Valentines Day Swiggy Chocolates Cakes Record Sales | చాక్లెట్లు, కేకులు, గులాబీలు, బంగారు ఆభరణాలు, టెడ్డీ బేర్ బొమ్మలు, ప్రముఖులు రాసిన పుస్తకాలు… ఇలా ఏదీ ప్రేమను వ్యక్తీకరించడానికి అనర్హం కాదన్నట్లుగా ఈసారి ప్రేమికుల రోజు సెలబ్రేషన్స్ సాగాయి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు, దంపతులు వాలెంటైన్స్ డేని ఓ పండుగలా జరుపుకుంటారు. గతంలో క్విక్ కామర్స్ లేని సమయంలో సమీపంలోని దుకాణానికి వెళ్లి పూలు లేదా గ్రీటింగ్ కార్డులు కొని.. తమ మనసును గెలిచిన వ్యక్తికి ఇచ్చి శుభాకాంక్షలు తెలిపేవారు.
కానీ, ఇప్పుడు ప్రతి వస్తువు కోసం ఈ-కామర్స్ సైట్ల వైపే చూస్తున్నాం కదా! ప్రేమికుల రోజు సందర్భంగా కూడా ప్రేమికులు ఈ సైట్లపైనే ఆధారపడ్డారు. గులాబీలు, చాక్లెట్లు, అందమైన బొమ్మలు మరియు ఇతర వస్తువులను ప్రేమికుల రోజు (శుక్రవారం) వివిధ ఈ-కామర్స్ సైట్ల ద్వారా రికార్డ్ స్థాయిలో కొనుగోలు చేశారు.
ఈ కామర్స్, క్విక్ కామర్స్ కు సీజన్
ప్రేమికుల రోజు సందర్భంగా జొమాటో, బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జెప్టో వంటి ప్లాట్ఫామ్లతో పాటు రెస్టారెంట్లు, ట్రావెల్ కంపెనీలు కూడా జతకట్టి లిమిటెడ్ ఎడిషన్ ప్రొడక్ట్లు మొదలుకొని వివిధ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్తో పాటు ఐజీపీ, ఫ్లవర్ఆరా, ఫ్లడ్ వంటి గిఫ్టింగ్ ప్లాట్ఫామ్లు పర్సనలైజ్డ్ మగ్స్, హార్ట్ షేప్ కుషన్లు మరియు ఇతర కానుకలను ప్రవేశపెట్టాయి.
దేశీయ స్టార్టప్లు కూడా వివిధ రంగాలలో పలు వస్తువులను ప్రవేశపెట్టాయి. చివరకు ఇండిగో ఎయిర్లైన్స్ కూడా ప్రత్యేక వాలెంటైన్స్ డే సేల్ను ప్రకటించి.. డిస్కౌంట్ రేట్లపై జంటలు విమానాల్లో ప్రయాణించే అవకాశాన్ని అందించింది.
ధర ఎంతైనా సరే!
ఈ-కామర్స్ సంస్థలు ప్రేమికుల రోజు రష్ను బాగా ఉపయోగించుకున్నట్లు ఫెర్షన్ ఎన్పెటల్స్ వెబ్సైట్ పేర్కొంది. ప్రేమికుల రోజు ప్రత్యేకంగా అధిక ధరలకు పలు వస్తువులను అమ్మినట్లు తెలిపింది.
పలు గిఫ్ట్ హ్యాంపర్ల ధర రూ. 90,000 పైన ఉంది. చాక్లెట్ల ధరలు రూ. 499 నుండి రూ. 82,999 (ఐఫోన్ సహితంగా) వరకు ఉన్నాయి. డైసన్ ఎయిర్వ్రాప్ ఫ్యాన్సీ ప్యాకింగ్ హ్యాంపర్ను రూ. 46,999కు విక్రయించారు. ఫిబ్రవరి 14న తమ ప్లాట్ఫామ్లపై రికార్డ్ విక్రయాలను పలు ఈ-కామర్స్ సంస్థలు ప్రకటించాయి.
ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి 24 ఆర్డర్ల ద్వారా 174 చాక్లెట్లను రూ. 29,844కు కొనుగోలు చేశాడు.
14న పీక్ టైమ్లో నిమిషానికి 581 చాక్లెట్లు, 324 గులాబీలకు ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ ఇన్స్టామార్ట్ ప్రకటించింది.
ప్రేమికుల రోజున 4 లక్షల గులాబీలకు ఆర్డర్లు వచ్చినట్లు ఎఫ్ఎన్బీ తెలిపింది. ఈ నెల ప్రారంభం నుండి 13వ తేదీ వరకు 15 లక్షల గులాబీలు విక్రయించినట్లు వెల్లడించింది.
ఫిబ్రవరిలో మొదటి 11 రోజుల్లోనే యూనీకామర్స్ యూనీవేర్ ప్లాట్ఫామ్ కోటికి పైగా బహుమతి వస్తువులను విక్రయించింది.
Also Read: టీ అమ్ముతూ.. రూ.10 వేల కోట్లు సంపాదించాడు.. బిజినెస్ ఐడియా పవర్ మరి!
స్విగ్గీకి భారీ ఆర్డర్లు
ప్రేమికుల రోజు సందర్భంగా స్విగ్గీకి భారీగా కేక్ ఆర్డర్లు వచ్చాయి. ఇప్పటి వరకు ఇదే ఆల్ టైమ్ రికార్డ్ అని ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ ఫుడ్ మార్కెట్ప్లేస్ సీఈఓ రోహిత్ కపూర్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వాలెంటైన్స్ డే రోజును సెలబ్రేట్ చేసుకోవడానికి స్విగ్గీ ప్లాట్ఫామ్ను ఉపయోగించారు. గతంలో ఇప్పటి వరకు పొందనన్ని కేక్ ఆర్డర్లు ఆ రోజు వచ్చినట్లు పేర్కొన్నారు. నోయిడాకు చెందిన ఒక వినియోగదారు ఏకంగా రూ. 25,335 విలువైన ఆర్డర్ పెట్టారు. ఈ ఆర్డర్లో థియోస్ నుండి తొమ్మిది కేకులు, ప్రీమియం పాటిస్సేరీ, చాక్లెట్లు ఉన్నాయి. ఈ సందర్భంగా, “ప్రేమంటే ఇదే, దానిని పంచుకున్నప్పుడు అది పెరుగుతుంది” అని కపూర్ అన్నారు.
స్విగ్గీ యాప్ నుండి నిమిషానికి 607 కేక్ డెలివరీలు జరిగాయి. అత్యధికంగా ఆర్డర్ చేసిన వాటిలో కేక్ మిల్క్ చాక్లెట్ ఉంది. బెంగళూరులోనే అత్యధికంగా కేకులు ఆర్డర్ చేసుకున్నట్లు సీఈఓ పేర్కొన్నారు. ఈ సంవత్సరం ప్రేమ వేడుక చాలా మధురంగా ఉందని అన్నారు.
లుధియానా, అమృత్సర్, షిల్లాంగ్, నోయిడా, ఆగ్రాలలో వాలెంటైన్స్ డే రోజు ఫుడ్ డెలివరీ ఎక్కువగా జరిగింది. స్విగ్గీ బోల్ట్ తిరుపూర్లోని ఎన్ఐసీ ఐస్ క్రీమ్స్ నుండి 3.4 నిమిషాల్లో ఆర్డర్ను స్వీగ్గీ డెలివరీ చేసిందని రోహిత్ కపూర్ తెలిపారు.