India Third Biggest Economy| భారత్ 2028 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ ఉన్న వినియోగ మార్కెట్గా భారత్ మారుతోందని, స్థూల ఆర్థిక స్థిరత్వానికి తోడు మెరుగైన మౌలిక సదుపాయాలతో ప్రపంచ ఉత్పాదకతలో భారత్ తన వాటాను పెంచుకుంటుందని తెలిపింది.
2023 నాటికి 3.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, 2026 నాటికి 4.7 ట్రిలియన్ డాలర్లకు విస్తరించడం ద్వారా యూఎస్, చైనా, జర్మనీ తర్వాత నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. 2028 నాటికి 5.7 ట్రిలియన్ డాలర్లతో జర్మనీని అధిగమించి భారత్ మూడవ స్థానానికి చేరుతుందని పేర్కొంది. 1990లో ప్రపంచంలో 12వ స్థానంలో ఉన్న భారత్, 2000 నాటికి 13వ స్థానానికి దిగజారిందని, తిరిగి 2020లో 9వ స్థానానికి మరియు 2023లో 5వ స్థానానికి మెరుగుపడిందని వివరించింది. ప్రపంచ జీడీపీలో 3.5 శాతంగా ఉన్న భారత్ వాటా 2029 నాటికి 4.5 శాతానికి చేరుతుందని తెలిపింది.
మోర్గాన్ స్టాన్లీ మూడు రకాల అంచనాలు
భారత ఆర్థిక ప్రగతి విషయంలో మోర్గాన్ స్టాన్లీ మూడు రకాల అంచనాలు వేసింది. ‘‘బేర్ కేసులో (ప్రతికూల పరిస్థితుల్లో) భారత ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి ఉన్న 3.65 ట్రిలియన్ డాలర్ల స్థాయి నుంచి 2035 నాటికి 6.6 ట్రిలియన్ డాలర్లకు విస్తరించొచ్చు. బేస్ కేసులో (తటస్థ పరిస్థితుల్లో) 8.8 ట్రిలియన్ డాలర్లకు, బుల్ కేసులో (సానుకూల పరిస్థితుల్లో) 10.3 ట్రిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుంది’’ అని తెలిపింది.
Also Read: పెట్టుబడి సున్నా.. నెలకు రూ. 60 వేలకుపైగా ఆదాయం
భారీగా విస్తరిస్తున్న భారత్ వినియోగ మార్కెట్
ప్రపంచంలో టాప్ వినియోగ మార్కెట్గా భారత్ అవతరించనుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వ్యక్తం చేసింది. ఇంధన పరివర్తన దిశగా భారత్ అతిపెద్ద మార్పును చూడనుందని, జీడీపీలో రుణ నిష్పత్తి పెరుగుతోందని, అదే సమయంలో జీడీపీలో తయారీ రంగం వాటా కూడా వృద్ధి చెందుతోందని పేర్కొంది.
కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ
ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. ‘‘ఇటీవలి వారాల్లో అధిక ఫ్రీక్వెన్సీ సంకేతాలు మిశ్రమంగా ఉన్నాయి. కానీ, కొన్ని నెలల క్రితంతో పోల్చి చూస్తే మెరుగ్గా ఉన్నాయి. ద్రవ్య, పరపతి విధాన మద్దతుకు తోడు, సేవల ఎగుమతులు పుంజుకోవడంతో 2024 ద్వితీయార్ధంలో మందగమనం నుంచి వృద్ధి కోలుకుంటుందని భావిస్తున్నాం’’ అని పేర్కొంది. 2024–25లో జీడీపీ 6.3 శాతం మేర, 2025–26లో 6.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది.
భారత్ జీడీపీ వృద్ధి 6.5 శాతం : మూడీస్ అంచనా
భారత జీడీపీ వృద్ధి 2025–26 సంవత్సరంలో 6.5 శాతానికి చేరుతుందని మూడీస్ అంచనా వ్యక్తం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.3% వృద్ధి అంచనా ఉంది. ప్రభుత్వం యొక్క అధిక మూలధన వ్యయాలు, పన్ను తగ్గింపులు, వడ్డీ రేట్ల తగ్గింపు వృద్ధికి అనుకూలంగా ఉంటాయని మూడీస్ పేర్కొంది. బ్యాంకింగ్ రంగం పట్ల స్థిరమైన దృక్పథాన్ని ప్రకటించింది, మరియు రుణ ఆస్తుల నాణ్యత మెరుగుపడిందని తెలిపింది.
2024 మధ్య నుంచి భారత ఆర్థిక వృద్ధి నిదానించి, తిరిగి వేగాన్ని పుంజుకుంటుందని మూడీస్ తెలిపింది. 2025–26లో ద్రవ్యోల్బణం 4.5%కి తగ్గొచ్చని అంచనా వేసింది. రుణాల వృద్ధి 11–13% మధ్య ఉండొచ్చని కూడా తెలిపింది. మూడీస్ ప్రకారం, భారత్ ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది.