విజయసాయి రెడ్డి దారెటో.. ఎవరు విడిచన బాణమో..? అది ఎవరికి గురి పెట్టబడిందో మెల్లగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ ప్రజలు. ఏపీ రాజకీయాల్లో ఆటలో అరటి పండులా విజయసాయిరెడ్డి చేస్తున్న రాజకీయ కామెంట్లు, ఆరోపణలు మాత్రం ఏపీ పాలిటిక్స్ను హీట్ ను పెంచుతున్నాయి.
పనిలో పనిగా జగన్ను టార్గెట్ చేసి మత రాజకీయాలను బయటకు తోడుతున్న వైనం కూడా అక్కడ కూటమి సర్కార్కు కలిసి వస్తోంది. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు.. ఇప్పుడిప్పుడే ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు తంటాలు పడుతున్న వైసీపీకి విజయసాయిరెడ్డి ఓ మింగుడు పడని వ్యవహారంలా మాత్రం తయారయ్యాడని తెలిసిపోయింది.
అన్ని ఏండ్లు అతనితో అంటకాగిన నేత మాటలకు ప్రజల్లో ఎంత మేర విశ్వసనీయత ఉంటుందనేది పక్కన పెడితే.. సూటిగా, ఉన్నదున్నట్టుగా మాట్లాడుతున్న అతని నైజం మాత్రం కొంచెం లేటైనా అవి ఘాటుగానే వైసీపీని గుచ్చుకునేలా ఉన్నాయి. వాస్తవానికి, విజయసాయిరెడ్డి బీజేపీలో చేరాలి. కానీ అక్కడ రెడ్ సిగ్నల్ రావడంతో కొత్త పార్టీ పెట్టాల్సిన అగత్యం ఏర్పడింది.
ఆ పార్టీ పెట్టినా.. అది బీజేపీకి అనుబంధ సంస్థగానే ఉండనుందనే విషయం ఆయనే చెప్పకనే చెబతున్నాడు. ఎలాంటి రాజకీయ లౌక్యం లేకుండా, కనీసం వ్యూహకర్తగా కూడా గుర్తింపు లేని విజయ సాయిరెడ్డి పెట్టబోయే పార్టీ పట్ల ఎక్కడా పెద్ద ఆసక్తి కనిపించడం లేదు. ఆ పార్టీలో చేరికలు కూడా ఎలా ఉండబోతాయే ఇప్పుడే ఓ క్లారిటీ వచ్చేసింది అందరికీ.
అయితే అది బీజేపీకి అనుబంధంగా ఉండటంతో పాటు పరోక్షంగా కూటమి ప్రభుత్వానికి మేలు చేసేదిగా… సహయకారిగా ఉండనుందనే విషయమూ ఆయన మాటలే చెప్పకనే చెప్పాయి. జగన్, విజయసాయిరెడ్డిల మధ్య మిత్రబేధం.. కూటమి సర్కార్కు కలిసి వస్తోంది. ఇప్పటికే జనసేన, టీడీపీ మధ్య అధికారం కోసం పోరు తారాస్థాయికి చేరుతోంది. ఆధిపత్య పోరు కూడా మొదలైనట్టు కనిపిస్తోంది. దీనికి తోడు సహజంగానే ఉండే ప్రభుత్వ వ్యతిరేకత.. ఇవన్నీ కలిసి వైసీపీకి ప్రాణం పోస్తున్నాయి.
ఈ సమయంలో సరిగ్గా కరెక్టు టైమ్కు ఎంట్రీ ఇచ్చాడు విజయ్ సాయి రెడ్డి. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సమీకరణను అనుసరించి.. ఇది బాబుకు అనుకూలించే రాజకీయ సమీకరణగా మారింది. ఈ మధ్య బాబు నోటి వెంట కూడా మత రాజకీయాలు అలవోకగా బయటకు వస్తున్నాయి. జగన్ను అతని మతానికి ముడిపెట్టి టార్గెట్ చేయడం.. హిందూత్వ భావజాలాన్నిఅందిపుచ్చుకునే పనిలో భాగంగా బీజేపీ స్టాండ్ను నేరుగా ప్రజల్లోకి ఎక్కించే విషయంలో బాబు బాగా సక్సెసవుతున్నాడనే చెప్పాలి.
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారాన్ని బాగా ప్రొజెక్టు చేయగలిగారు ఏపీ సీఎం. ఇప్పుడు తాజాగా విజయసాయిరెడ్డి.. లవ్ జీహాదీ అంశాన్ని లేవనెత్తి.. జగన్ పార్టీకి దీన్నిరుద్దడం కూడా కూటమి సర్కార్కు బాగా కలిసి వస్తోంది. మొత్తానికి అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు ఏపీలోని కూటమి సర్కార్ రాజకీయ గొడుకు కింద సేదతీరే ఓ పార్టీగా విజయసాయిరెడ్డి కొత్త పార్టీ అవతారమెత్తనుందనే విషయం క్లారిటీకి వస్తోంది ఏపీ ప్రజలకు.