Uttam Kumar Reddy: రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్)ఆధునీకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఆర్డీఎస్ వ్యవస్థను బలోపేతం చేసి తుంగభద్ర జలాలపై తెలంగాణ హక్కులను పరిరక్షించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రెండో దశ పనులను వేగంగా అమలు చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
సచివాలయంలో నీటిపారుదలశాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్డీఎస్,తుంగభద్ర ఆనకట్ట నిర్వహణ, అంతర్రాష్ట్ర జల పంపిణీ, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పురోగతి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. సమావేశంలో రైతు ప్రతినిధులు.. ఆర్డీఎస్ హెడ్వర్క్స్ దుస్థితి, పొరుగు రాష్ట్రాల ద్వారా జరుగుతున్న అనధికార నీటి మళ్లింపులు, తుంగభద్ర జలాశయంలో పూడిక పేరుకుపోవడం వల్ల నిల్వ సామర్థ్యం తగ్గిపోవడం వంటి అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆర్డీఎస్ వ్యవస్థలోని అనేక నిర్మాణాలు కాలపరిమితి దాటిపోయాయని, అత్యవసర పునరుద్ధరణ అవసరమని వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్డీఎస్ ఆధునీకరణ పనులపై సమగ్ర కార్యాచరణ, ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, కాలువ గట్టులను పటిష్టం చేయాలని సూచించారు. నీటి నష్టాలను తగ్గిస్తూ కాలువల సామర్థ్యాన్ని పెంచే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రెండో దశలో భాగంగా మల్లమ్మకుంట, జూలకల్, వల్లూరు జలాశయాల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను ప్రాధాన్యతతో చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఈ జలాశయాల ద్వారా సుమారు 2.12 టీఎంసీల స్థూల నీటి నిల్వ సామర్థ్యం ఏర్పడుతుందని తెలిపారు.
Also Read: మాటల్లోనే మైనార్టీ బడ్జెట్.. చేతల్లో శూన్యం.. ప్రభుత్వంపై కవిత ఫైర్!
మరోవైపు తుంగభద్ర జలాలపై తెలంగాణకు ఉన్న న్యాయబద్ధమైన హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన సాంకేతిక, న్యాయ, పరిపాలనా చర్యలన్నింటినీ ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు. తుంగభద్ర బోర్డులో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న అధికారులు మరింత చురుకుగా వ్యవహరించాలని సూచించారు. జలాశయ నిర్వహణ, కాలువల ఆపరేషన్లు, మౌలిక వసతుల సంరక్షణ అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను సమర్థంగా కాపాడాలని ఆదేశించారు.
Also Read: ఏ నేరం చేయకుండానే జైలుకు వెళ్లొచ్చు.. చంచల్గూడ జైలులో చిప్పకూడు తినే ఛాన్స్!