Forbes Powerful Women| 2024 సంవత్సరానికి గాను ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన మహిళల 100 మంది జాబితాని ఫోర్బ్స్ పత్రిక ప్రచురించింది. ఫోర్బస్ పత్రిక ప్రచురించిన 21వ వార్షిక జాబితాతో బిజినెస్, రాజకీయాలు, దాతృత్వం, ఎంటర్టైన్మెంట్ రంగాలకు చెందినవారున్నారు. అయితే వీరిలో ముగ్గురు భారతీయ మహిళలు ఉండడం విశేషం.
భారత దేశం నుంచి ఉన్న ముగ్గురిలో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పారిశ్రామిక వేత్తలు రోష్ని నాడార్ , కిరణ్ మజూందార్ షా ఉన్నారు. నిర్మలా సీతారామన్ ఈ జాబితాలో 28వ స్థానం దక్కించుకోగా మిగతా ఇద్దరు 81, 82వ స్థానంలో నిలిచారు.
నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman ర్యాంక్ 28)
ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల జాబితాలో 28వ స్థానంలో ఉన్న నిర్మలా సీతారామన్ భారత ఫైనాన్స్ , కార్పొరేట్ వ్యవరాల మంత్రిత్వశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె 2019లో మొదటిసారి ఈ బాధ్యతలు చేపట్టారు. 2024 లోక్ సభ ఎన్నికల తరువాత రెండో సారి సీతారామన్ ఆర్థిక మంత్రి పదవి చేపట్టారు. ప్రపంచలోనే అయిదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం కొనసాగుతోంది. ప్రస్తుతం భారతదేశం ఆర్థికవ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్లకు చేరువలో ఉంది. ప్రపంచంలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న జపాన్, జర్మనీ ఆర్థిక వ్యవస్థలను ఇండియా జిడిపి వృద్ధితో 2027 కల్లా అధిమించనుంది. దీని వెనుక నిర్మలా సీతారామన్ చేపట్టిన కీలక ప్రాజెక్టులే కారణమని ఫోర్బ్ పత్రిక పేర్కొంది.
Also Read: ప్రపంచంలో ధనవంతుడైన బిచ్చగాడు.. ఎవరు, ఎక్కడుంటాడో తెలుసా?
మహిళలు ఆర్థికంగా ఎదగాలని వాదించే నిర్మలా సీతారామన్.. విద్య, పారిశ్రామిక రంగాలలో మహిళల కోసం పథకాలు ప్రవేశపెట్టారు. రాజకీయాల్లో ప్రవేశించే ముందు ఆమె బ్రిటన్ దేశంలోని అగ్రికల్చర్ ఇంజినీర్స్ అసోసియేషన్ లో కీలక పదువులు చేపట్టారు. ఇండియన్ నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ లో కూడా ఆమె సభ్యురాలిగా ఉన్నారు. 2021 ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారమన్ కు 37వ ర్యాంక్ దక్కింది.
రోష్ని నాడార్ (Roshni Nadar Malhotra ర్యాంక్ – 81)
సాఫ్ట్వేర్ దిగ్గజం హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైరపర్సన్ రోష్నీ నాడార్కు ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల జాబితాలో 81వ స్థానం దక్కింది. హెసిల్ కార్పొరేన్ లో ఆమె సిఈఓ కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె తండ్రి శివ్ నాడార్ 1976లో స్థాపించిన హెచ్సిఎల్ కంపెనీలో ఆమె తీసుకునే కీలక నిర్ణయాలతో ఈ రోజు కంపెనీ విలువ 12 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆమె కార్పొరేట్ రంగంలోనే కాకుండా సమాజ సేవలో కూడా రాణించారు. తన తండ్రి పేరిట ఉన్న శివ్ నాడార్ ఫౌండేషన్ లో ఆమె ట్రస్టీగా కొనసాగుతున్నారు. ఈ ట్రస్ట్ ఫౌండేషన్ ద్వారా ఆమె కొన్ని విద్యాసంస్థలు స్థాపించారు. వీటితోపాటు జంతు రక్షణ కోసం ఆమె పలు కార్యక్రమాలు చేపట్టారు. జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసిన రోష్ని నాడార్, కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబిఏ కూడా చేశారు. 2021 ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల జాబితాలో రోష్నినాడార్ 52వ స్థానంలో ఉన్నారు.
కిరణ్ మజూందార్ షా (Kiran Mazumdar-Shaw ర్యాంక్ – 82)
భారత దేశ ధనవంతుల్లో 91వ స్థానంలో కొనసాగుతున్న కిరణ్ మజూందార్ షా కు ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల జాబితాలో 82వ ర్యాంక్ సాధించారు. 1978లో ఆమె బయోకాన్ అనే బయోఫార్మసూటికల్ కంపెనీ స్థాపించి దానికి చైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు. బయోకాన్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఏషియా ఖండంలోనే అతిపెద్ద ఇన్సులిన్ తయారీ కంపెనీ అయిన బయోకాన్ అమెరికాలో కూడా తన మందులు సరఫరా చేస్తోంది. 2022లో వియాట్రిస్ అనే ఫార్మా కంపెనీకి బయోకాన్ కొనుగోలు చేసిన తరువాత కిరణ్ మజుందార్ షా బిజినెస్ విలువ 3.3 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో పాటు బయోకాన్ కంపెనీకి చెందిన బికారా థెరపాటిక్స్ సెప్టెంబర్ 2024లో నాస్డాక్ ఐపిఓ ద్వారా 360 మిలియన్ డాలర్లు సంపాదించింది. డాక్లర్ కావాలని తన జీవితంలో కలలు కన్న కిరణ్ మజూందార్ షా ఆ తరువాత భారత దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తగా అవతరించారు. 2019లో కిరణ్, ఆమె భర్త దివంగత జా షా యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్ గో కు 7.5 మిలియర్ డాలర్లు రీసెర్స్ కోసం విరాళం ఇచ్చారు.
ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల జాబితాలో ప్రథమ స్థానం జర్మనీ రాజకీయ నాయకురాలు, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సుల వోండర్లీయన్ ఉన్నారు. ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ 3వ స్థానంలో ఉన్నారు.