స్పందించాల్సిన సమయం వచ్చింది. అందుకే రెబల్స్పై తనదైన శైలిలో స్పందిస్తున్నారు సీఎం రేవంత్రెడ్డి. ఆయన రాష్ట్రంలో లేనప్పుడు జరిగిన రెబల్ కామెంట్స్పై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో దండయాత్ర చేయించడం తన బల ప్రదర్శనగానే చూడాలి. కొండా సురేఖపై ఏకంగా 15 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు ప్రెస్మీట్ పెట్టి ఆమెను రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. రేవంత్ రెడ్డి డైరక్షన్లోనే ఇది జరిగినట్టుగా భావిస్తున్నాయి రాజకీయ వర్గాలు.
మొన్నటి వరకు సైలెంట్ ఉన్నా.. రేవంత్ ఇక ఇలాంటి నేతలపై తన ప్రతాపం చూపేందుకు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ఓవైపు ప్రధాన ప్రతిపక్షం బలోపేతమవుతూ వస్తున్న తరుణంలో సొంత పార్టీలో ఈ కుంపట్లను ఆర్పకపోతే మరింత నష్టం జరుగుతుందనే భావనలో ఆయన ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే తన వ్యూహంలో భాగంగా ఎవరిపైనా చర్యలు తీసుకోవద్దనే సీఎం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
చర్యలు తీసుకుంటే ఇక ఇదే పనిగా పెట్టుకుని.. మరింత దూకుడుగా ఆరోపణలు, విమర్శలు చేయడానికి ఆస్కారమిచ్చినట్టుగా అవుతుందని అంచనా వేస్తున్నారాయన. అందుకే.. సీఎం రేవంత్తో పెట్టుకుంటే పార్టీలో పుట్టగతులుండవనే సిగ్నల్స్ ఇవ్వడం ద్వారా వారిని కంట్రోల్ పెట్టాలనే ఆలోచన అమలులో పెట్టాలనుకుంటున్నారు. కొండా సుష్మిత ఏకంగా రేవంత్ తమ్ముడిపై తీవ్ర ఆరోపణలు చేయడమే కాదు.. నా జోలికొస్తే ఇక అన్నీ బయటపెడతాననడం వెనుక బలమైన రాజకీయ శక్తుల హస్తమున్నట్టుగా భావిస్తున్నారు.
నేరుగా బెదిరింపులకు దిగడం మూలంగా ఐతే లాభం లేకపోతే.. ఇతర పార్టీలోకి వెళ్లి.. తాము అనుకున్నది సాధించుకోవాలనే వ్యూహాన్ని కొండా ఫ్యామిలీ అమలు చేస్తున్నట్టుగా అనుమానిస్తోంది అధిష్టానం. అందుకే తమంతట తాముగా చర్యలు తీసుకోవద్దని భావనలో ఉన్నారు. కానీ టిట్ ఫర్ టాట్ లాగా కొండా కుటుంబానికి, రెబల్ నేతలకు తన టీమ్తో గట్టిగా వార్నింగులు, కౌంటర్లు, ఆరోపణలు చేయించేలా సిగ్నల్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇవాళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెట్టిన మీటింగులో కొండాను ప్రధానంగా టార్గెట్ చేయడంతో పాటు రెబల్స్ అందరినీ కట్టగట్టి తిట్టిపోశారు.
వీరందరిపై చర్యలు తీసుకోవాలని చెప్పడమే కాదు.. అవసరమైతే ఢిల్లీకి పోయి కేసీ వేణుగోపాల్, ఖర్గేలను కూడా కలుస్తామని చెప్పడం.. దీన్ని అంత ఆషామాషీగా తీసుకోవడం లేదనే హెచ్చరికను వీరికి పంపారు. ఇదిలాగే కొనసాగితే స్వయంగా రేవంత్.. ఈ టీమ్ను ఢిల్లీకి పంపినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. అయితే వీరిని పార్టీలో కొనసాగిస్తూనే సర్కార్ నుంచి మాత్రం సహాయ నిరాకరణే కొనసాగేలా రేవంత్ వ్యూహం రచిస్తున్నారు.
అడపా దడపా ఇలా ఆరోపణలు చేస్తే వెంటనే కౌంటర్ దాడులు కొనసాగుతాయి. లేదా వారంతట వారే ఇతర పార్టీలకు వెళ్లిపోవాలి. ఇదే రేవంత్ మార్క్ దండయాత్రగా కొనసాగనుంది. ప్రతిపక్షాలకు ఈ అంశం అస్త్రంగా మారకుండా పొమ్మనరు.. వారంతట వారు వెళ్లిపోయేలా పొగబెడ్తారన్నమాట!