Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి ఊహించని షాక్ తగిలింది. కన్య్సూమర్ కోర్టు నుంచి ఆ కంపెనీకి గట్టి ఝలక్ తగిలింది. సర్వీసు చేయకుండా కస్టమర్ను ఇబ్బంది పెట్టినందుకు ఏకంగా రూ. 45000 జరిమానా విధించింది. కస్టమర్ల ఫిర్యాదులను తేలికగా తీసుకుంటే ఇలాంటి షాకింగ్ ఘటనలు తప్పవని ఈ తీర్పు ద్వారా వెల్లడైంది. అసలేం జరిగింది?
ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి షాకిచ్చిన కన్య్సూమర్ కోర్టు
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో నంబర్ వన్లో ఉంది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ. ఆ కంపెనీ వాహనాలు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎగబడుతుంటారు. అనంతపురానికి చెందిన మురళీ మోహన్ వృత్తి రీత్యా న్యాయవాది. నాలుగేళ్ల కిందట అంటే 2022 అక్టోబర్లో ఓలా ఎస్ 1 ప్రొ వాహనాన్ని కొనుగోలు చేశాడు. వాహనానికి మూడేళ్లు వారంటీ ఉంది.
వాహనం కొనుగోలు చేసిన కొద్ది రోజులకు డిక్కీ లాక్ పాడైంది. న్యాయవాద వృత్తిలో ఉండే మురళీకి ప్రతీరోజూ ఫైళ్లు, డాక్యుమెంట్ల కోర్టుకు తీసుకెళ్లడం చాలా అవసరం. డిక్కీ లాక్ లేకపోవడంతో ఫైళ్లు పోతాయానే భయంతో అనుక్షణం ఆయన్ని వెంటాడింది. చివరకు మానసిక ఆందోళనకు గురయ్యాడు. సర్వీస్ సెంటర్కు వెళ్తే తొలుత బండి రీబూట్ చేయాలన్నారు. ఆ తర్వాత స్పేర్ పార్ట్స్ లేవంటూ రెండు నెలలు కాలయాపన చేశారు.
రూ. 45 వేలు జరిమానా.. ఆలస్యం చేస్తే 7 శాతం వడ్డీ
చివరకు విసిగిపోయిన కస్టమర్, కంపెనీకి ఈ- మెయిల్స్ పంపాడు. రిఫరెన్స్ నెంబర్తో రిప్లై ఇచ్చినా ఓలా కంపెనీ పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఫలితం లేదని భావించిన సదరు లాయర్.. గతేడాది అక్టోబర్లో ఆ కంపెనీకి లీగల్ నోటీస్ పంపాడు. కస్టమర్ ఇంత చేస్తున్నా కనీసం ఓలా కంపెనీలో ఎలాంటి చలనం లేదు.
చివరకు నవంబర్లో వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు మురళీమోహన్. కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ ఓ లాయర్ను నియమించింది. ఆ తర్వాత జరిగిన ఏ ఒక్క విచారణకు హాజరు కాలేదు. చట్టబద్ధంగా ఇవ్వాల్సిన వివరణ ఇవ్వలేదు. అనంతపురం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ప్రెసిడెంట్ శ్రీమతి శ్రీలత-గోపీనాథ్లతో కూడిన బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది.
ALSO READ: ఖాతాదారులకు భారీ షాక్.. జులైలో ఏకంగా 12 రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పుడెప్పుడంటే?
బాధితుడి తరపున దాఖలైన 12 కీలక డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత జూన్ 9న తీర్పునిచ్చింది. సేవల్లో లోపం కారణంగా రూ. 20 వేలు, కస్టమర్ మానసిక వేదనకు మరో రూ. 20 వేలు, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ. 5 వేలు మొత్తంగా రూ. 45,000 చెల్లించాలని ఆదేశించింది. 45 రోజుల్లోగా స్కూటర్ను ఉచితంగా బాగు చేయాలని అందులో ప్రస్తావించింది.
గడువులోగా పని పూర్తి చేయకపోతే కొత్త ట్రంక్ రీప్లేస్, 7 శాతం వడ్డీతో ఈ జరిమానా చెల్లించాల్సి హెచ్చరించింది కోర్టు. కార్పొరేట్ కంపెనీల ధోరణికి ఈ తీర్పు ఒక హెచ్చరిక. వాహనాలు అమ్మడమే కాదు, కొన్న తర్వాత ఇచ్చే సర్వీస్ అంతే ముఖ్యమని ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది.