ఆ నోటికి మొక్కలిరా నాయనా! తరుచూ ఈ కామెంట్ కేసీఆర్ నోటి వెంటో, కేటీఆర్ నోటి వెంటో వస్తున్నది. ఎవరినుద్దేశించో మీకు అర్థమయ్యే ఉంటుంది. అదే సీఎం రేవంత్రెడ్డి మాట్లాడే తీరును వారు ఈ విధమైన తమ వ్యాఖ్యల ద్వారా ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మాటలు మాకు రావు.. అనే అర్థం వస్తుంది.. వాటికి మేం భయపడి చస్తున్నామనే పరోక్షసందేశం కూడా ఇస్తున్నట్టుగా ఉంటాయవి.
సేమ్, ఇప్పుడు ఇవే మాటలు ప్రభుత్వ పెద్దల నుంచీ వస్తున్నాయి. ఎవరి గురించో తెలుసా? అదే కొండా సురేఖ గురించి. అవును.. ఆమె అంటే ప్రభుత్వ పెద్దలు గజ్జుమంటున్నారట. ఆమె అంటే అంత భయమట వారికి. మచ్చుకు ఓ ఉదాహరణ చెప్పుకుందాం. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి వద్దకు ఓ పంచాయితీ వచ్చిందట. అది సురేఖ ఇలాఖకు చెందిన ఓ భూ పంచాయితీ.
కొనుక్కున్న భూమిని అమ్మిన వ్యక్తులే మళ్లీ కబ్జా చేసుకుని దబాయిస్తున్నారని, అక్కడ పోలీసు అధికారికి ఓ మాట చెబితే సరిపోతుందనే రిక్వెస్టుతో వచ్చారక్కిడికి బాధితులు. అది సురేఖ ఇలాఖ అని తెలియగానే సదరు రాజ్యసభ సభ్యులు గజ్జుమన్నారట. వామ్మో.. ఆమె జోలికి మేం పోము.. ఒకవేళ వెళ్లినా.. వెంటనే వచ్చి ఇక్కడ మా ఇంటి దగ్గర కూర్చుంటుంది ఆమె.. అని అన్నారట ఆయన.
అంతే కాదు. ఎవరి రిఫరెన్సుతో వీరు వచ్చారో.. ఆ పెద్దాయనకే ఫోన్ చేసి సారీ, కోదండన్నా.. నేను ఈ పని చేయలేను.. ! అని కూడా చెప్పేశాడట. దీంతో నిరాశతో వెనుదిరిగారట ఆ బాధితులు. నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా? అనే సామెతలా.. కొండా సురేఖ ఇలాఖలోనే వేలు పెట్టనీయదు.. మరి అలాంటిది ఏకంగా మంత్రి పదవికే ఎసరు పెడితే.. బర్తరఫ్ చేస్తే.. పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ ఆలోచనలే పార్టీ పెద్దలను నిమ్మళంగా ఉండనీయడం లేదట.
ఇక తెల్లారితే చాలు ఇదే పెంట ఉంటుంది. ఇప్పటికే సగం పుణ్యకాలం గడిచిపోయింది. జనాలను అట్రాక్ట్ చేయడానికి పెద్దగా చేసిందేమీ లేదు. చేయాల్సిందంతా ఇప్పుడే ఉంది. మరి ఇలాంటి సమయంలో తేనెతుట్టె లాంటి కొండాతో పెట్టుకోవడం అవసరమా? పార్టీ పరువును రచ్చ కెక్కించేందుకు వారు ఏ మాత్రం వెనుకాడరు.. ఆమె నోటి వెంట వచ్చే ఆ మాటలకు బదులివ్వడం ఎవరి తరం కాదు.. అనే చర్చ కూడా నడుస్తుందంట..!
అందుకే దీన్ని కొద్ది రోజులు కోల్ట్ స్టోరేజీలో పెడితే.. అంతా మరిచిపోతారు. ఆ తరువాత చూసుకుందాం..అనే మధ్యేమార్గమైన పరిష్కారం అధిష్టానం మదిలో ఉందట. కొండా సురేఖ అంశాన్ని ఇటు బీజేపీ, అటు బీఆరెస్ రెండూ ఆసక్తిగా గమనిస్తున్నాయి. తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు ద్వారాలు తెరిచి ఉంచుకున్నారు.
రెండు బీసీ కార్డులు, మహిళా నేతగా ఆమెకున్న బలాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడంతో పాటు.. ఇక రోజూ ప్రభుత్వంపై తిట్ల దండకాన్ని చదివే ఓ కాళీగా ఆమెను వినియోగించుకునేందుకు ప్రణాళికలు రెడీగా ఉన్నాయట.