NDA Victory: పుదిచ్చేరిలో ఎన్డీయే చారిత్రక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. వరుసగా రెండోసారి గెలిచి అధికార పీఠంపై తన జెండా ఎగరేసింది. ఇప్పటివరకు ఏ పార్టీకి కానీ.. కూటమికి కానీ సాధ్యం కాని ఈ ఘనతను అలవోకగా సాధించి చూపించింది. పుదిచ్చేరి చరిత్రలోనే వరుసగా రెండో సారి విజయం సాధించడం ద్వారా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఆరు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఈ ఘనత సాధించిన ఏకైక కూటమిగా చరిత్రలో సువర్ణాక్షరాలు లిఖించుకుంది. బక్క పలచటి రూపంతో …పొడవాటి చేతుల తెల్ల చెక్కా వేసుకునే.. ఓ పెద్దాయన నేతృత్వంలో సాధించిన ఈ విజయానికి దోహదపడిన కారణాలేంటి ?
పుదిచ్చేరి రాజకీయ చరిత్రలో ఇప్పటివరకు వరుసగా ఏ పార్టీ లేదా కూటమి రెండు సార్లు అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. 1964 నుంచి గమనిస్తే.. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రజలు ప్రభుత్వాన్ని మారుస్తూ వచ్చారు. కానీ ఎన్.రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ ఈ రికార్డును తిరగరాసింది. 2021లో అధికారంలోకి వచ్చిన AINRC-BJP కూటమి, మళ్ళీ 2026లో కూడా విజయం సాధించి వరుసగా రెండోసారి గద్దెనెక్కింది. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఎన్.రంగస్వామి .. ఐదోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయ్యింది. సామాన్యుల్లో సామాన్యుడి.. సాదాసీదీగా.. ఎప్పుడూ ప్రజల్లో ఉండే ఎన్.రంగస్వామి .. క్లీన్ ఇమేజ్ ఈ విజయానికి ఒక కారణమైతే.. కేంద్రంలోని బీజేపీ పెద్దల ముందు చూపు మరో కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా పని చేసిన ఎన్.రంగస్వామి… 2021లో అఖిల భారత ఎన్. ఆర్. కాంగ్రెస్ …. ఏఐఎన్ఆర్సీ పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు. ఆయన 2001లో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2006 నుండి 2008 వరకు రెండోసారి పదవిలో కొనసాగారు. 2011లో మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగా, 2021లో నాలుగోసారి పదవి చేపట్టారు. 1991, 1996, 2001, 2006 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. ఇక తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 1991లోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పుదిచ్చేరిలో ఈసారి ఎన్డీయే కూటమి వరుస విజయానికి అనేక కారణాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో పుదిచ్చేరిలో ప్రభుత్వాలు మారడానికి ప్రధాన కారణం కూటముల్లో పార్టీల మధ్య అంతర్గత కలహాలు ఉండటం. అంతే కాదు కేంద్రంతో సఖ్యత లేకపోవడం… ఈసారి ప్రజలు స్థిరత్వానికి ఓటేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర మద్దతు కోసమే ఎన్డీయేకు రెండో అవకాశం ఇచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: విజయ్కు ‘కులం లేదు’ ట! స్వయంకృషితోనే…. సినిమా, రాజకీయం రెండింట్లోనూ!
రంగస్వామి ప్రభుత్వం అమలు చేసిన ప్రత్యక్ష నగదు బదిలీ పథకం, వివిధ సంక్షేమ పథకాలు ఓటర్లలో సానుకూలతను పెంచాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లోని మహిళా యజమానులకు ప్రభుత్వం అందించే నెలవారీ సహాయాన్ని ₹1,000 నుండి ₹2,500కి పెంచారు. దాదాపు 65,000 మంది మహిళలు దీని ద్వారా లబ్ధి పొందారు. పసుపు రేషన్ కార్డులు కలిగిన కుటుంబాల్లోని మహిళా యజమానులకు కూడా నెలవారీ ₹1,000 ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం పొడిగించింది. ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్లను అన్ని కేటగిరీలలో ₹500 మేర పెంచింది. నవజాత ఆడపిల్లల పేరు మీద చేసే ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తాన్ని ₹50,000 నుండి ₹1 లక్షకు పెంచుతామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే సహాయాన్ని ₹8,000 నుండి ₹12,000కి పెంపు, విద్యార్థులకు ల్యాప్టాప్లు, సైకిళ్ల కోసం నగదు జమ చేయడం వంటివి హామీలను కూడా ప్రకటించారు.
ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్, డీఎంకేల మధ్య విభేదాలు తలెత్తాయి. దాంతో కొన్ని చోట్ల మిత్రపక్షాలు ఎవరికి వారు బరిలో దిగడం కూడా ఎన్డీయేకు కలిసొచ్చింది. ఇక నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే కూటమి మొదటిసారి బరిలో దిగి యువత ఓట్లు ఆకర్షించింది. ఇది ప్రధానంగా ప్రతిపక్ష ఓట్లను చీల్చి ఎన్డీయే విజయానికి పరోక్షంగా తోడ్పడింది. పుదుచ్చేరి చరిత్రలోనే అత్యధికంగా 91.23% ఓటింగ్ నమోదు కావడం కూడా అధికార పార్టీకి అనుకూలంగా మారినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. రంగస్వామి వ్యక్తిగత ఇమేజ్ ఈ కీలక విజయానికి దోహదపడింది. రంగస్వామిని పుదుచ్చేరి ప్రజలు మక్కలిన్ ముత్తల్వార్ అని పిలుపుచుకుంటారు. అంటే ప్రజల ముఖ్యమంత్రి అని అర్థం. ఆయన నిరాడంబరత, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండటం, ఆయనకున్న క్లీన్ ఇమేజ్ మహిళా ఓటర్లను, గ్రామీణ ప్రజలను విశేషంగా ఆకర్షించింది.
గత ఐదేళ్లలో కేంద్రం సహకారంతో రహదారులు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, పర్యాటక రంగంలో చేపట్టిన అభివృద్ధి పనులు మధ్యతరగతి ఓటర్లను ఆకట్టుకున్నాయి. పుదుచ్చేరిలో కొత్త పరిశ్రమలను ఆకర్షించడానికి ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ రాయితీలు, పన్ను మినహాయింపులు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే ఆశను కల్పించాయి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, డీఎంకేతో సరైన సమన్వయం లేకపోవడం వల్ల విపక్షం ప్రజల్లో బలమైన ప్రత్యామ్నాయంగా కనిపించలేకపోయింది. మొత్తమ్మీద ఈ సారి వరుసగా ఎన్డీయే కూటమికి పలు కారణాలు దోహదపడ్డాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Storey By: Anup Big Tv
Also Read: షార్ట్ టైంలోనే భారీ సక్సెస్.. టీవీకే విజయ్పై పవన్ స్పందన ఇదే