Hyderabad: దేశంలో రియల్ ఎస్టేట్ క్రమంగా పుంజుకుంటోంది. ఇటీవల ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. తాజగా మరొక సంస్థ కొత్త విషయాలను బయటపెట్టింది. దేశంలోని హైదరాబాద్ సిటీ ఖరీదైన మూడో హౌసింగ్ మార్కెట్గా నిలిచినట్టు తేల్చింది.
దేశంలో ఖరీదైన హౌసింగ్ మూడో మార్కెట్గా హైదరాబాద్
హైదరాబాద్లో ఐటీ, ఫార్మాతోపాటు మిగతా రంగాల విస్తరణ జోరందుకుంది. ఫలితంగా పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు తరలి వస్తున్నాయి. మెరుగైన మౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాలు వంటి అంశాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరుగుతోంది. ఇళ్ల ధరలు క్రమంగా పెరుగుతున్నప్పటికీ, కొనుగోలు శక్తిపై ఒత్తిడి ప్రభావం కొనసాగుతోంది.
సాధారణంగా ఓ వ్యక్తి ఆదాయంలో ఈఎంఐ 50 శాతానికి మించితే రుణాలు ఇచ్చేందుకు విముఖత చూపుతాయి బ్యాంకులు. హైదరాబాద్ సిటీ రోజురోజుకూ ఖరీదైనదిగా తయారు అవుతోంది. అత్యంత ఖరీదైన నివాస గృహాల విపణిగా హైదరాబాద్ మార్కెట్ దేశంలో మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ ఇల్లు కొనుగోలు చేయాలంటే ఓ కుటుంబం తమ ఆదాయంలో ఏకంగా 41 శాతాన్ని గృహ రుణాల ఈఎంఐలకు కేటాయిస్తున్నారు.
తొలి రెండు స్థానాల్లో ముంబై, ఎన్సీఆర్ ఢిల్లీ
ఈ విషయాన్ని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తన నివేదికలో వెల్లడించింది. 2026 తొలి అర్ధ సంవత్సరానికి అంటే జనవరి నుంచి జూన్ సంబంధించిన అఫర్డబిలిటీ ఇండెక్స్ నివేదికను విడుదల చేసింది.
ఈ సూచీ ట్రాక్ చేసిన 8 నగరాలలో ఆరు 50 శాతం గృహ కొనుగోలు సామర్థ్య పరిమితిలో ఉన్నాయి. ఈ స్థాయిని దాటితే బ్యాంకులు గృహ రుణాలను మంజూరు చేయడానికి వెనుకాడతాయి.
ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం, ఢిల్లీ ఎన్సిఆర్ వరుసగా 69 శాతం, 67 శాతంతో కొనసాగుతున్నాయి. దేశంలోని ఎనిమిది నగరాల్లో సర్వే నిర్వహించింది సదరు సంస్థ. 69 శాతంతో ముంబై అత్యంత ఖరీదైన మార్కెట్గా తొలి స్థానం దక్కించుకుంది. ఇక 67 శాతంతో ఢిల్లీ ఎన్సీఆర్ రెండో స్థానంలో నిలిచింది. ఇక హైదరాబాద్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
ALSO READ: సిక్ లీవ్స్పై సర్కార్ ఉక్కుపాదం.. ఒక్కరోజు లీవ్ పెట్టినా.. డాక్టర్ సర్టిఫికేట్ ఉండాల్సిందే!
అహ్మదాబాద్ 23 శాతంతో అత్యంత అందుబాటు ధరల మార్కెట్గా తన స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత స్థానాల్లో కోల్కతా- 25 శాతం, పుణె-28 శాతం, చెన్నై-29 శాతం, బెంగళూరు-35 శాతం నిలిచాయి. గతేడాదితో పోల్చితే హైదరాబాద్లో ధరల విషయంలో పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు. 2025తో పోలిస్తే బెంగళూరు, ఎన్సిఆర్లో కొనుగోలు శక్తి స్వల్పంగా క్షీణించిందింది.
ఈ కాలంలో ఇతర మార్కెట్లు చాలా వరకు స్థిరంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. పశ్చిమాసియాఘర్షణ వల్ల ఇంధన ధరలు పైపైకి వెళ్లడం, రుతుపవనాల పరిస్థితులపై అనిశ్చితిని ఉటంకిస్తూ ఆర్బిఐ ట్రైమాసిక ద్రవ్య విధాన పరపతి సమీక్షలో ఫిబ్రవరి-జూన్ రెండింటిలో రెపో రేటును 5.25 శాతంగా కొనసాగించింది.