Mekedatu Project: మేకెదాటు ప్రాజెక్ట్.. ఈ ప్రాజెక్ట్ను ఎలాగైనా నిర్మిస్తామంటోంది కర్ణాటక ప్రభుత్వం. ఎలాగైనా అడ్డుకొని తీరుతామంటోంది తమిళనాడు ప్రభుత్వం. ఇప్పుడీ ఈ వివాదం మరింత రాజుకుంది. ఎందుకంటే మేకెదాటు ప్రాజెక్ట్పై తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేశారు సీఎం విజయ్. మేకెదాటు డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ విజయ్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కర్ణాటక ప్రతిపాదిస్తున్న ఈ ప్రాజెక్ట్ కావేరి నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ తుది అవార్డుతో పాటు.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పూర్తిగా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. పర్యావరణ, సాంకేతిక అనుమతులు సహా ప్రాజెక్టుకు సంబంధించిన ఎలాంటి అనుమతులూ ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ తీర్మానానికి కాంగ్రెస్, వీసీకే, ఇతర పార్టీలు మద్దతు తెలిపాయి.
నిజానికి కర్ణాటక ప్రభుత్వం కావేరీ నదిపై మేకెదాటు వద్ద డ్యామ్ నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే డ్యామ్ నిర్మాణంతో కావేరి డెల్టా రైతులకు తీవ్రనష్టం కలుగుతుందనేది తమిళనాడు ప్రభుత్వం ఆరోపణ. గత నెలలో విజయ్ ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు కూడా ఈ అంశంపై చర్చించారు. అనుమతులు ఇవ్వొద్దని కోరారు. కానీ ఈ ప్రాజెక్ట్పై రెండు రాష్ట్రాల వాదనలు భిన్నంగా ఉన్నాయి. ఇది కేవలం తాగునీరు, విద్యుత్ అవసరాల కోసమే అని కర్ణాటక అంటోంది. బెంగళూరు, దాని చుట్టుపక్కల జిల్లాలకు తాగునీరు అందించడంతో పాటు.. ఈ డ్యామ్ ద్వారా 400 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తే దిగువన ఉన్న తమ రాష్ట్ర రైతులకు నీటి కొరత తప్పదనేది తమిళనాడు వాదన. అంతేకాదు.. తమ అనుమతి లేకుండా కర్ణాటక ఏకపక్షంగా నిర్మాణాలు చేపట్టవద్దని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
ఇప్పటికే ఈ పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. అయితే ఈ తీర్మానం ప్రవేశపెట్టడం వెనక రాజకీయ కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో తమకు దక్కిన ఏకైక స్థానాన్ని కాంగ్రెస్కు కేటాయించింది TVK. ఈ విషయాన్ని తమకు అస్త్రంగా మార్చుకున్నాయి విపక్షాలు. కర్ణాటకలో డ్యామ్ కడుతామంటున్న కాంగ్రెస్తో విజయ్ చేతులు కలిపారంటూ ఆరోపణలు మొదలయ్యాయి. సరిగ్గా ఇదే సమయంలో తీర్మానం ప్రవేశపెట్టి తన స్టాండ్ ఏంటో తెలిపారు. ఓ వైపు సెంటిమెంట్ను రగిలిస్తూనే.. మరోవైపు విమర్శలకు సమాధానాలు చెప్పారనే చర్చ ప్రస్తుతం తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది.
Also read: Black Rain: ఆకాశం నుంచి కురుస్తున్న మరణ శాసనం.. బ్లాక్ రెయిన్ దెబ్బకు మాస్కో వదిలి పారిపోతున్న జనం!