DMart Billing Frauds: ఇతర స్టోర్లతో పోల్చితే డిమార్ట్ లో తక్కువ ధరలకే క్వాలిటీ వస్తువులు లభిస్తాయి. తరచుగా డిమార్ట్ భారీ డిస్కౌంట్లు అందిస్తుంది. ఇతర స్టోర్లతో పోల్చితే పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా డిమార్ట్ కు వెళ్తుంటారు. తక్కువ ధరలో నాణ్యమైన వస్తువులను తీసుకెళ్తుంటారు. రోజువారీ కిరాణా సామాన్ల నుంచి మొదలుకొని, గృహోపకరణాలు, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, దుస్తులు సహా ఇతర వస్తువులను కొని తీసుకెళ్తుంటారు. అయితే, డిమార్ట్ లో చాలా మంది కస్టమర్లు దొంగచాటుగా చాక్లెట్లు, బిస్కెట్లు, కూల్ డ్రింక్స్ దొంగతనంగా తింటారు. కొంత మంది లోదుస్తులను కూడా దొంగతనంగా తీసుకెళ్తుంటారు.
డిమార్ట్ లో బిల్లింగ్ మోసాలు
డి-మార్ట్ లో దొంగతనాలు మాత్రమే కాదు. బిల్లింగ్ మోసాలకు సంబంధించి పలు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో డిమార్ట్ స్టోర్ల దగ్గర కస్టమర్లు గొడవ చేసిన సందర్భాలు ఉన్నాయి. డిమార్ట్ లో తక్కువ ధరలకు వస్తువులు లభిస్తున్నప్పటికీ బిల్లింగ్ దగ్గర అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డిమార్ట్ లో వస్తువులు కొన్న తర్వాత బిల్లును సరిగ్గా చూసుకోకపోతే పెద్ద మొత్తంలో మోసపోయే అవకాశం ఉందని పలువురు సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారు. కొంత మంది డిస్కౌంట్లు ఇస్తూనే, మరోవైపు కస్టమర్ల నుంచి లాగేస్తున్నారని ఆరోపించిన సందర్భాలున్నాయి. డిమార్ట్ బిల్లింగ్ మోసాలకు సంబంధించి పలు స్టోర్లలో వివాదాలు జరగడం ఇందుకు బలాన్నిచేకూర్చుతుంది.
పలు స్టోర్లలో బిల్లింగ్ మోసాలకు సంబంధించి వివాదాలు
హైదరాబాద్, కరీంనగర్ సహా పలు ప్రాంతాల్లోని డిమార్ట్ స్టోర్లలు బిల్లింగ్ లో పొరపాట్లు జరిగిన సందర్భాలున్నాయి. కొంత కాలం క్రితం కరీంనగర్ లోని స్టోర్ లో బిల్లింగ్ వ్యవహారానికి సంబంధించి పెద్ద రచ్చ జరిగింది. ఏకంగా జిల్లా కలెక్టర్ సైతం ఈ వివాదంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఏకంగా తూనికలు, కొలతల అధికారులకు తనిఖీలు చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఒక వస్తువు కొనుగోలు చేస్తే.. దానికి రెండు, మూడుసార్లు స్కాన్ చేయడం వల్ల.. ఒక వస్తువుపై రెండు, మూడు సార్లు బిల్లులు చెల్లించాల్సి వచ్చిందని కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా వినియోగదారులు ఇంటికి వెళ్లిన తర్వాత బిల్లును సరిగా చెక్ చేసుకోరని, డిమార్ట్ సిబ్బంది పొరపాట్లు చేసినా పట్టించుకోవడం లేదనే వాదనలు ఉన్నాయి. కరీంనగర్ మాత్రమే కాదు, మౌలాలి హౌసింగ్ బోర్డ్ లో ఒక వినియోగదారు డిమార్ట్ లో జరిగిన బిల్లింగ్ మోసం జరిగినట్లు ఫిర్యాదు చేశాడు. గోల్నాక డి మార్ట్ లోనూ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణులు వచ్చాయి. అటు ఇండోర్ లోని రాజేంద్ర నగర్ డి మార్ట్ లో ఆన్ లైన్ చెల్లింపు విజయవంతమైనప్పటికీ, సిబ్బంది చెల్లింపు విఫలమైందని చెప్పి నగదు చెల్లింపు చేయమని కోరినట్లు ఓ వినియోగదారుడు ఆరోపించారు.
వెంటనే బిల్ చెక్ చేసుకోవాలంటున్న అధికారులు
సాధారణంగా కస్టమర్లు స్టోర్ నుంచి వెళ్లిపోయిన తర్వాత బిల్లును మరోసారి చెక్ చేసుకునే అవకాశం తక్కువగా ఉంటుందని తూనికలు, కొలతల అధికారులు చెప్తున్నారు. అందుకే, వినియోగదారులు విధిగా తమ వస్తువులు మరోసారి చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఏమైనా పొరపాట్లు జరిగితే, వెంటనే సరిచేసుకునే అవకాశం ఉందంటున్నారు.
Read Also: డి-మార్ట్ లో అత్యంత చౌకగా లభించే వస్తువులేంటీ? ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తారు?