Telangana BJP President: తెలంగాణ పార్టీ అధ్యక్ష ఎన్నిక బిజెపిలో కుంపటి రాజేసింది. అధ్యక్ష పదవి రేసులో ప్రజాబలం ఉన్న పలువురు ఫైర్బ్రాండ్లు ఉన్నప్పటికీ జనానికి పెద్దగా పరిచయం లేని మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావును అధిష్టానం అధ్యక్షుడిగా ప్రకటించింది. సంస్థాగత ఎన్నికలకు ఒక రోజు ముందే ఆయన్ని ఏకగ్రీవంగా ప్రకటించింది. దాంతో ఒక్కసారిగా బిబీజేలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేయగా.. అధ్యక్ష పీఠం దక్కకపోవడంతో ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయి. ఆ క్రమంలో ఈటల ఫ్యూచర్ స్టెప్పై కాషాయ శ్రేణుల్లో పెద్ద చర్చే జరుగుతోంది..
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో వీడిన సస్పెన్స్
తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి ఎట్టకేలకు సస్పెన్స్కు తెరపడింది. మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామచందర్ రావుతో పాటు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, కె. లక్ష్మణ్, డీకే అరుణ, రఘునందన్ రావు, రాజాసింగ్ వంటి పలువురు నాయకులు ప్రెసిడెంట్ రేసులో ఫోకస్ అయ్యారు. ఒక దశలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు ఖరారైనట్లు గట్టి ప్రచారం జరిగింది. అయితే పార్టీ అధిష్టానం రామచందర్ రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది.
పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించిన రాజాసింగ్
రామచందర్రావుని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఏకగ్రీవంగా ప్రకటించడంతో పార్టీలో మరోసారి అంతర్గత కుంపడి రాజుకుంది. బీజేపీ సీనియర్ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొంత కాలంగా పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి వచ్చిన తనను అనుచరులను బెదిరించారని అసహనం వ్యక్తం చేశారు.
అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన ఈటల రాజేందర్
పార్టీ అధ్యక్ష పదవి కోసం తనకు ముగ్గురు కౌన్సిల్ మెంబర్స్ మద్దతుగా సంతకం పెట్టారని.. వాళ్లను కూడా బెదిరించారని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు కేవలం నామామాత్రమేనని.. ఎవరిని ప్రెసిడెంట్ చేయాలో ఆల్రెడీ డిసైడ్ చేశారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావొద్దని అనుకునే వారి సంఖ్య పార్టీలో ఎక్కువైందన్నారు. మీకో దండం.. మీ పార్టీకో దండం అంటూ తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. అధ్యక్ష పదవి కోసం ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ పోటీ పడ్డారు. తీరా ఈటలను పక్క బెట్టి రామచందర్రావుకు అధ్యక్షుడిగా ప్రకటించింది బీజేపీ. అధ్యక్ష పదవి దక్కపోవడంపై ఈటల వర్గీయులు ఆసంతృప్తిలో ఉన్నారట. ఈటలకు పార్టీ చీఫ్ బాధ్యతలు ఇవ్వకపోవడం వెనుక ఉన్న కారణాలేంటి అనే చర్చ పార్టీలో నడుస్తోందట.
కరుడుగట్టిన హిందుత్వవాదిగా ముద్ర ఉన్న రాజాసింగ్
ఇప్పటికే కరుడుగట్టిన హిందుత్వవాదిగా ముద్ర ఉన్న రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్ష రేసులో ముందున్న ఈటలకు పదవి దక్కలేదు. బీసీ నినాదంతో తీవ్రంగా ప్రయత్నాలు చేసినా బీజేపీ అధిష్టానం మాత్రం ఈటలను పక్కకు పెట్టేసి రామచందర్రావును అధ్యక్షుడిగా ప్రకటించింది. అధ్యక్ష పదవి దక్కకపోవడంతో ఈటల కొంత అసంతృప్తి గురయ్యారనే టాక్ పార్టీలో నడుస్తోంది. అధ్యక్ష పదవి ఆశించి భంగ పడడడంతో ఈటెల రాజేందర్ వర్గీయులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారట. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు సంస్థాగతంగా ఎదుగుదల ఉండదా..అనే ఈటల వర్గీయుల ప్రశ్నిస్తున్నారు.
గతంలోనూ ఈటలకు మొండి చేయి చూపించిన అధిష్టానం
గతంలోనూ అధ్యక్ష పదవి విషయంలో ఈటల కు మొండి చేయి ఇచ్చింది బీజేపీ. బండి సంజయ్ తర్వాత ఈటలకు అధ్యక్ష పదవి ఇస్తున్నట్లు ప్రచారం చేశారు. తీరా కిషన్ రెడ్డికి ఇచ్చి ఈటలకు మొండిచేయి చూపారు. ఈటల రాజేందర్ తెలంగాణలో బలమైన బీసీ నాయకుడిగా ఉన్నప్పటికీ ఆయనకు అధ్యక్ష పదవి దక్కకపోవడంపై ఆయన వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. పార్టీని బలోపేతం చేయగల సామర్థ్యం ఈటలకు ఉందని ఆయన వర్గీయులు అంటున్నారు. ఈటలకు పదవి దక్కపోవడం వెనక ఉన్న రీజన్స్ ఏంటనే చర్చ అటు ఈటల వర్గీయుల్లోను అటు పార్టీలోను నడుస్తోంది. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఈటలకు పదవి దక్కపోవడానికి కారణమై ఉంటానేది బీజేపీ నేతల నుంచి వస్తున్న సంకేతాలు. కాళేశ్వరం అంశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నట్లు ఈటల పార్టీ స్టాండ్కు భిన్నంగా మాట్లాడటం మైనస్ అయిందంటున్నారు.
