Harish Rao VS KTR: బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత ఆ పార్టీ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. 25 ఏళ్ల ఉత్సవాల సభ నిర్వహించుకుని, ఆ తర్వాత ఎవరికి వారే యమునాతీరే అనే చందంగా వ్యవహారిస్తున్నారు. వరంగల్ సభ సందర్భంగా నేతల మధ్య సమన్వయలేమి, వర్గపోరు తెరపైకి రావడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఏడాది కాలం పాటు సెలబ్రేషన్స్, వరుస బహిరంగ సభలు అంటూ పార్టీ నేతలు ఊదరగొట్టారు. లక్షల్లో పార్టీ సభ్యత్వాలు అన్నారు ప్రస్తుతం అసలా ఊసే లేకుండా నాయకులు వ్యవహారిస్తున్నారు. వరంగల్ సభ తర్వాత బీఆర్ఎస్ నేతలకు ఏమైంది? పార్టీలో ఆ స్థబ్ధతకు కారణం ఏంటి?
రజతోత్సవ సభ తర్వాత సైలెంట్ అయిన బీఆర్ఎస్ నేతలు
బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత పార్టీ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఇంతకాలం లోలోన నేతల్లో ఉన్న విభేదాలు రచ్చకెక్కుతున్నాయనే చర్చ నడుస్తోంది. పార్టీ 25 ఏళ్ల ఉత్సవాలను ఏడాదిపాటు వైభవంగా జరుపాలని భావించారు.ఉత్సవాలతో పాటు పార్టీ సభ్యత్వ నమోదుపై కూడా భారీ టార్గెట్నే పార్టీ నాయకత్వం పెట్టుకుంది. పార్టీ పెట్టుకున్న లక్ష్యాలు తగ్గట్లుగా నేతలు అడుగులు వేయడంలేదనే చర్చ కార్యకర్తల్లో జరుగుతోంది. పార్టీ బలోపేతం కోసం వరంగల్ సభకు నెల ముందే ఫాంహౌజ్ వీడి బీఆర్ఎస్ భవన్లో రాష్ట్ర కార్యవర్గం సమావేశం నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. కేటీఆర్, హరీష్, కవితలకు కీలక బాధ్యతలు అప్పగించారు. రజతోత్సవ సభ సందర్భంగా గులాబీబాస్ నేతలకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయడంలో వారు అంతగా శ్రద్ధ చూపించలేదన్న వాదన వినిపిస్తోంది.
కేసీఆర్ ఫాం హౌస్కే పరిమితమవ్వడంతో క్యాడర్లో అసంతృప్తి
వరంగల్ సభలో ఇకపై తాను ప్రజల్లోనే ఉంటానని కేసీఆర్ ప్రకటించారు. అయితే ఆయన తిరిగి ఫాం హౌజ్ కే పరిమితం అయ్యారు. దీంతో పార్టీ కేడర్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. మరోవైపు సభ అనంతరం కాలు గాయంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటికే పరిమితమయ్యారు. ఎమ్మెల్సీ కవిత విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సిద్దమయ్యారు. హరీష్ రావు సభ తర్వాత పూర్తిగా సైలెంటయ్యారు. అప్పుడప్పుడు ఎక్స్లో పోస్ట్ లు పెడుతున్న హరీష్ రావు తన జిల్లా, నియోజకవర్గం వరకే పరిమితమయ్యారు.
వరంగల్ సభలో హరీష్రావుకు దక్కని ప్రాధాన్యత
పార్టీ ముఖ్యనేతలందరూ యాక్టివ్గా లేకపోవడంతో మిగిలిన నాయకులు కూడా రెస్ట్ మూడ్లోకి వెళ్లినట్లు కనిపిస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలు యాక్టివ్గా లేకపోవడానికి రీజన్స్ చాలానే ఉన్నయన్న వాదన పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. వరంగల్ సభలో హరీష్ రావుకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఫ్లెక్సీలో , బ్యానర్స్ లో ఎక్కడా హరీష్ ఇమేజ్ లేకుండా చేయడంపై సభకు వచ్చిన కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకున్నారట. ఆ క్రమంలో వరంగల్ సభతో ఏదో జరిగిపోతుంది బ్రహ్మాండం బద్ధలవుతుంది అని ఏదేదో వూహించుకున్న పార్టీ క్యాడర్ ఇంతేనా అంటూ పెదవి విరుస్తున్నారు
హరీష్రావు అసంతృప్తితో ఉన్నారని ప్రచారం
బీఆర్ఎస్ పార్టీ వరంగల్ రజతోత్సవ సభ తర్వాత అంతర్గత సమస్యలతో సతమతమవుతోందనే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ ఫామ్హౌస్కు పరిమితమై, పార్టీ బలోపేతంపై తగిన దృష్టి పెట్టకపోవడం, కేటీఆర్కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల హరీశ్ రావు అసంతృప్తితో ఉన్నారనే చర్చలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. ఈ సభలో హరీశ్ రావుకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, బ్యానర్లలో ఆయన ఫొటోలు లేకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇది పార్టీలో అంతర్గత విభేదాలకు దారితీసిందని, హరీశ్ రావు అసంతృప్తితో ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం ఉధృతమవుతోంది.
Also Read: పాక్ గుండెల్లో వణుకు పుట్టిస్తున్న బలూచ్
బ్యానర్లపై కేసీఆర్తో సమానంగా కేటీఆర్కు ప్రాధాన్యత
వరంగల్ సభలో కేసీఆర్ తన రాజకీయ వారసుడిగా కేటీఆర్ను పరోక్షంగా చాటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. సభా బ్యానర్లలో కేసీఆర్తో పాటు కేటీఆర్ ఫొటోలకు ప్రాధాన్యత ఇచ్చారు. గతంలో ఇలాంటి సందర్భాల్లో బ్యానర్లపై కేసీఆర్ ఫొటో మాత్రమే ఉండేదని…ఈసారి కేటీఆర్కు సమాన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కేటీఆర్ భవిష్యత్ పార్టీ అధ్యక్షుడని సంకేతాలు ఇచ్చారని నేతలు మాట్లాడుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ నాయకులు ఈ విభేదాలను ఖండిస్తున్నా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఊహాగానాలు పార్టీ ఇమేజ్పై ప్రభావం చూపుతున్నాయని నేతలు వాపోతున్నారు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయలేని స్థితికి చేరిన బీఆర్ఎస్
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఎంపీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయలేని స్ధితికి బీఆర్ఎస్ చేరుకుంది. వరంగల్లో జరిగిన రజతోత్సవ సభతో నూతనోత్సాహం నింపుదామనుకున్నా..సభ తర్వాత పరిణామాలు చూస్తుంటే .. స్థానిక ఎన్నికల నాటికి కూడా పార్టీ పరిస్థితి మారేలా లేదనే విమర్శలు సొంత క్యాడర్ నుంచే వినిపిస్తున్నాయి