సీఎం రేవంత్రెడ్డి అమెరికా పర్యటన రద్దు నేపథ్యం… తెలంగాణకు కేంద్రానికి మధ్య గ్యాప్ను మరింత పెంచినట్టయ్యింది. చాలా విషయాల్లో కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపుతున్నా.. దీన్ని బహిరంగ వేదికల మీద లేవనెత్తుతూనే .. పూర్తిగా గ్యాప్ పెంచుకోవద్దనే ఉద్దేశ్యంతో సర్కార్ ముందుకు సాగుతోంది.
గతంలో కేసీఆర్ తొలినాళ్లలో పూర్తిగా కేంద్రంతో అంటకాగినట్టే ముందుకు సాగారు. ఆ తరువాత వీరిద్దరి బంధానికి గండిపడింది. దీంతో అసలు మోడీ ముఖం చూడటానికే ఇష్టపడలేదు కేసీఆర్. దీని వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందనే చెప్పాలి. ఊరు మీద అలిగి చూరు కింద పన్నట్టుగా కేసీఆర్ మొండి వైఖరితో తెలంగాణకు రావాల్సిన నిధులు రాలేదు.
అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రేవంత్ రెడ్డి ఈ విధమైన వ్యవహార శైలితో పోవద్దనే నిర్ణయానికి వచ్చారు. అందుకే విమర్శించే సమయంలో విమర్శిస్తూనే.. ఢిల్లీ వెళ్లి పెద్దలందరినీ కలవడం, విజ్ఞప్తులు చేయడం, తెలంగాణ పెండింగ్ పనులపై కదలిక వచ్చేలా ముందుకు సాగడం మంచి ఫలితాలనే ఇచ్చాయని చెప్పాలి.
అయితే రేవంత్ వైఖరి పట్ల మోడీ కూడా అంత వ్యతిరేకతతో ఉన్నట్టుగా కనిపించలేదు. సీఎంకు ఢిల్లీలో మంచి స్వాగతమే లభిస్తున్నది. మెట్రో రైల్ పెండింగ్ అంశంతో పాటు.. విమానాశ్రయాల క్లియరెన్స్.. తదితర కేంద్రం వద్ద ఉన్న పెండింగ్ ప్రాజెక్టులపై కదలిక వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మొన్న మిగిలిన ధాన్యాన్ని కూడా ఈ-వేలం ద్వారా అమ్మాలని డిసైడ్ అయ్యింది సర్కార్.
గతంలో ఈ మిగిలిపోయిన దాదాపు 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బీజేపీ ఆఫీసు ముందు పారబోస్తామని, కేంద్రం దీన్ని కొనాల్సిందేనని కిషన్రెడ్డిపై ఒత్తిడి పెంచారు. ఆ తరువాత తన స్టాండ్ మార్చుకున్నారు సీఎం. అయితే తాజాగా రేవంత్ అమెరికా పర్యటన రద్దు నేపథ్యంలో దీన్ని తీవ్ర అవమానంగా భావిస్తున్నారు సీఎం.
చిన్న చిన్న కారణాలను బూతద్దంలో పెట్టి చూపి.. పర్యటన నిరాకరణ ద్వారా తెలంగాణ అభివృద్దిని అడ్డుకుని, గుజరాత్కు లాభం జరిగేలా చూస్తున్నారనే వాదన సర్కార్ నుంచి వస్తోంది. ఒకవేళ కేంద్రం ఆరోపిస్తున్నట్టుగా.. ఏవైనా టెక్నికల్ ఇష్యూలు ఉన్నా.. సమాచారం సరిగ్గా క్రోడీకరించకపోయినా.. దాన్ని ముందుగా తెలియజేసి.. దీని కారణంగా పర్యటన రద్దయ్యే అవకాశం ఉందని ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే ఈ వివాదమే ఉండేది కాదు.
కానీ దీన్ని పక్కాగా బీజేపీ తన రాజకీయ మైలేజీకి వాడుకున్నదనేది సుస్పష్టం. తను కలుపుకుపోదామనుకుంటుంటే.. మోడీ మాత్రం నోటితో నవ్వుతు నొసటితో వెక్కించినట్టుగా.. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం కీలకమైన సీఎం పర్యటనపైనే ప్రతాపం చూపడం ఈ రెండు పార్టీల మధ్య మళ్లీ ఫైట్ వాతావారణాన్ని క్రియేట్ చేసింది.