సైలెంట్గా ఉంటే సీటు గల్లంతే! ఏపీ కమలనాథులకు మాధవ్ షాక్ ట్రీట్మెంట్
Story by: Apparao, Big Tv