పాత, కొత్త నేతల పంచాయితీ ఈటలను పక్కన పెట్టారని టాక్
మరోవైపు ఇప్పటికే పార్టీలో కొత్త, పాత నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఉన్న నేపథ్యంలో ఈటలను పక్కన పెట్టిఉన్నట్లు చర్చ నడుస్తోంది. నేతల మధ్య పంచాయితీలు తలెత్తకుండా ఉండేందుకే మధ్య మార్గంగా రామచంద్రరావుకు అధ్యక్ష పదవి ఇచ్చారా..అనే సంకేతాలు పార్టీ నేతలు నుంచి వస్తున్న సంకేతాలట. కొత్త వారికి అద్యక్ష పదవి వస్తే సంస్థాగతంగా సమస్య వస్తుందనే ఈటలకు ఇవ్వలేదని టాక్ పార్టీలో వినిపిస్తోంది. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారి కంటే… పార్టీని నమ్ముకుని ఉన్న వారికే పదవులు ఇవ్వాలనేది పార్టీ నిర్ణయంగా చెబుతున్నారు.
కొత్త, పాత నేతల పంచాయితీ పీక్ స్టేజ్కి చేరే అవకాశం
తాజా పరిణామాలతో అధ్యక్ష ఎన్నిక తర్వాత పార్టీలో కొత్త పాత నేతల పంచాయితీ పీక్ స్టేజికి చేరే అవకాశం ఉందనే చర్చ పార్టీలో నడుస్తోందట. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈటల రాజేందర్ ఢిల్లీకి ఫిర్యాదులు చేసిన వ్యవహారం ఇప్పుడు ప్రభావం చూపినట్లు చర్చ జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోను ఈటల లెవనెత్తిన అంశాలను బండి సంజయ్ వ్యతిరేకించిన పరిస్ధితి. దీంతో పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తకుండా ఉండేదుకు పార్టీ ఈటల విషయంలో ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందనే చర్చ నడుస్తోందట. ఈటల బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుడు కావడం… ఆర్ఎస్ఎస్తో సన్నిహిత అనుబంధం లేకపోవడం కూడా కొంత మైనస్ అయిందంటున్నారు.
సంఘ్ పరివార్తో అనుబంధం ఉన్న రామచంద్రరావు
ఇతర పార్టీలో నుంచి వచ్చిన నేతలకు బిజెపిలో సంస్థాగతంగా చోటు ఉండదు. వాళ్లు అట్లాంటి పదవులకు అనర్హులు అనేది ఇవాళ జరిగిన అధ్యక్ష ఎన్నిక స్పష్టం చేసిందనే టాక్ నడుస్తోంది. సంఘ్ పరి వార్ తో సంబంధం ఉన్న పాత నేత వైపుకే అధిష్టానం మొగ్గు చూపడం ఆ పార్టీలో చర్చనీయాoశంగా మారింది. అధ్యక్షుడు అంశంలో అధిష్టాన నిర్ణయంతో ఇతర పార్టీల నుంచి వచ్చిన కొత్త నేతలంతా సందిగ్ధంలో పడ్డట్టుగా తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నిక జరిగిన తీరుపై ఈటల వర్గాలు పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో బీసీ సామాజిక వర్గాలతో కలిసి, బీసీ వేదిక ఏర్పాటు చేసే ఆలోచనలో ఈటల ఉన్నట్టు చెప్తున్నారు,
రాజాసింగ్ పునరాలోచన చేయాలంటున్న రాకేష్ రెడ్డి
అయితే మరో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్రెడ్డి మాత్రం పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి రామచంద్రరావు వంటి సీనియర్ నేతల అవసరమంటున్న ఆయన.. రాజీనామా విషయంలో రాజాసింగ్ పునరాలోచన చేయాలని కోరారు. రాజాసింగ్ సీనియర్ నాయకుడని..పార్టీ విమర్శలు చేయడం సహజమన్నారు. అధిష్టానం అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తుందని రాకేష్రెడ్డి పేర్కొన్నారు. బీసీ వ్యక్తిని అధ్యక్షుడ్ని చేస్తామని పార్టీ చెప్పలేదన్నారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని మాత్రమే పార్టీ చెప్పిందని రాకేష్రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
Also Read: బాబు కాపాడు.. నెల్లూరు తెలుగు తమ్ముళ్ల రిక్వెస్ట్
మొత్తానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమితులవ్వగానే రామచంద్రరావుకు రాజాసింగ్, ఈటల రాజేందర్ల రూపంలో పెద్ద సవాళ్లే ఎదురయ్యాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర నేతలందరినీ కలుపుకుని వెళ్లడంలో బీజేపీలో సుదీర్ఘ అనుభవం ఉన్న రామచంద్రరావు ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.