EPS Pension : ఈపీఎస్ పెన్షన్ దారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వాళ్ల ఇబ్బందులు, డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని.. ఇకపై దేశంలోని ఏ ప్రాంతంలోనైనా, ఏ బ్యాంకు నుంచైనా సులువుగా పింఛన్ ను పొందేందుకు వీలు కల్పించింది. కొత్త ఏడాది ప్రారంభం నుంచి ఆ నిర్ణయాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. చాన్నాళ్లుగా పింఛన్ దారులు డిమాండ్ చేస్తుండగా.. తాజాగా కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
దేశంలోని దాదాపు 78 లక్షల మందికి ప్రయోజనం చేకూరే తాజా నిర్ణయంతో పింఛనుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నిర్దేశించిన కొన్ని బ్యాంకుల్లోనే పింఛన్ తీసుకునేందుకు వీలుండగా.. తాజాగా ఎక్కడినుంచైనా పింఛను డబ్బుల్ని తీసుకునే విధానాన్ని అమలు చేసేందుకు సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ తీసుకొచ్చేందుకు ఈపీఎఫ్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్నని కేంద్ర కార్మిక శాఖ మంత్రి, ఈపీఎఫ్ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ మన్ సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ ఏడాది మొదటి తేదీ నుంచే ఈ విధానం అందుబాటులోకి వచ్చింది.
చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నట్లుగా పింఛనుదారులకు మరింత సులువైన, వేగవంతమైన సేవలు అందించేందుకు కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా.. ఈపీఎఫ్ఓ వ్యవస్థను ప్రస్తుత అవసరాల మేరకు ఆధునికరించేందుకు సిద్దమైంది. అందులో భాగంగానే.. ‘సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టమ్’ను తీసుకు వచ్చింది. ఈ నిర్ణయం ఈపీఎస్ చరిత్రలోనే కీలక మైలురాయిగా కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుత పెన్షన్ పంపిణీ వ్యవస్థలో సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ – సీపీపీఎస్ సమూల మార్పులకు శ్రీకారం చుట్టనుందని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ఈపీఎఫ్ఓ జోనల్/ ప్రాంతీయ కార్యాలయాలు 3, 4 బ్యాంకులతో మాత్రమే ఒప్పందాలు చేసుకుని ఉన్నాయి. ఈ కారణంగాా.. పెన్షన్ ప్రారంభంలో పింఛనుదారులు సర్టిఫికేట్లు కోసం సంబంధిత బ్యాంకుల్ని వెతుక్కుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. రిటైర్డ్ అయ్యి.. పట్టణాలు, నగరాలకు దూరంగా ఉన్న వారికి, సొంతూళ్లకు వెళ్లిన వారికి ఇలా రావడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. పైగా.. బ్యాంకు ఖాతాల్లో పడిన సొమ్ముల్ని తీసుకునేందుకు కానీ, వారు వేరే ప్రాంతాలకు నివాసాన్ని మార్చినప్పుడు కానీ.. పెంఛన్ ను ఆయా ప్రాంతాలకు బదిలీ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేంది. కానీ.. ప్రస్తుతం.. ఎక్కడైనా, ఏ బ్యాంకు నుంచైనా పింఛన్ ను తీసుకోవచ్చనడంతో.. వారికి దగ్గర్లోని బ్యాంకుల్లో పింఛన్ సొమ్ములు పడేలా అనుసంధానించుకోవచ్చు. వారి నివాసాలు మార్చుకున్నప్పుడు సైతం సులువుగా.. ‘పెంఛన్ పేమెంట్ బదిలీ’ అకౌంట్లను మార్చుకోవచ్చని కేంద్ర మంత్రి తెలిపారు.
Also Read : న్యూయర్ రోజు పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. షాకిచ్చిన బంగారం ధరలు
కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన సెంట్రలైజ్డ్ విధానం వల్ల బ్యాంక్ బ్రాంచ్ను సందర్శించాల్సిన అవసరం తప్పుతుంది. పెన్షన్ విడుదలైన వెంటనే ఆ మొత్తం బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా పింఛను పంపిణీ ఖర్చు కూడా తగ్గుతుందని ఈపీఎఫ్ఓ భావిస్తోంది. ఈపీఎఫ్ఓ వ్యవస్థను మరింత అధునాతనంగా మార్చాలని చూస్తున్న కేంద్రం..రానున్న రోజుల్లో ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.