Sircilla: కలెక్టర్ అంటే జిల్లాకే బాస్. జిల్లాలో సర్వాధికారాలు కలెక్టర్లకే ఉంటాయి. ఒక కలెక్టర్గా ఇచ్చిన ఆదేశాలను..జిల్లాలోని అధికార యంత్రాంగం పాటించాల్సిందే..! జిల్లాలో బాస్గా వ్యవహించే కలెక్టర్లు..సిరిసిల్ల జిల్లాను చూస్తే మాత్రం గజగజవణికిపోతున్నారట. అక్కడికి వెళితే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంటుందని హడలెత్తిపోతున్నారట. సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ పోస్టింగ్ అంటేనే వామ్మో అనే పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. మరి సిరిసిల్లా అంటే కలెక్టర్లు ఎందుకు వణికిపోతున్నారు..? అక్కడ ఐఏఎస్ అధికారులకు ఉన్న ఇబ్బందేమిటి ?
ఓ వైపు వేములవాడ రాజన్న..మరోవైపు చేనేతన్న. శ్రమ..దైవం కలగలిసిన జిల్లా ..సిరిసిల్ల. ఇప్పుడిప్పుడే అన్నిరంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతోంది. నేతన్న లొగిలి…రాజన్న కోవెలకు కలెక్టర్గా చేయడమంటే అదృష్టమనే చెప్పాలి. కానీ కలెక్టర్లు మాత్రం..సిరిసిల్ల పేరు చెబితేనే వణికిపోతున్నారట. సిరిసిల్ల కలెక్టర్గా పోస్టింగ్ అంటేనే జంకుతున్నారట. దీనికి కారణం ఒత్తిళ్లే అనే టాక్ వినిపిస్తోంది.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల జిల్లా కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా…బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. దీంతో ఈ జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నచందంగా మారింది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్కు అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ నుంచి ఒత్తిళ్లు ఓ రేంజ్లో ఉన్నాయనే టాక్ కూడా నడుస్తోంది. ఈ క్రమంలో సిరిసిల్ల కలెక్టర్గా చేయడం కంటే…మారుమూల జిల్లాకు వెళ్లడం బెటర్ అనుకునే పరిస్థితిలో ఉన్నారు ఐఏఎస్లు.
గతంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా పనిచేసిన సందీప్కుమార్ ఝా.. సిరిసిల్ల కలెక్టర్గా పనిచేసే అనే వివాదాల్లో చిక్కుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో గులాబీ నేతల భూకబ్జాలపై కొరడా ఝుళిపించి హీరో అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్తోనూ ప్రోటోకాల్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక పరిహారం విషయంలో ఓ మహిళను ఇబ్బంది పెట్టి వివాదంలో చిక్కుకున్నారు. ఈ విషయంలో సందీప్ కుమార్ ఝాపై..ఏకంగా హైకోర్టు మొట్టికాయలు వేసింది. సాయంత్రం వరకు ఆయన్ను హైకోర్టులో నిలబెట్టి పనిష్మెంట్ విధించారు న్యాయమూర్తి. ఆ తర్వాత ఆయన్ను బదిలీ చేసిన ప్రభుత్వం…స్పెషల్ సెక్రటరీ హరితను సిరిసిల్ల కలెక్టర్గా నియమించింది. సిరిసిల్ల కలెక్టర్గా బాధ్యతలను తీసుకున్న కొద్ది రోజులకే హరిత చైల్డ్ కేర్ లీవ్ పెట్టి మరి వెళ్లిపోయారు. ప్రస్తుతం సెలవులోనే ఉన్నారు. దీంతో హరిత స్థానంలో సిద్దిపేట అడిషనల్ కలెక్టర్గా ఉన్న గరిమా అగర్వాల్ను ఇంచార్జీ కలెక్టర్గా నియమించింది ప్రభుత్వం.
అయితే కలెక్టర్గా వచ్చి చార్జ్ తీసుకున్న కొద్దిరోజులకే హరిత లీవ్లో వెళ్లడం సంచలనంగా మారింది. పేరుకు ఛైల్డ్ కేర్ అంటూ లీవులు తీసుకున్నా…దీని వెనకాల మరో కారణాలు ఉన్నాయని జోరుగా చర్చలు సాగుతున్నాయట. సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా వచ్చిన హరితకు కొన్ని విషయాలు చికాకు కలిగించాయట. వచ్చిన రోజుల వ్యవధిలోనే హైకోర్టు నుంచి పిలుపు రావడం.. ఆమె కోర్టు మెట్లెక్కక తప్పలేదు. ఈ విషయంలో ఆమె బాగా హర్టయ్యారట. అటు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, ఇటు అదును కోసం వేచి చూస్తున్న బీఆర్ఎస్ నేతల వల్ల ఏ పనిచేయాలో అర్దం కాని పరిస్థితి నెలకొందట. అదీగాక స్పెషల్ సెక్రటరీ క్యాడర్లో ఉన్న తనను.. తిరిగి కలెక్టర్గా పంపించడం కూడా ఇబ్బందిగా ఫీలయ్యారనే టాక్ నడుస్తోంది. తనను ట్రాన్స్ఫర్ చేస్తున్న సమయంలోనే సిరిసిల్లకు కాకుండా వేరే జిల్లాకు పంపించాలని హరిత ప్రభుత్వాన్ని కోరిందట. అయతే కొద్దిరోజులు పనిచేయండి.. ఆతర్వాత చూద్దాం అని ఉన్నతాధికారులు ఆమెతో చెప్పినట్టు సమాచారం. అలా అయిష్టంగానే వచ్చిన హరిత..సిరిసిల్లలో పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో..చైల్డ్ కేర్ పేరుతో సెలవుల్లోకి వెళ్లిపోయారని చర్చలు సాగుతున్నాయట.
ప్రస్తుతం ఇంచార్జీ కలెక్టర్గా ఉన్న గరిమా అగర్వాల్కు పూర్తిస్థాయి బాధ్యతలు ఇస్తారనే చర్చలు కూడా జోరందుకున్నాయి. దానికి కారణం లేకపోలేదు… లీవ్లో ఉన్న కలెక్టర్ హరిత… ఈనెల 24న విధుల్లో చేరాల్సి ఉంది. అయితే ఆమె మరోసారి తన సెలవును పొడగించాలని దరఖాస్తు చేసుకున్నారు. దీంతో మరో 20 రోజులు సెలవు పొడగించింది ప్రభుత్వం. దీంతో వచ్చేనెల 12 వరకు ఇంచార్జీ కలెక్టర్ గరిమా అగర్వాల్ సిరిసిల్ల బాధ్యతలు చూడనున్నారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఐఏఎస్ల బదిలీలు జరిగే అవకాశాల్లేవు. దీంతో కొద్దికాలంగా ఎలాంటి వివాదాలు లేకుండా సిరిసిల్ల బాధ్యతలు చూస్తున్న గరిమానే..పూర్తిస్థాయి కలెక్టర్గా నియమించొచ్చని టాక్ నడుస్తోంది. మరి ప్రభుత్వం గరిమాకే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తుందా..? లేక సెలవుల తర్వాత వచ్చిన హరితను కలెక్టర్గా వెళ్లాలని ఆదేశిస్తుందా చూడాలి.
Story By Kishan, Big Tv