నిను వీడని నీడను నేనే.. అన్నట్టుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను వదలడం లేదు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ పార్టీ ఆందోళన ఉద్రిక్తంగా మారిన నాటి నుంచి అమిత్ షాను టార్గెట్ చేస్తున్నారాయన. విద్యార్థులపై లాఠీ చార్జి చేయడమే కాదు.. టియర్ గ్యాస్ ప్రయోగించారు. రబ్బర్ బుల్లెట్లు వాడి వారిని గాయపరిచారు. దీనిపై రాహుల్ అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు.
పెల్లెట్ గన్ దెబ్బకు తన చూపు కోల్పోయిన విద్యార్థితో కలిసి ఇవాళ ఉదయం నుంచి ఢిల్లీలో ఆందోళన చేశారు రాహుల్. బాధిత విద్యార్థి ఫిర్యాదు చేసినా ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులపై ఒత్తిడి పెంచారు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయక తప్పలేదు పోలీసులకు.
మొన్న పార్లమెంటులో అమిత్ షాను నిలదీసే క్రమంలో చేసిన ఇండి కూటమి పోరాటం ఫలించింది. సభకు హాజరు కాకుండా తప్పించుకునే పరిస్థితి ఏర్పడింది కేంద్ర మంత్రికి. సభకు రావాలని, క్షమాపణ చెప్పాలని, రాజీనామా చేయాలని రాహుల్ చేసిన పోరాటం.. బీజేపీ పెద్దలను ఇబ్బంది పెట్టింది. ఇకపై జంతర్ మంతర్ వద్దే కాదు.. ఢిల్లీలో ఎక్కడ యువత ఆందోళన చేసినా.. విద్యార్థులు ఎక్కడ రోడ్డెక్కినా లాఠీలు ఎత్తాలంటేనే భయపడే పరిస్థితిని క్రియేట్ చేశారు రాహుల్ గాంధీ.
ఆది నుంచి ఆయన జెన్జీలకు మద్దతుగానే ఉంటూ వస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్ననాటి నుంచి తన సంఘీభావం తెలుపుతూ వస్తున్నారు. పార్లమెంటు ముట్టడి ఉద్రిక్తంగా మారిన తరుణంలో వారికి అండగా ఉండి .. కాంగ్రెస్ కూటమితో కలిసి మెరుపు ధర్నా చేసి యువతకు మరింతగా దగ్గరయ్యారు.
ఏ వేదిక మీదెక్కినా ఈ అంశాన్ని వదలడం లేదు రాహుల్. అమిత్ షాను వెంటాడుతూనే ఉన్నారు. ఇప్పటికీ రాజీనామా చేయాలనే డిమాండ్ను సజీవంగానే ఉంచుతున్నారు. అమిత్ షా దీన్ని మరిచిపోదామని అనుకున్నా.. మరవనీయకుండా జంతర్ మంతర్ చేదు అనుభవాలను జ్ఞప్తికి తెస్తూ ఇబ్బంది పెడుతున్నారు.
రాజకీయంగా ఇరుకున పెడుతున్నారు. తాజాగా పెల్లెట్ గన్ బాధితుడి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడమంటే కేంద్రం తన తప్పు ఒప్పుకోవడమే అవుతుంది. రాహుల్ వ్యూహంలో అమిత్ షా, మోడీ ద్వయం చిక్కుకున్నారని ఈ ఉదంతం తెలియజేస్తోంది.