Panna Diamond Mines: కేవలం రూ.200కే వజ్రాల గనిని లీజుకు తీసుకొని రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవ్వొచ్చంటే మీరు నమ్ముతారా?. ఇది అసాధ్యమని భావించినా.. ఇదే నిజం. మధ్యప్రదేశ్లోని ‘పన్నా’ జిల్లాకు వెళ్తే ఇలాంటి ఉదంతాలు ఎన్నో చూడవచ్చు. దేశంలోనే వజ్రాల గనిగా పేరున్న పన్నా జిల్లాలో ప్రభుత్వం ఇచ్చే చిన్న ప్లాట్లలో తవ్వకాలు జరిపి రూ.లక్షలు సంపాదించిన సామాన్యుల కథలు కళ్లకు కడతాయి. అయితే ఈ వ్యాపారంలో ఉన్న లాభనష్టాలు, చట్టపరమైన నిబంధనలు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
పన్నా ప్రాంతంలో పెద్ద ఎత్తున జరిగే మైనింగ్తో పాటు.. స్థానికులు, చిన్నపాటి కార్మికుల కోసం ‘ఆఫ్సైడ్ షాలో మైన్స్’ (చిన్న తరహా గనులు) కేటాయించే సంప్రదాయం ఉంది. జిల్లా యంత్రాంగం.. దాదాపు 8×8 మీటర్ల (64 చదరపు మీటర్లు) విస్తీర్ణం ఉన్న చిన్న ప్లాట్ను ఆరు నెలల కాలానికి రూ. 200 నామమాత్రపు రుసుముతో లీజుకు ఇస్తారు. అయితే రూ. 200లకే ప్లాట్ లభించినప్పటికీ.. తవ్వకానికి కావలసిన ఉపకరణాలు, శ్రమ, మట్టిని వేరు చేయడం వంటి పనులకు అయ్యే ఖర్చును లీజుదారుడే భరించాల్సి ఉంటుంది.
లీజుకు తీసుకున్న స్థలంలో దొరికినప్పటికీ ఆ వజ్రంపై పూర్తి హక్కు లీజుదారుడికి ఉండదు. దొరికిన వజ్రాన్ని వెంటనే ప్రభుత్వ వజ్రాల కార్యాలయంలో డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత అధికారులు దాని నాణ్యతను బట్టి వేలం వేస్తారు. తద్వారా వచ్చే ఆదాయంలో ప్రభుత్వ రాయల్టీ, పన్నులు, ఇతర డిడక్షన్లు మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని లీజుదారుడికి అధికారులు చెల్లిస్తారు.
లీజుకు తీసుకున్న ఫ్లాట్ లో వజ్రాలు పడతాయన్న గ్యారంటీ ఏమిలేదు. కానీ వజ్రాలు దొరికి.. కొందరి జీవితాలు మారిపోయిన ఉదంతాలు మాత్రం పన్నాలో చాలానే ఉన్నాయి. ఉదాహరణకు రాజు గోండ్ అనే సాధారణ కార్మికుడికి 19.22 క్యారెట్ల వజ్రం లభించగా.. దాని విలువ వేలంలో రూ. 80 లక్షల వరకు పలికింది. అలాగే స్వామిదిన్ పాల్ అనే రైతుకు సర్కోహా సమీపంలో ఏకంగా 32.8 క్యారెట్ల అత్యంత విలువైన వజ్రం దొరికింది. అధికారులు దాని విలువ రూ. 1 కోటికి పైగా ఉంటుందని అంచనా వేశారు. అలాగే ఆనందీలాల్ కుష్వాహాకు రూ. 200 లీజు ప్లాట్లో రూ. 50 లక్షల విలువైన 10.69 క్యారెట్ల వజ్రం లభించింది. ఇటీవల కాలంలో కూడా 17.96 క్యారెట్ల వజ్రాన్ని ఏడుగురు కార్మికులు కలిసి కనుగొని రూ.50 లక్షలకు పైగా లబ్ధి పొందారు.
Also Read: 120 ఏళ్ల నాటి రాక్షస చేప.. దోమల నివారణకు తెస్తే.. దీవినే మింగేస్తోంది..!
అయితే పన్నాలో వజ్రాల అన్వేషణ అనేది ఒక లాటరీ లాంటిది. కొన్ని వారాల పాటు శారీరక కష్టం, వేల రూపాయల పెట్టుబడి పెట్టి మట్టిని ఎంత వడబోసినా ఒక్కోసారి ఏమీ దొరక్కపోవచ్చు. కాబట్టి లీజుకు చెల్లించే రూ.200లే అసలు పెట్టుబడి కాదని గుర్తించాలి. లీజుదారుడు వెచ్చించే సమయం, కష్టం, ఆర్థిక పరమైన రిస్క్ మాత్రమే నిజమైన పెట్టుబడి కానుంది. అదృష్టం బాగుండి వజ్రం దొరికితే జీవితమే మారిపోతుంది. లేదంటే పెట్టిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అని స్థానికులు చెబుతుంటారు.
Also Read: నెలకు రూ.30k, 50k, లక్ష జీతమా? మీ సేవింగ్స్ ఎంత ఉండాలో.. పక్కా లెక్కలు ఇవే!