ఢిల్లీ లో పరిస్థితులు మరింత వేడెక్కాయి. ఇది బీజేపీ స్వయంకృతాపరాధం. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో సీజేపీ పట్టు మరింతగా బిగుసుకుంది. ఇండి కూటమి తోడురాగా ఎక్కడిదాకైనా సరే, అనే విధంగా విద్యార్ధులు జంతర్మంతర్ వద్ద పంతం పట్టుకు కూర్చున్నారు.
మళ్లీ ఇవాళ చర్చలకు పిలిచినా .. కాక్రోచులు అస్సలే పట్టించుకోలేదు. ఇప్పటి దాకా చర్చల పేరుతో కేంద్రం విద్యార్థులను అవహేళన చేసిందనే కోపం ఉంది. దీనికి తోడు ఓవైపు శాంతియుతంగా చర్చలంటూనే.. వీపులపై లాఠీల మోత మోగించిన వైనం, రక్తం చిందేలా విరుచుకుపడిన నేపథ్యం.. కేంద్రంపై ఉన్న కాస్త గౌరవాన్ని కూడా తుడచిపెట్టేశాయి.
దీంతో ఇవాళ కేంద్రం నుంచి మళ్లీ చర్చల కోసం పిలుపు వచ్చినా .. చర్చలు గిర్చలు జాన్తా నై అని తిప్పి పంపారు జెన్-జీ ఉద్యమకారులు. విద్యార్ధులు. ముందు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తరువాతే కేంద్ర ప్రభుత్వంతో చర్చలకే ఓకే చెబుతామని భీష్మించుకు కూర్చున్నారంతా. దీంతో పరిస్థితి చేయి దాటి పోయిందని కేంద్రానికి అర్థమైంది.
ఈ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమైంది కేంద్రం. ఉగ్రవాదులతో లింకు పెట్టే ప్రయత్నం చేసింది. తన సోషల్ మీడియాను ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా అలర్ట్ చేసింది. కానీ జనం నుంచి యూత్ నుంచి సపోర్టు దొరకలేదు బీజేపీకి. పక్కా బీజేపీ భక్తులు తప్ప.. ఎవరూ కేంద్రం చర్యలకు సపోర్టు చేయలేదు. కాక్రోచులు చేపడుతున్న ఉద్యమంలో నిజాయితీ ఉందనే చూస్తున్నారు పార్టీలకతీతంగా.
దీంతో ఇక్కడ దేశం కోసం, ధర్మం కోసం అనే మోడీ తారక మంత్రం పనిచేయలేదు. దిగితే గానీ లోతు తెలియదన్నట్టుగా.. ఉద్యమం ఇక్కడదాకా తెచ్చుకుని పీకల మీదకు ఒత్తిడి పెంచుకున్న తరువాత గానీ తెలియ రాలేదు మోడీకి. దీంతో ధర్మేంద్ర ప్రధాన్ వ్యవహారం ఎన్డీయేకు పెద్ద మచ్చలా తయారయ్యింది. పంతానికి పోయి.. ఇది ఇండి కూటమికి మైలేజీ ఇస్తుందనే కోణంలో ఆలోచించి.. కావాలని ఈ ఇష్యూను కోల్డ్ స్టోరేజీలో పెట్టి… తాత్సారం చేసి ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడులా తయారయ్యిందే పరిస్థితి..?? అని బీజేపీ పెద్దలు అంతర్మథనం పడుతున్నారు.
ధర్మేంద్రను విద్యా శాఖ నుంచి తప్పించి.. ఇతర శాఖను అప్పగించినా అయిపోయేదే..కానీ అలా చేసినా తప్పు చేసిన వారిలా కాక్రోచుల ముందు తలవంచుకున్నట్టు అవుతుందని, అది తమ పార్టీకే తలవంపులు అనే విధంగా మోడీ సర్కార్ బింకం ప్రదర్శించింది. ఇప్పుడు బింకం వదిలి, ఈగోను పక్కకు పెట్టి.. రెండు మూడు మెట్లు దిగి వచ్చి చర్చిద్దాం రండి.. ప్లీజ్..! అని బతిమాలినా అక్కడ వినే పరిస్దతి లేదు.
ముందు ధర్మేంద్రను తప్పించండి… అప్పటి దాకా నో టాక్స్..! అని తెగేసి చెబుతున్నారు. మీరెన్ని అటాక్స్ చేసినా కదిలేదీ లేదు.. వదిలేదీ లేదని గిరిగీసుకుని కూర్చకున్నాయి కాక్రోచులు.